వానలో వాగు ఒడ్డునే.. బిడ్డకు జననం

పురిటి నొప్పులతో ఉన్న ఆదివాసీ మహిళ ఆసుపత్రికి వెళ్లేందుకు.. వర్షంలో, వాగు దాటాల్సిన పరిస్థితి.

Updated : 22 Sep 2023 05:20 IST

పురిటి నొప్పులతో ఉన్న ఆదివాసీ మహిళ ఆసుపత్రికి వెళ్లేందుకు.. వర్షంలో, వాగు దాటాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది వాగు ఒడ్డునే గొడుగు కింద ఆమెకు పురుడు పోశారు. తల్లీబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం దొంగచింత పంచాయతీ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది దొంగచింతకు చేరుకొన్నారు. అక్కడి నుంచి చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దానికితోడు ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ప్రవహిస్తోంది. దీంతో 108 సిబ్బంది రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వాగు దాటారు. వాగు ఒడ్డు వరకు వచ్చిన గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళలతో కలిసి సిబ్బంది గొడుగు కిందే పురుడు పోశారు. అనంతరం వారిని జాగ్రత్తగా వాగు దాటించి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది ఈఎంటీ శంకర్‌, పైలట్‌ సచిన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్‌టుడే, ఉట్నూరు గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని