TSLPRB: పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 14 నుంచి

ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను ఈ నెల 14 నుంచి 26 వరకు పరిశీలించనున్నారు.

Published : 10 Jun 2023 07:07 IST

రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను ఈ నెల 14 నుంచి 26 వరకు పరిశీలించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి 18 కేంద్రాల్ని ఎంపిక చేసింది. రోజుకు సగటున దాదాపు 9 వేల మంది చొప్పున మొత్తం 1,09,906 మంది పత్రాల్ని పరిశీలించనున్నారు. ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 13న రాత్రి 8 గంటల వరకు అభ్యర్థుల ఇంటిమేషన్‌ లెటర్లను మండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రక్రియ సాగుతుంది ఇలా..

* అభ్యర్థులకు కేటాయించిన తేదీన ఉదయం 9 గంటలకు ఆయా కేంద్రంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఇంటిమేషన్‌ లెటర్‌ను తప్పనిసరిగా చూపించాలి.

* దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు నేరుగా పత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. ఒకవేళ సవరణల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకొని ఉంటే ఆ ప్రతిని తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణల్ని మండలివర్గాలు ఆమోదిస్తాయి.

* డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి కొన్ని పోస్టుల్లో అదనపు మార్కులు కలపనున్నట్లు నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు సంబంధిత వివరాలను అందజేయాలి.

* ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫొటోకాపీలను తీసుకురావాలి. వాటిని పరిశీలించిన అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని