Ramanujacharyulu: ‘భద్రవేది’క.. అద్భుతాల మాలిక

ప్రకృతి సౌందర్యం.. ఆధ్యాత్మిక సౌరభం.. చారిత్రక సందేశం.. వెరసి అదో ప్రశస్త నిర్మాణం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో రూపుదిద్దుకున్న సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టతలెన్నో అబ్బురపరిచేలా ఉన్నాయి. శ్రీరామానుజాచార్య

Updated : 31 Jan 2022 09:40 IST

రామానుజుల విరాట్‌ విగ్రహానికి ఆలంబన ఇదే
దిగువ అంతస్తులో సువర్ణ అర్చామూర్తి
120 కిలోల బంగారంతో తయారీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రకృతి సౌందర్యం.. ఆధ్యాత్మిక సౌరభం.. చారిత్రక సందేశం.. వెరసి అదో ప్రశస్త నిర్మాణం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో రూపుదిద్దుకున్న సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టతలెన్నో అబ్బురపరిచేలా ఉన్నాయి. శ్రీరామానుజాచార్య సహస్రాబ్ధి సమారోహ మహోత్సవ ఘట్టం సమీపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్న తరుణంలో అక్కడి ప్రత్యేకతలపై ‘ఈనాడు’ కథనం.

సమాజానికి సమతా సందేశాన్ని ప్రవచించిన భగవద్రామానుజుల విరాట్‌ స్వరూపం సహా కేంద్రంలోని విశేషాలెన్నో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా.. అందులో భద్రవేది 54 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. దీనిపైనే యతీంద్రుల భారీ విగ్రహం కొలువై ఉంటుంది. భద్రవేది నిర్మాణం అద్భుత శైలిలో దర్శనమిస్తోంది. రాజస్థాన్‌లోని బన్సీపహాడ్‌పూర్‌ నుంచి రప్పించిన లేత గులాబీ  వర్ణపు శాండ్‌స్టోన్‌ను ఇందుకు వినియోగించారు. సాయంత్రం వేళల్లో లేజర్‌ షో, దీప కాంతుల్లో ఈ మండపం కనువిందు చేయనుంది. భద్రవేది పైనుంచి విగ్రహం వద్దకు చేరుకునేందుకు ఉజ్జీవన మండపం ఉంటుంది. మెట్ల మార్గంలో చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.

ప్రతి అంతస్తూ ప్రత్యేకమే

కింది అంతస్తు (గ్రౌండ్‌ ఫ్లోర్‌), మొదటి, రెండో అంతస్తులుగా భద్రవేదిని నిర్మించారు. ప్రధాన మూర్తి వద్దకు చేరుకునేందుకు మెట్ల మార్గమే కాకుండా, వెనుక భాగంలో మూడు లిఫ్టులు, మరో ర్యాంపు మార్గం కూడా ఉన్నాయి.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సువిశాల శరణాగత మండపాన్ని తీర్చిదిద్దారు. రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే చిత్రాలు ఇక్కడ ఉంటాయి. ఏఆర్‌ వంటి ఆధునిక పరిజ్ఞానంతో విశేషాలు తెలుసుకునేలా అభివృద్ధి చేస్తున్నారు.

మొదటి అంతస్తులో రామానుజాచార్యుల బంగారు మూర్తి కొలువుదీరి ఉంటుంది. ముందువైపు అద్దం, వెనుక వైపున స్టోన్‌ను జాలీల తరహాలో రూపొందించి మందిరానికి అమర్చారు. దీపకాంతుల నడుమ రామానుజుల సువర్ణమూర్తి దేదీప్యమానంగా భాసిస్తుంది.

రెండో అంతస్తులో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా సమసమాజానికి పాటుపడిన 116 మంది మహనీయుల జీవిత చరిత్రలు అందుబాటులో ఉంటాయి.

నిత్యపూజామూర్తి ఇక్కడ ప్రత్యేకం

రామానుజాచార్యుల ఎత్తైన విగ్రహం ప్రకృతిలో మమేకమై సుదూర ప్రాంతం నుంచే సాక్షాత్కరిస్తుంది. భద్రవేదిలోని మొదటి అంతస్తులో బంగారు నిత్యపూజా మూర్తి కేంద్రానికే ప్రత్యేకంగా నిలవనుంది. 63 అంగుళాల ఎత్తులో రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించారని తెలిపేలా 120 కిలోల స్వర్ణంతో విగ్రహాన్ని మలిచారు. ప్రత్యేక పీఠంపై మూర్తిని ఇప్పటికే ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ పీఠం పైకప్పును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో పద్మదళాలు వెనక్కి తిరిగి రామానుజాచార్యులకు గొడుగు పడుతున్నట్టుగా ఉంటాయి. ఈ పైకప్పును సిమెంటుతో కాకుండా ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థతో అరలుగా అమర్చారు. వీటి మధ్య వివిధ వర్ణాల ఎల్‌ఈడీ దీపాలు వెలుగులు విరజిమ్మనున్నాయి. నిత్య పూజలందుకునే రామానుజాచార్యుల దర్శనం సమతాస్ఫూర్తి కేంద్రం మరో ప్రత్యేకత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని