TREI - RB: ‘గురుకుల’ అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన

గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఐచ్ఛికాలు ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తెలిపింది.

Updated : 22 Sep 2023 08:44 IST

అన్ని ఐచ్ఛికాలు నమోదు తప్పనిసరి

గడువులోగా చేస్తేనే దరఖాస్తు ముందుకు

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఐచ్ఛికాలు ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఐచ్ఛికాలు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్‌ ప్రాతిపదికన పోస్టులు దక్కేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని బోర్డు వెల్లడించింది. గురుకుల ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు అన్ని ఐచ్ఛికాలు ఇస్తేనే దరఖాస్తు ముందుకు వెళ్తుందని, లేకుంటే నిలిచిపోతుందని స్పష్టం చేసింది. పరీక్షలు రాసిన టీజీటీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ, మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 వరకు గడువులోగా ఐచ్ఛికాలు నమోదు చేయాలంది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇప్పటికే సీబీఆర్‌టీ పరీక్షలు పూర్తిచేసి, తుదికీ, అభ్యర్థుల జవాబుపత్రాలను వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచింది. 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేసిన తరువాతే సొసైటీల వారీగా ఐచ్ఛికాలు తీసుకోవాలంటూ కొందరు ఉద్యోగార్థులు వ్యక్తం చేసిన సందేహాలపై బోర్డు వివరణ ఇచ్చింది.

దరఖాస్తు సమయంలో తీసుకోనందునే...

గురుకుల పోస్టులకు సంబంధించి.. డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీలు, కళాశాలల్లో లైబ్రేరియన్లు, పీడీలకు దరఖాస్తు సమయంలోనే బోర్డు ఐచ్ఛికాలు తీసుకుంది. ఇవన్నీ మల్టీజోనల్‌ పోస్టులు కావడంతో ఐచ్ఛికాల సంఖ్య తక్కువగా ఉంది. ఒక్కో పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు మహిళా కళాశాలలతో కలిపి 20 ఐచ్ఛికాలు ఇచ్చారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులన్నీ జోనల్‌ పోస్టులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో పురుష అభ్యర్థి 35 ఐచ్ఛికాలు, మహిళా అభ్యర్థి 70 ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఐచ్ఛికాలు తీసుకుంటే సాంకేతికంగా దరఖాస్తుపై తీవ్ర ప్రభావంతో పాటు అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని తీసుకోలేదు. పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం సొసైటీలు, జోన్లవారీగా ఐచ్ఛికాలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. గత నియామకాల్లో అభ్యర్థులు కొన్ని సొసైటీలను ఐచ్ఛికాలుగా పెట్టుకున్నందున పోస్టులు సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని సొసైటీలు, అన్ని జోన్లకు ఐచ్ఛికాలు తప్పనిసరి చేయడం ద్వారా ప్రతిభ ఉన్న అభ్యర్థులు పోస్టులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బోర్డు పేర్కొంది.

త్వరలోనే గురుకుల డిగ్రీ 1:2 జాబితా

గురుకుల డిగ్రీ పోస్టులకు ఈనెలాఖరు నాటికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు వెల్లడించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు డెమో తరగతులు ఉన్నాయి. జనరల్‌ మెరిట్‌ ర్యాంకు జాబితా విధానం కింద మార్కులు వెల్లడిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని బోర్డు ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో డెమో తరగతులున్న పోస్టులకు జనరల్‌ ర్యాంకు జాబితా వెల్లడించకూడదని భావిస్తోంది. డెమో తరగతులు లేని పోస్టులపై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.


మెరిట్‌ లిస్టు ర్యాంకుల ఖరారు ఇలా: టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థుల జనరల్‌ ర్యాంకు జాబితా తయారీ ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ స్పష్టతనిచ్చింది. బుధవారం ఏఈఈ పోస్టుల జనరల్‌ ర్యాంకు జాబితాను వెల్లడించింది. రాతపరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే.. ర్యాంకుల ఖరారు ఎలా అన్నదానిపై వివరణ ఇచ్చింది. అభ్యర్థి స్థానికతను పరిగణనలోకి తీసుకుంటుంది. తర్వాత పుట్టినతేదీ.. అది ఒకటే అయితే పోటీ పరీక్ష సబ్జెక్టులో వచ్చిన మార్కులు (జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ మినహా) తీసుకుని ఉన్నత ర్యాంకు ఇస్తుంది. ఇవీ సమానమైతే అభ్యర్థి విద్యార్హత.. పరీక్ష పాసైన ఏడాదిని లెక్కలోకి తీసుకుంటుంది. అదీ ఒకటే అయితే విద్యార్హత పరీక్షలో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థికి మెరుగైన ర్యాంకు కేటాయిస్తుంది. అక్కడా సమాన మార్కులుంటే ఉన్నత విద్యార్హత.. తర్వాత అందులో మార్కుల శాతం చూస్తామని.. వీటన్నింటిపైనా తమ నిర్ణయమే అంతిమమని కమిషన్‌ స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు