KCR Nutrition Kit: కాబోయే అమ్మలకు అండగా..

గర్భిణులకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ అమలు చేయనుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను పంపిణీ చేయనుంది.

Updated : 09 Jun 2023 08:21 IST

14న 24 జిల్లాల్లోని గర్భిణులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ
6.84 లక్షల మందికి రూ.274 కోట్ల వ్యయం
తొమ్మిది జిల్లాల్లో సత్ఫలితాలతో రాష్ట్రమంతా అమలు

ఈనాడు, హైదరాబాద్‌: గర్భిణులకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ అమలు చేయనుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను పంపిణీ చేయనుంది. గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు కానుంది. సుమారు ఏడు లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రూ.274 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది.  ప్రధానంగా మాతృ మరణాల రేటు తగ్గింపులో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు కీలకంగా మారుతాయని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన గర్భిణులకు పౌష్టికాహార కిట్‌లను అందజేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు రెండు పర్యాయాలుగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేశారు. ఈ తొమ్మిది జిల్లాల్లో పథకం ప్రయోజనాలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధ్యయనం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా అందులో వెల్లడైంది.

మహిళల నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు ప్రధాన సమస్య అయిన రక్తహీనత చాలావరకు పరిష్కారమైనట్లు గుర్తించారు. గ్రామీణ మహిళలతో పాటు పట్టణాలు, నగరాల్లోనూ మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో వెల్లడైంది. హిమోగ్లోబిన్‌ శాతం ఏడు కంటే కూడా తక్కువ ఉంటుండటంతో ఇది గర్భిణుల ఆరోగ్యంతో పాటు జన్మించే శిశువు ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధ్యయనం అనంతరం అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్‌ కిట్‌ల పథకం అమలుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 6.84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. కిట్‌లను రెండు విడతలుగా అందించనున్నారు. తొలుత గర్భిణికి 14-26 వారాల సమయంలో ఒకసారి, 27-34 వారాల సమయంలో మరోసారి పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మాతృ మరణాలు లక్షకు 43 నమోదవుతుండగా.. దేశంలో మూడో స్థానంలో ఉంది. తొమ్మిదేళ్లలో 92 నుంచి 43కు తగ్గాయని, మరింత తగ్గించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ల పంపిణీ కీలకమని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గర్భిణులకు ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, ఐరన్‌ అందించి రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతం పెంచడం న్యూట్రిషన్‌ కిట్ల లక్ష్యమని తెలిపారు. ఒక్కో కిట్‌కు రూ.2,000 వ్యయం కానుండగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి రూ.274 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని