TS News: విచారణ పేరిట చిత్రహింసలు

దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. తీవ్ర

Updated : 24 Nov 2022 14:08 IST

తీవ్రంగా కొట్టారంటూ పోలీసులపై గిరిజనుల ఆరోపణ
బాధితుడితో ఠాణా వద్ద ఆందోళన
విచారణకు ఆదేశించిన ఎస్పీ

చికిత్స పొందుతున్న వీరశేఖర్‌

ఆత్మకూర్‌(ఎస్‌), సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడితో మూకుమ్మడిగా ఠాణాకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆత్మకూర్‌(ఎస్‌) పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. ఈ నెల 4న ఏపూర్‌లోని తన దుకాణంలో రూ.10 వేల నగదు, 40 మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు షేక్‌ సైదులు గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ కేసులో రామోజీతండాకు చెందిన బానోత్‌ నవీన్‌ను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మరికొందరి పేర్లను చెప్పడంతో బానోత్‌ బుచ్చ్యా, బానోత్‌ లాల్‌సింగ్‌, గుగులోతు వీరశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం ఠాణాకు తీసుకొచ్చి విచారించి అర్ధరాత్రి వదిలేశారు. గురువారం ఉదయం మళ్లీ తండాకు వెళ్లి అతన్ని స్టేషన్‌కు రావాలని అడిగారు. అప్పటికే మంచంపై మూలుగుతున్న వీరశేఖర్‌ను కుటుంబసభ్యులు, తండావాసులు ఆరాతీయగా.. తనను రాత్రంతా పోలీసులు కొట్టినట్లు అతను తెలిపాడు. దీంతో తండావాసులు ఆగ్రహించి అతడిని ట్రాక్టర్‌పై ఠాణాకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వారించేందుకు యత్నించిన ఎస్సై ఎం.లింగంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వీరశేఖర్‌కు న్యాయం చేయాలని, ఎస్సైను సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బాధితుడిని ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఆందోళన చేపట్టిన
అనంతరం వీరశేఖర్‌ను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతున్న గిరిజనులు

కుడకుడ వద్ద రహదారిపై నిరసన

ఆత్మకూర్‌(ఎస్‌) స్టేషన్‌ నుంచి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు ట్రాక్టరులో వెళ్తున్న గిరిజనులను చివ్వెంల మండలం కుడకుడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టరుతో సహా అక్కడే రహదారిపై ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వాహనాలు స్తంభించడంతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ మోహన్‌కుమార్‌, సూర్యాపేట గ్రామీణ సీఐ విఠల్‌రెడ్డిలు వారితో చర్చలు జరిపారు. ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఆత్మకూర్‌(ఎస్‌) ఠాణాలో మారోమారు సీఐ వారితో మాట్లాడారు. వీరశేఖర్‌, లాల్‌సింగ్‌లపై కేసు లేకుండా చూస్తామని, బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. చోరీ కేసులో లాల్‌సింగ్‌ను పోలీసులు విడిచిపెట్టారు. నవీన్‌,    బుచ్చ్యాలను అదుపులో ఉంచుకున్నారు.

తప్పుదారి పట్టించేందుకే: ఎస్‌.ఐ. లింగం

వీరశేఖర్‌కు మూర్ఛ, ఇతర ఆరోగ్య సమస్యలుండటంతో బుధవారం రాత్రి ఇంటికి పంపించాం. గురువారం అతన్ని స్టేషన్‌కు తీసుకురావటానికి సిబ్బంది రామోజీతండాకు వెళ్లారు. అతన్ని విచారిస్తే అసలు నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో కొందరు కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.


నోట్లో గుడ్డలు కుక్కారు: బాధితుని తల్లి

న కుమారుడ్ని ఆత్మకూర్‌ (ఎస్‌) పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు వీరశేఖర్‌ తల్లి గుగులోతు ఖీరి ఆరోపించారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఆమె మాట్లాడారు. ‘చోరీకి పాల్పడినట్లు అంగీకరించాలని బలవంతం చేశారు. ససేమిరా అనడంతో నోట్లో గుడ్డలు కుక్కి.. మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. వదిలేయాలని ఎస్సై కాళ్లపై పడినా కనికరించలేదు. చివరకు ఎస్సై వాహన డ్రైవర్‌ సైతం ఠాణా బయట ఉన్న బంధువులకు వీరశేఖర్‌తో చోరీ చేసినట్లు అంగీకరించేలా చూస్తామంటూ సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత అతను కూడా దాడికి పాల్పడ్డాడు. కదల్లేని స్థితిలో ఉన్న తన కుమారుడిని బుధవారం రాత్రి పోలీసులే ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు’ అంటూ ఆమె రోదించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని