మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా

‘‘మా నాన్న ప్రజా జీవితంలో ఉండటం వల్ల మాతో గడిపేది తక్కువ సమయం. మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్యకు కూడా ఓర్పు ఎక్కువ. నా చెల్లి చాలా డైనమిక్‌.

Published : 20 Nov 2023 05:39 IST

నా చెల్లి చాలా డైనమిక్‌
వివిధ రంగాలకు చెందిన మహిళలతో భేటీలో మంత్రి కేటీఆర్‌
అతివలకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తామని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మా నాన్న ప్రజా జీవితంలో ఉండటం వల్ల మాతో గడిపేది తక్కువ సమయం. మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్యకు కూడా ఓర్పు ఎక్కువ. నా చెల్లి చాలా డైనమిక్‌. మా కుటుంబంలో తనంత ధైర్యవంతులు లేరు. నా కుమార్తె చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కుమార్తె పుట్టాక నా జీవితం చాలా మారింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే. కొవిడ్‌ వంటి క్లిష్ట సమయాల్లో సుచిత్ర ఎల్ల, మహిమా దాట్ల వంటి వారు గొప్ప అండగా నిలిచారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘భవిష్యత్‌ తెలంగాణలో మహిళలు’ అంశంపై వైద్యులు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, సినిమా తదితర రంగాలకు చెందిన మహిళలతో కేటీఆర్‌ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే అతివలకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తాం. డిసెంబరు 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఎజెండా మీరే తయారు చేయండి. మళ్లీ అధికారంలోకి రాగానే చర్చించి అమలు చేద్దాం’’ అని పేర్కొన్నారు.

మహిళల అభ్యున్నతికి ఎన్నో చేశాం.. ఇంకా చేయాలి..

మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా కేటీఆర్‌ వివరించారు. ‘‘ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాం. మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించాం. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశాం. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 61 శాతానికి పెరిగాయి. కేసీఆర్‌ కిట్‌ అమలు చేయడం వల్ల ప్రసూతి మరణాలను తగ్గించగలిగాం. స్త్రీనిధి కింద స్వయంసహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. అలా రుణాలు పొందిన మహిళల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారు. తీసుకున్న రుణాలతో మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి విజయాలు సాధిస్తుండడం సంతోషాన్నిస్తోంది. స్త్రీల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం, కల్యాణలక్ష్మి, అమ్మఒడి వంటివి అందుబాటులోకి తీసుకొచ్చింది. సుల్తాన్‌పూర్‌, నందిగామ సహా మొత్తం 4 చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశాం. రక్షణపరంగా ఇప్పటికే షీ టీమ్స్‌, టోల్‌ఫ్రీ నంబరు లాంటివి తీసుకొచ్చాం. మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వారు తమ వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ల హక్కుల గురించి తెలుసుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళనలకు కౌన్సెలింగ్‌ అందిస్తారు. మహిళల కోసం మరిన్ని చేయాల్సి ఉంది. రూ.400కి గ్యాస్‌ సిలిండర్‌ను ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. నెగెటివ్‌ బ్లడ్‌గ్రూప్‌ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానున్నాం. చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇంకా రావాలి కూడా’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


‘డీప్‌ ఫేక్‌’తో ప్రమాదమే..

డీప్‌ ఫేక్‌ వీడియోల వల్ల మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నేతలకు కూడా ప్రమాదమేనని కేటీఆర్‌ ఆందోళన వెలిబుచ్చారు. తమ ప్రత్యర్థులు డీప్‌ ఫేక్‌ వాడి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలు ఒక్కోసారి విషపూరితంగా తయారవుతున్నాయన్నారు. నల్సార్‌ విశ్వవిద్యాలయంతో కలిసి సైబర్‌ క్రైమ్‌ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మాట్లాడే హక్కు ఉంది కదా అని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదన్నారు. ప్రతిపక్షాలకు కూడా భారాసయే గెలుస్తుందని తెలుసని, కానీ అది ఒప్పుకోవడం ఇష్టం లేక నటిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని