వారంలో గౌరవెల్లి జలాశయం పనులు పూర్తి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు తుది దశకు చేరాయని, మరో వారం రోజుల్లో పూర్తవుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 10 Jun 2023 05:10 IST

మంత్రి హరీశ్‌రావు వెల్లడి
రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసింది భారాస ప్రభుత్వమేనని స్పష్టీకరణ

అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం), సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులు తుది దశకు చేరాయని, మరో వారం రోజుల్లో పూర్తవుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు. దీంతో హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగునీటి కల నెరవేరనుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన.. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఇక్కడి మెట్ట ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాది పొడవునా సాగునీరందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జలాశయం సామర్థ్యాన్ని 1.41 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారని వివరించారు. భూ నిర్వాసితులకు పరిహారాల చెల్లింపు పూర్తయిందని తెలిపారు. మంత్రి వెంట జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, స్థానిక నేతలు ఉన్నారు.

భాజపా క్షమాపణ చెప్పాలి

రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతిస్తే, తామే ఏర్పాటు చేసినట్లు భాజపా ప్రగల్భాలు పలుకుతోందని హరీశ్‌రావు మండిపడ్డారు. చేయని పనికి డబ్బా కొడుతున్న భాజపా నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 21 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో మంత్రి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకుండా మోసం చేసిందని విమర్శించారు. కరీంనగర్‌కు వైద్య కళాశాల కావాలని ఎనాడైనా బండి సంజయ్‌ దరఖాస్తు పెట్టారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో కనీస సదుపాయాలు లేవని, అందులో చదివే విద్యార్థులు ఆగమవుతున్నారని వాపోయారు. తెెలంగాణపై భాజపాకు ప్రేమ ఉంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సంక్షేమ నిధులు రూ.1350 కోట్లు పెండింగ్‌లో పెట్టారని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాటిని ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని