అంతా తానై... గుజరాత్‌లో మోదీ ప్రచారం

గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ప్రధాని మోదీ అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. తీవ్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇదంతా గెలుపు కోసం పోరాటమా, రికార్డు స్థాయి విజయం సాధించే వ్యూహమా?

Published : 24 Nov 2022 01:05 IST

గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం ప్రధాని మోదీ అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. తీవ్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇదంతా గెలుపు కోసం పోరాటమా, రికార్డు స్థాయి విజయం సాధించే వ్యూహమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్‌లో భాజపా దూకుడు ప్రచారాన్ని చూస్తే- రాష్ట్రంలో వరసగా ఏడోసారీ విజయం సాధించాలనే తహతహతో కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతతోపాటు, బరిలో కొంతమంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగడంవంటి అంశాలు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయి అంచనాల ప్రకారమైతే, గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి రావడంపై మోదీ అంతగా ఆందోళన చెందడం లేదని, ఈసారి సీట్ల విషయంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు. 1985 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మాధవసింహ్‌ సోలంకీ నేతృత్వంలో 149 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ తరహాలో విజయదుందుభి మోగించాలనేది ప్రధాని లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈసారి 150 సీట్లు సాధించాలని భాజపా శ్రేణులకు మోదీ లక్ష్యంగా నిర్దేశించినట్లు చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి నాయకులు భారీస్థాయిలో ఉచితాలు, తాయిలాలతో ఊరిస్తూ, రాజకీయ స్థితిగతులనే మార్చేయాలని చూస్తున్నారు. ఇలా ఎన్ని వ్యతిరేక ప్రయత్నాలు జరిగినా, గుజరాత్‌లో తన ఆధిపత్యానికి ఎలాంటి ముప్పు లేదని భాజపా తన వ్యతిరేకులందరికీ స్పష్టం చేయాలన్నదే ప్రధాని మోదీ వ్యూహంగా చెబుతున్నారు.

ఓటర్లకు వినతి

మోదీ నవంబరు ఆరో తేదీన ఎన్నికల సభలో- ‘ఈ గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను’ అంటూ కొత్త నినాదాన్ని ప్రారంభించారు. విద్వేషాల్ని వ్యాపింపజేసే శక్తులు, గుజరాత్‌ను అప్రతిష్ఠపాలు చేసే శక్తులు రాష్ట్రం నుంచి తుడిచి పెట్టుకుపోతాయంటూ విపక్షాలపై తీవ్రస్థాయి విమర్శల దాడి చేస్తున్నారు. ‘భాజపా అభ్యర్థి ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కమలం పువ్వును మాత్రం మదిలో నిలుపుకోండి. మీరు ఓటు వేస్తున్నప్పుడు కమలం పువ్వు కనిపిస్తే, అది భాజపా అనీ, మీ దగ్గరికి వచ్చిన మోదీ అని అర్థం చేసుకోండి. కమలం గుర్తుకు వేసిన ప్రతి ఓటూ మీరిచ్చే ఆశీర్వాదంలా నేరుగా మోదీ ఖాతాలోనే పడుతుంది’ అంటూ ప్రధాని ఓటర్లకు విన్నవించారు. పోలింగ్‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలంటూ మోదీ ప్రతి ఎన్నికల సభలోనూ నొక్కిచెబుతున్నారు. ‘ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌కు భారీయెత్తున తరలిరావాలి. గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాలి. భాజపాకు ఓటు వేసేందుకే ఇలా చెప్పడం లేదు. ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య పండుగలో పాలు పంచుకోవాలన్నదే ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ ఇది నా విన్నపం’ అంటూ మోదీ పేర్కొనడం గమనార్హం. ‘ఇక్కడ ప్రతి బూత్‌లోనూ భాజపా గెలవాలి. ఈసారి అన్ని పోలింగ్‌ బూత్‌లనూ గెలవడంపైనే దృష్టి పెట్టాను. దీన్ని సాధించడంలో మీరు నాకు తోడ్పాటు అందిస్తే, భాజపా అభ్యర్థులు సులువుగా అసెంబ్లీకి చేరుకుంటారు’ అంటూ ఓటర్లకు వివరిస్తున్నారు. ‘గుజరాత్‌ సీఎం భూపేంద్ర- గతంలోని నరేంద్ర రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా. గుజరాత్‌ను, దేశాన్ని అభివృద్ధి పథంలో మున్ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కష్టపడాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు. మోదీ వ్యక్తిగతంగా ఓటర్లకు చేస్తున్న వినతులు భాజపా లోపాల్ని అధిగమించడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు.

దిద్దుబాటు చర్యలు

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మోదీ ప్రజల ఆదరణ పొందారు. ఆ తరవాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్న ఆనందీబెన్‌ పటేల్‌ (ప్రస్తుత యూపీ గవర్నర్‌), విజయ్‌రూపానీల హయాములో ప్రభుత్వ పాలనపై అసంతృప్తి నెలకొంది. రిజర్వేషన్ల కోసం పటేల్‌ సామాజిక వర్గం చేపట్టిన ఉద్యమం 2017లో భాజపా విజయావకాశాల్ని దెబ్బతీసింది. అమిత్‌ షా అనుయాయుడిగా పేరొందిన విజయ్‌ రూపానీకి ప్రజల్లో ఆదరణ తగ్గడంతో 2021లో ఆయనను మార్చి, భూపేంద్ర పటేల్‌కు సీఎం కుర్చీ కట్టబెట్టడం ద్వారా కీలక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రూపానీతోపాటు మంత్రులుగా ఉన్న పలువురు పాత ముఖాలకు ఉద్వాసన పలికారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకూ వారికి టికెట్లు నిరాకరించారు. 2017 ఎన్నికల్లో భాజపాకు సమస్యలు సృష్టించిన పటేల్‌ సామాజిక వర్గం విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఇది ఉపకరిస్తుంది. ఈసారి ఎన్నికల్లో పటేల్‌/పాటీదార్లు పూర్తిస్థాయిలో తమ వెనక నిలుస్తారని భాజపా విశ్వసిస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న హార్దిక్‌ పటేల్‌ ఇప్పుడు భాజపాలో ఉన్నారు. పటేల్‌ సామాజిక వర్గంతోపాటు, ఆదివాసీ ప్రాంతంలో గరిష్ఠ సంఖ్యలో సీట్లు సాధించేలా ఆయన కృషి చేశారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో ఎదురయ్యే నష్టాలను ఇది భర్తీ చేయనుంది. గుజరాత్‌ ప్రజలు తనను వదులుకోబోరని మోదీ చాలా నమ్మకంతో ఉన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల చిట్టాను అన్ని సభల్లోనూ ప్రజల ముందుంచుతున్నారు. రాష్టంలో నీటి కొరతతో అల్లాడే ప్రాంతాలకు నీటిని తెచ్చేందుకు నర్మదా డ్యామ్‌ను పూర్తిచేయడం మొదలు, ప్రతి రంగంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడాన్ని గుర్తుచేస్తున్నారు.


ప్రతిపక్షం పరిస్థితి... 

చాలామంది గుజరాత్‌ ఓటర్లు ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష శిబిరం పరిస్థితి వారిలో అంతగా భరోసాను కల్పించడం లేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను 99 స్థానాలకే పరిమితం చేసిన కాంగ్రెస్‌- ఇప్పుడు ఆ స్థాయి ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని కనబరచలేకపోతోంది. హస్తం పార్టీకి అహ్మద్‌ పటేల్‌ వంటి గొప్ప వ్యూహ నిపుణులు లేని లోటు కనిపిస్తోంది. కుదేలైన కాంగ్రెస్‌ యంత్రాంగం తన మద్దతుదారులను నిరాశపరుస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ ఉన్నా, ఆ పార్టీ నేతలు ఆ అంచనాలను అందుకోలేని పరిస్థితిలో ఉండిపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్‌ అభ్యర్థులు పోటీలో ఉండటం కాంగ్రెస్‌కు మరింత నష్టం కలిగించేదే అవుతుంది. రెండు నెలల క్రితం ఎంతో ఉత్సాహంతో హడావుడి మొదలుపెట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ- తాజాగా అభ్యర్థుల ఎంపిక, ప్రకటన తరవాత ఆ స్థాయిలో వేడి కనబరచలేకపోతున్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి పోటీ నెలకొన్న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థుల్లో చాలామంది జనానికి అంతగా పరిచయం లేనివారు కావడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితులను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందాలని మోదీ భావిస్తున్నట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.

- శేఖర్‌ అయ్యర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.