పరీక్షల నిలిపివేత సమస్యకు పరిష్కారం కాదు

ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 10 Jun 2023 05:26 IST

దీనికోసం మరో సంస్థపై ఆధారపడలేం
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేయలేం
అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. లీకేజీ వ్యవహారం బయటపడడంతో పరీక్షలను రద్దుచేసి తిరిగి నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చేస్తున్న ప్రయత్నాలను గౌరవించాలని పేర్కొంది. పరీక్షల నిర్వహణకు రాజ్యాంగ సంస్థ అయిన టీఎస్‌పీఎస్సీ కాకుండా మరో సంస్థపై ఆధారపడలేమని తేల్చిచెప్పింది. 3.80 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయలేమని అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్‌.మురళీధర్‌రెడ్డి అప్పీలు దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది సుధీర్‌ వాదనలు వినిపిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలను హడావుడిగా నిర్వహించాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పరీక్ష పత్రాలు లీక్‌ అయ్యాయని ప్రతి ఒక్కరినీ అనుమానించడం సరికాదని పేర్కొంది. లీకేజీపై దర్యాప్తు కొనసాగుతోందని, దాన్ని న్యాయవ్యవస్థ చూసుకుంటుందని, అది పూర్తయ్యే దాకా పరీక్షలు నిర్వహించరాదనడం సరికాదంది. పిటిషనర్‌ కోరినట్లు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే అది పూర్తవడానికి 20 ఏళ్లు పడుతుందని, అప్పటివరకు పరీక్షలు నిర్వహించకూడదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌, టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావులు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంటూ, అప్పీలును కొట్టివేసింది.

సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి...

టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజినీరు, డిప్యూటీ ఏవో ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి సిట్‌ నిర్వహిస్తున్న దర్యాప్తుపై సమగ్ర వివరాలతో మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరును పరిశీలిస్తే సిట్‌ దర్యాప్తుపై ఒక అంచనాకు వచ్చి సీబీఐకి అప్పగించాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించవచ్చంది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు సిట్‌ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

ఆ నలుగురినీ పరీక్షలకు అనుమతించండి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలగొప్పుల సురేష్‌, దామెర రమేష్‌కుమార్‌, షమీమ్‌, సాయి సుస్మితలను గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు అనుమతించాలంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న జరుగుతున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తోపాటు ఇతర శాఖాపరమైన పరీక్షల్లో పాల్గొనకుండా డిబార్‌ చేయడాన్ని సవాలు చేస్తూ రమేష్‌కుమార్‌ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ పి.మాధవీదేవి కమిషన్‌కు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పిటిషనర్లకు హాల్‌టిక్కెట్‌లు అందజేసి పరీక్షలకు అనుమతించాలని, అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ టీఎస్‌పీస్సీ శనివారం హౌస్‌మోషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు