చౌక ధరలో కరోనా మందు బిళ్ల!

దేశంలో కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత, అధిక ధరలు, మరోవైపు నిండుకుంటున్న ఆక్సిజన్‌ నిల్వలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా మందు బిళ్ల రూపంలో ఉండే చౌకైన ఔషధం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వచ్చే

Updated : 28 Apr 2021 07:33 IST

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు ప్రత్యామ్నాయం
3-6 నెలల్లో అందుబాటులోకి
గాలి నుంచి ఆక్సిజన్‌ సేకరించే వెంటిలేటర్‌ సాంకేతికత నెలలో సిద్ధం
‘ఈనాడు ముఖాముఖి’లో ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

దేశంలో కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత, అధిక ధరలు, మరోవైపు నిండుకుంటున్న ఆక్సిజన్‌ నిల్వలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా మందు బిళ్ల రూపంలో ఉండే చౌకైన ఔషధం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ తెలిపారు. గాలి నుంచి ఆక్సిజన్‌ సేకరించే వెంటిలేటర్ల సాంకేతికత సిద్ధమవుతోందన్నారు. ఇంకా వైద్యుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్‌ మాస్క్‌ తయారీతో పాటు కరోనా నిరోధానికి ఐఐసీటీ చేపట్టిన వివిధ పరిశోధనలు, వాటి ప్రయోజనాలపై మంగళవారం ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో తొలిసారి వివరించారు.
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. దీనికి ప్రత్యామ్నాయం లేదా?
కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మందుబిళ్ల రూపంలో ఔషధం తయారీకి అమెరికా సంస్థ మెర్క్‌ ఒక ఫార్ములా రూపొందించింది. దీనిని ఉపయోగించి కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ)-తిరువనంతపురం ఓ ఔషధాన్ని తయారు చేస్తోంది. దీనిని అతి తక్కువ ధరకు దేశం అంతటా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫేజ్‌ 2 పరిశోధన జరుగుతోంది. ఆ తరువాత దశ పరిశోధనలు పూర్తయి అమెరికా నుంచి అనుమతి లభిస్తే మూడు లేక ఆరు నెలల్లో ఈ మందు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.  
గాలి నుంచి ఆక్సిజన్‌ సేకరించి అందించే వెంటిలేటర్‌ మాస్క్‌లపై దృష్టిపెట్టారు. ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది?
గాలి నుంచి ఆక్సిజన్‌ను సేకరించి శుద్ధి చేసి రోగికి అందించే వెంటిలేటర్ల తయారీపై దెహ్రాదూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ సంస్థ, చంఢీగఢ్‌లోని సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి దృష్టిపెట్టాయి. ఈ ప్రయోగంలో ఐఐసీటీ కూడా భాగమైంది. నెల రోజుల్లో ఈ టెక్నాలజీ సిద్ధమవుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలానే రెడ్డీస్‌ పౌండేషన్‌ ఆర్థిక సహాయంతో సరికొత్త మాస్క్‌ టెక్నాలజీని రూపొందించాం. ఈ మాస్క్‌ మల్టీలేయర్‌గా ఉంటుంది. దీనిపై ప్రతేకంగా తయారు చేసిన కెమికల్‌ వాడాం. మాస్క్‌పై కరోనా వైరస్‌ పడితే ఈ కెమికల్‌ వెంటనే నాశనం చేస్తుంది. 90 సార్లు ఈ మాస్క్‌ను ఉతికి ఉపయోగించవచ్చు. వివిధ సంస్థలతో ఇలాంటివి లక్ష తయారుచేసి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయించాం. ఏ సేవా సంస్థ ముందుకు వచ్చినా ఈ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
వైద్యులకు తోడ్పాటుగా ఉండేందుకు సరికొత్త మాస్క్‌ల తయారీ ఎంతవరకు వచ్చింది?
రోగులకు చికిత్స అందించే క్రమంలో సాధారణ మాస్క్‌లతో రక్షణ లభించక అనేకమంది వైద్యులు, సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు కంపెనీతో కలిసి వైద్యుల కోసం ప్రత్యేక మాస్క్‌ల తయారీ టెక్నాలజీ మీద దృష్టిపెట్టాం. అనేక లేయర్లతో ఉండే ఈ మాస్క్‌ మధ్యలో ఆక్సిజన్‌ ఫిల్టర్‌కు చిన్న ఫ్యాన్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ వ్యవస్థ గాలిలో ఆక్సిజన్‌ను మాస్క్‌ లోపలికి పంపిస్తుంది. దీంతో ఇది ధరించినవారికి ఆక్సిజన్‌ సులభంగా అందుతుంది. వారం రోజుల్లో ఈ టెక్నాలజీ సిద్ధమవుతుంది.

కరోనా వ్యాక్సిన్ల రూపకల్పనలో భారత్‌బయోటెక్‌, సీరం సంస్థలకు ఐఐసీటీ ఎలాంటి తోడ్పాటు అందించింది?
భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ ప్రభావాన్ని పెంచేందుకు ఓ సహాయ ఔషధ (అడ్జువెంట్‌) సాంకేతికతను రూపొందించి అందజేశాం. భారత్‌బయోటెక్‌ ఈ టెక్నాలజీని రెండు సంస్థలకు అందజేసి వాటి నుంచి ఆ రసాయనాన్ని పొందుతోంది. దీనిని వ్యాక్సిన్‌లో కలపడం వల్ల దాని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. కొవిషీల్డ్‌ టీకా తయారు చేస్తున్న సీరం సంస్థ ఇదే కెమికల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సీరం సంస్థ కోరితే ఈ టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ఏ రకంగా తోడ్పాటు కావాలన్నా అందజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని