సాంకేతికత ఆలంబనగా ఆత్మనిర్భర భారత్
డిజిటల్ సాంకేతికతలు ప్రజల జీవనంలో విడదీయరాని అంతర్భాగాలయ్యాయి. కృత్రిమ మేధ, 5జీ, క్వాంటమ్ సాంకేతికతలు మానవుడు అనుదినం ఉపయోగించుకోవడానికి వీలైన స్థాయికి చేరుకున్నాయి. 2023లో ప్రధాన పరిణామమిదే. ఇటువంటి కీలక సందర్భంలో జీ-20 దేశాల అధ్యక్ష పదవిని ఇండియా చేపట్టింది.
డిజిటల్ సాంకేతికతలు ప్రజల జీవనంలో విడదీయరాని అంతర్భాగాలయ్యాయి. కృత్రిమ మేధ, 5జీ, క్వాంటమ్ సాంకేతికతలు మానవుడు అనుదినం ఉపయోగించుకోవడానికి వీలైన స్థాయికి చేరుకున్నాయి. 2023లో ప్రధాన పరిణామమిదే. ఇటువంటి కీలక సందర్భంలో జీ-20 దేశాల అధ్యక్ష పదవిని ఇండియా చేపట్టింది. విశాల ప్రజా శ్రేయస్సుకు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆత్మనిర్భర భారత్ను సాధించవచ్చని ప్రధాని మోదీ ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ పదవి మంచి సాధనమవుతోంది.
కొన్నేళ్ల క్రితం వరకు ఆధునిక సాంకేతికత పట్టణాల్లోని ఉన్నత వర్గీయులకు మాత్రమే అందుబాటులో ఉండేది. గ్రామీణులకు ఇంటర్నెట్ సేవలు అందని ద్రాక్షలా కనిపించేవి. 2014దాకా కేవలం 25 కోట్లమంది భారతీయులు ఇంటర్నెట్ను ఉపయోగించేవారు. 2022కల్లా వారి సంఖ్య 84 కోట్లకు పెరిగింది. గతంలో భారత్లో ఒక జీబీ డేటాకు రూ.300 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.13.50కు దిగివచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాన్యులకు సైతం అందుబాటు ధరకు సాంకేతిక సేవలు అందించాలని పూనిక వహించడం వల్లనే ఇది సాధ్యమైంది. సాంకేతికత ద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలని ఆయన లక్షిస్తున్నారు.
విస్తృతంగా 5జీ సేవలు
దేశీయంగా కొవిడ్ మహమ్మారి దుష్ప్రభావాన్ని తగ్గించడానికి డిజిటల్ ఇండియా తోడ్పడింది. ఇంటర్నెట్ చౌకగా లభ్యమైనందువల్ల కొవిడ్ కాలంలో ప్రజలకు తేలిగ్గా పలు సేవలు అందాయి. పాఠశాల చదువులూ ఆన్లైన్కు మారాయి. ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్లోని బలరాంపుర్కు చెందిన సుహానీ సాహు అనే విద్యార్థిని దీక్ష ఆన్లైన్ వేదిక ద్వారా చదువు కొనసాగించగలిగింది. బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన గ్రామీణుడు శుభం కుమార్ ఈ-సంజీవని యాప్ ద్వారా తన తల్లికి టెలీమెడిసిన్ ద్వారా చికిత్సను కొనసాగించగలిగాడు. కొవిడ్ కాలంలో దూరాభారాలకు ప్రయాణించి ఆస్పత్రికి రావాల్సిన అగత్యాన్ని టెలీ వైద్య సలహాలు తప్పించాయి. ఇలా ప్రయాణ, వైద్య ఖర్చులూ తగ్గించుకొన్నవారి సంఖ్య 10 కోట్లకు పైమాటే. ఉత్తర్ ప్రదేశ్లోని హర్దోయికి చెందిన హరిరామ్ దేహ్రాదూన్లో ట్యాక్సీ నడుపుతూ జీవిస్తున్నాడు. ఒక దేశం-ఒక రేషన్ కార్డు పథకం ద్వారా అతడు స్వగ్రామంలోని రేషన్ కార్డు ద్వారానే దేహ్రాదూన్లో ఆహార ధాన్యాలు అందుకోగలిగాడు. గ్రామీణ తపాలా సేవకులు ఆధార్ సంబంధ చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్) ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ ప్రభుత్వ చెల్లింపులను అందించారు. పేదరిక నిర్మూలనకు, ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించడం కోట్లాది భారతీయులకు లబ్ధి చేకూర్చింది. అందుకే ‘ఇవాళ ప్రజలు తమ ప్రభుత్వాన్ని అడ్డంకిగా కాకుండా కొత్త అవకాశాలను సృష్టించే ప్రేరణశక్తిగా చూస్తున్నారు. వారి దృక్పథాన్ని మార్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆయన పలుకులు దేశమంతటా ప్రతిధ్వనించాయి. ఆయన దార్శనికత దేశంలో అన్ని రంగాలనూ రూపాంతరం చెందిస్తోంది.
ఇవాళ ప్రజలందరికీ స్వేచ్ఛగా డిజిటల్ సేవలు అందుతున్నాయి. దేశమంతటా అవి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సేవలు డిజిటల్ రూపంలో విరివిగా లభ్యమవుతున్నాయి. కొవిన్ డిజిటల్ వేదిక దీనికి విశిష్ట ఉదాహరణ. కొవిడ్ టీకాల ఉత్పత్తిదారులు, ఆస్పత్రులు, క్లినిక్లు, పౌరుల నమోదు ప్రక్రియ, టీకాలు వేసే తేదీలు, ధ్రువీకరణ- ఈ దశలన్నీ కొవిన్ వేదిక మీదనే జరిగిపోయాయి. దీని చలవతోనే కేవలం 12 నెలల్లో 150 కోట్ల కొవిడ్ టీకా డోసులు వేయగలిగాం. ఇప్పటివరకు మొత్తం 220 కోట్ల పైచిలుకు మోతాదుల టీకాలను ప్రజలకు అందించాం. ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ చెల్లింపుల సాయంతో అసంఖ్యాక వాహనాలు ప్రధాన రహదారులపై నిరాటంకంగా పరుగులు తీస్తున్నాయి. టోల్ గేట్ల వద్ద అదేపనిగా నిరీక్షించాల్సిన అగత్యాన్ని ఫాస్టాగ్ తప్పించింది. ఫలితంగా టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గిపోయింది. 5జీ ద్వారా టెలికాం సేవలు వేగం పుంజుకోనున్నాయి. విద్యావైద్యాలు, వ్యవసాయం, భవన నిర్మాణం తదితర రంగాల్లో 5జీ సేవలను అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో విదేశాలకు 4జీ, 5జీ టెక్నాలజీ ఎగుమతులను చేపట్టడానికి భారత్ సమాయత్తమవుతోంది.
సరికొత్త వేదికలు
ప్రజాహితానికి ఆధునిక డిజిటల్ సేవలను ఇంత విస్తృతంగా అందించగలగడం మన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం. అర్హులైన అత్యధిక ప్రజానీకానికి నగదు రుణాలు అందించడానికి బహిరంగ రుణ వితరణ వ్యవస్థ (ఓసెన్)ను రూపొందిస్తున్నాం. బ్యాంకులు వేగంగా రుణాలివ్వడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుంది. రుణ మంజూరు సేవల ఖర్చును తగ్గిస్తుంది. ప్రస్తుతం 57 శాతంగా ఉన్న రుణాలు-జీడీపీ నిష్పత్తి ఓసెన్ ద్వారా 2031కల్లా 100శాతానికి చేరుతుందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. సాధారణ పౌరుల జీవితాలను రూపాంతరం చెందించడానికి ప్రధాని మోదీ తెచ్చిన డిజిటల్ విప్లవం అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. విద్యా వైద్యం, సరకుల బట్వాడా, వ్యవసాయం, రక్షణ రంగాల్లోనూ సరికొత్త డిజిటల్ వేదికలు ఆవిర్భవిస్తున్నాయి. అనేక అంకుర సంస్థలు అవతరించి అభివృద్ధి చెందడానికి ఇవి ఊతమిస్తాయి. ప్రపంచం అనిశ్చితిలో చిక్కుకున్న సమయంలో భారత్ అమృత కాలంలో ప్రవేశించింది. దూరదృష్టి, కార్యదక్షత, కార్యాచరణల ఉత్తమ గుణ సమ్మేళనంతో ప్రధాని మోదీ భారత్ను ముందుకు తీసుకెళ్తున్నారు. జీ-20 అధ్యక్ష హోదాలో డిజిటల్ మౌలిక వసతుల పరంగా ప్రపంచానికి భారత్ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.
డిజిటల్ చెల్లింపుల విప్లవం
సాంకేతికత పలు విధాలుగా సమాజానికి సేవలు అందించగలదని భారత్ నిరూపించింది. ఇవాళ తోపుడు బండ్లవారు, తేనీటి స్టాళ్లు, చిన్నచిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు స్వీకరించడానికి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) స్టిక్కర్లను వినియోగిస్తున్నారు. దేశమంతటా వీధుల్లో ఎక్కడ చూసినా క్యూఆర్ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల కోసం భారత్ 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ యంత్రాంగం జగద్విఖ్యాతమైంది. నేడు 120 కోట్లమంది యూపీఐని ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా ఏటా 1.5 లక్షల కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకులు, బీమా, ఈ-కామర్స్ సంస్థలు యూపీఐ వేదికలో భాగస్వాములయ్యాయి. ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు సైతం ఇందులో పాలుపంచుకొంటున్నాయి. యూపీఐ ద్వారా ప్రతి లావాదేవీ రెండు సెకన్లలో జరిగిపోతుంది. పారదర్శకత, సౌలభ్యానికి చిరునామా అయిన యూపీఐ నేడు ప్రపంచంలో డిజిటల్ చెల్లింపులకు ఉత్కృష్ట చిహ్నంగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష