తుది దశలో ధాన్యం కొనుగోళ్లు

యాసంగి ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో తుది దశకు చేరాయి. పౌరసరఫరాల సంస్థ బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 59.77 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.

Published : 09 Jun 2023 03:20 IST

రాష్ట్రవ్యాప్తంగా 59.77 లక్షల టన్నుల సేకరణ
తొలి రెండు స్థానాల్లో నల్గొండ, నిజామాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో తుది దశకు చేరాయి. పౌరసరఫరాల సంస్థ బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 59.77 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,034 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం రావడం ఆగడంతో 3,847 కేంద్రాలను మూసివేసినట్లు కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 80.46 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలనేది సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లక్ష్యం. కానీ... కోతలకు ముందు కురిసిన అకాల వర్షాలతో పొలాల్లోని వరికి తీవ్రనష్టం వాటిల్లింది. అప్పటికే కోసిన రైతులకూ కష్టాలు తప్పలేదు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయడంలో జాప్యం జరగడంతో ధాన్యం తడిసింది. అనంతరం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసిన అధికారులు సేకరణ లక్ష్యాన్ని 80.46 లక్షల టన్నుల నుంచి 62.15 లక్షల టన్నులకు కుదించారు. ఇప్పటివరకు 59.77 లక్షల టన్నులను సేకరించడంతో ప్రక్రియ తుది దశకు చేరినట్లు చెబుతున్నారు. అయితే పలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం గణనీయంగా ఉంది. ప్రస్తుతం 3,187 కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి.

* ఇప్పటివరకు 9,81,700 మంది రైతుల నుంచి రూ.12,289.67 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు కార్పొరేషన్‌ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా నల్గొండలో 6,73,481 టన్నులు కొన్నారు. నిజామాబాద్‌ 6,27,834 టన్నులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 652 టన్నుల ధాన్యమే కొన్నారు. ఇక్కడ వరి సాగు చాలా తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని