Underwater Tunnel Aquarium: రాజధాని సిగలో మరో కలికితురాయి!

హైదరాబాద్‌ మహా నగర సిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం నిర్మించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దనున్నారు.

Updated : 13 May 2023 09:53 IST

రూ.350 కోట్లతో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం
కొత్వాల్‌గూడ ఎకో పార్కులో ఏర్పాటుకు నిర్ణయం
గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించిన హెచ్‌ఎండీఏ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగర సిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ అక్వేరియం నిర్మించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) శుక్రవారం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. బిడ్‌ను దక్కించుకున్న సంస్థకే డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో 30 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టును అప్పగించనున్నారు. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌ సమీపంలో కొత్వాల్‌గూడ వద్ద 150 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏకో పార్కును అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే అయిదు ఎకరాల్లో భారీ టన్నెల్‌ అక్వేరియాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై మెరైన్‌ పార్కు, అహ్మదాబాద్‌లోని సైన్స్‌ సిటీలో ఈ తరహా అక్వేరియంలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన అధికారులు వాటి కంటే భిన్నంగా ప్రపంచస్థాయి హంగులతో కొత్వాల్‌గూడలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లు సమర్పించాలని గడువు విధించారు. మొదట సాంకేతిక బిడ్లను పరిశీలించి, తర్వాత ప్రైస్‌ బిడ్‌ తెరిచి, అర్హత ఉన్న సంస్థను ఎంపిక చేస్తారు. పనులు దక్కించుకున్న సంస్థ వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

వంద మీటర్ల పొడవు

* అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మిస్తారు. వీటి లోపలికి వెళ్లే పర్యాటకులకు సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతారు.

* సముద్రం, నదుల నుంచి తెచ్చే నీటిని నింపేందుకు మూడు వేల మిలియన్‌ లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వీటిలో వేయి రకాల సముద్ర జీవులను పెంచుతారు. షార్క్‌లు, డాల్ఫిన్లు వంటి వాటికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

* అక్వేరియం లోపల రెస్టారెంట్‌, డోమ్‌ థియేటర్‌, 7డీ, వీఆర్‌ థియేటర్లు ఇతర ఆధునిక హంగులను కల్పిస్తారు.

* పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇతర వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక హాళ్లు అందుబాటులో ఉంటాయి.

* విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడే ఒకట్రెండు రోజులు గడిపేందుకు వీలుగా సమీపంలోనే చెక్కతో కాటేజీలను నిర్మించనున్నారు.

* కొండ ప్రాంతం కావడంతో బంగీజంప్‌, ట్రెక్కింగ్‌ లాంటి అడ్వెంచర్‌ అంశాలను అదనంగా జోడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు