NEET: రేపు 115 కేంద్రాల్లో నీట్‌.. పరీక్ష సమయం 20 నిమిషాలు పెంపు

వైద్యవిద్య (యూజీ) నీట్‌ 2022-23లో ప్రవేశాల కోసం ఈనెల 17న పరీక్ష జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకూ నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌

Updated : 16 Jul 2022 07:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్య (యూజీ) నీట్‌ 2022-23లో ప్రవేశాల కోసం ఈనెల 17న పరీక్ష జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకూ నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. ఈసారి 20 నిమిషాల సమయాన్ని అదనంగా కల్పించారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని ఇవ్వగా.. ఇందులో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాలి. గతేడాది 200 ప్రశ్నలిచ్చి 180 నిమిషాల్లోనే 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చేది. దీంతో ఆ అదనపు 20 ప్రశ్నలను చదువుకొని, అర్థం చేసుకొని, సమాధానం ఇవ్వడానికి సమయం సరిపోయేది కాదు. ఇప్పుడా విషయంలో ఆందోళన తప్పింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హయత్‌నగర్‌ తదితర 25 పట్టణాలోని 115 కేంద్రాల్లో నీట్‌ను నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నీట్‌ను రాయొచ్చు. తెలంగాణలో సుమారు 60 వేల మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందు అంటే మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు.

గంట ముందు పరీక్ష కేంద్రానికి..

అభ్యర్థులు రిపోర్టింగ్‌ సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయానికంటే కనీసం అరగంట ముందుగా కేంద్రానికి చేరుకుంటే మేలు.

విద్యార్థులు నిబంధనలను పాటించకపోయినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్‌ చేయడానికి అవకాశముంటుంది.

ఇది పెన్‌, పేపర్‌ ఆధారిత పరీక్ష. విద్యార్థులు ఏ కారణంతోనైనా జవాబుపత్రం నుంచి ఏపేజీని కూడా చించకూడదు.

అభ్యర్థులు నీట్‌ అడ్మిట్‌ కార్డు వంటి డాక్యుమెంట్లపై ఎలాంటి ట్యాంపరింగ్‌ చేయకూడదు. దరఖాస్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్‌ కార్డుపై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయొద్దు.

విద్యార్థులు అడ్మిట్‌ కార్డ్‌, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.

పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఉదాహరణకు పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డు వంటివి ఏవైనా తీసుకెళ్లవచ్చు.

కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు తప్పనిసరి.

అభ్యర్థులు అనారోగ్యంతో బాధపడుతుంటే.. సంబంధిత వైద్యుడి సూచనల చీటీని చూపించి మందులు, పారదర్శకంగా ఉండే నీళ్ల సీసాను తీసుకెళ్లవచ్చు.

50 మిలీ చిన్న హ్యాండ్‌ శానిటైజర్‌ను వెంట ఉంచుకోవచ్చు.

అభ్యర్థులు ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి పోగులు, ముక్కు పిన్‌లు, గొలుసులు, నెక్లెస్‌లు, బ్యాడ్జ్‌లు, హెయిర్‌పిన్లు, హెయిర్‌ బ్యాండ్‌లు, తాయెత్తులు, గాగుల్స్‌, హ్యాండ్‌ బ్యాగులు తదితర ఆభరణాలను ధరించరాదు.

ఏ తరహా కాగితాలు, కాగితపు ముక్కలు, పెన్నులు, పెన్సిళ్లు, పెన్సిల్‌ బాక్సు, పర్సు, కాలిక్యులేటర్‌, స్కేల్‌, పెన్‌ డ్రైవ్‌లు, రబ్బరు, ఎలక్టాన్రిక్‌ పెన్‌, స్కానర్‌, ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్లు, మైక్రోఫోన్‌, పేజర్‌, హెల్త్‌ బ్యాండ్‌, చేతి గడియారం, కెమెరా తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులేవీ వెంట తీసుకెళ్లొద్దు.

అభ్యర్థులు సాధారణ చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి.

పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను ఇస్తారు.

పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లడానికి అనుమతించరు. కేటాయించిన సమయం ముగిశాక అభ్యర్థులు బయటకు వెళ్లవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని