అక్కరకురాని నిర్భయ నిధి
భారత్లో మహిళలపై దాష్టీకాలు అంతకంతకు అధికమవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వారి భద్రత కోసం ప్రభుత్వాలెన్ని ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అవి నీరుగారిపోతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ‘నిర్భయ’ ఘటన తరవాత ఏర్పాటుచేసిన ప్రత్యేక నిధి సైతం సక్రమంగా వినియోగం కావడంలేదు.
భారత్లో మహిళలపై దాష్టీకాలు అంతకంతకు అధికమవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వారి భద్రత కోసం ప్రభుత్వాలెన్ని ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అవి నీరుగారిపోతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ‘నిర్భయ’ ఘటన తరవాత ఏర్పాటుచేసిన ప్రత్యేక నిధి సైతం సక్రమంగా వినియోగం కావడంలేదు. స్త్రీలపై నేరాలకు సంబంధించిన కేసులూ ఒక పట్టాన కొలిక్కి రావడంలేదు.
పదకొండేళ్ల క్రితం దేశ రాజధాని దిల్లీలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై నరరూప రాక్షస మూక సాగించిన పైశాచికత్వం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆనాటి ఘోరకలి దేశీయంగా మహిళల భద్రతపై తీవ్రమైన సందేహాలు రేకెత్తించింది. ఆ దారుణ ఘటనపై ఎల్లెడలా ఆందోళనలు మిన్నంటిన దరిమిలా అప్పటి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయడం, వేగంగా కేసుల విచారణ వంటి వాటిపై సిఫార్సులకు జస్టిస్ జేఎస్ వర్మ కమిటీని కొలువుతీర్చింది. అనంతర కాలంలో చట్టాలను పదును తేల్చింది. మహిళల భద్రత కోసం 2013లో నిర్భయ నిధిని సైతం తెరపైకి తెచ్చింది. ఇది పూర్తిస్థాయిలో వినియోగం కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసుల మేట
మహిళల భద్రత కోసం నగరాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు, ఫోరెన్సిక్ పరికరాల కొనుగోలు, భద్రతా పరికరాల తయారీ, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నిర్భయ నిధిని వినియోగిస్తున్నారు. కేంద్ర హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ వంటి పది మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిర్భయ నిధులకు సంబంధించిన ప్రాజెక్టులను చేపడుతున్నాయి. గ్రామీణ భారతంలోనూ మహిళల భద్రత, ఉద్యోగ, ఉపాధి శిక్షణ కోసం ఆ నిధులను వెచ్చించాలని తాజాగా పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. స్త్రీలు పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి నిరుడు ఇదే సంఘం నిర్భయ నిధి అరకొర వ్యయంపై ధ్వజమెత్తింది. కేంద్రం లెక్కల మేరకు నిర్భయ నిధి కింద 38 ప్రాజెక్టులకు రూ.9,228 కోట్లు ప్రతిపాదించారు. అందులో భాగంగా ఇప్పటిదాకా రూ.6,712 కోట్లు ప్రత్యేకించారు. వాటిలో రూ.4,740 కోట్లే విడుదల చేశారు. ముప్ఫై శాతానికి పైగా నిధులు వినియోగానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖల్లో నిర్భయ నిధుల వినియోగం తక్కువగానే ఉంది. దేశీయంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మూడింట రెండొంతుల కన్నా తక్కువ నిధులే వ్యయం చేశాయని గతంలో విశ్లేషణలు వెలువడ్డాయి. సంబంధిత శాఖల నుంచి ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించడంలో తీవ్ర జాప్యం, కఠినమైన నిబంధనలు, కొవిడ్ పరిస్థితులు తదితరాలు నిర్భయ నిధి పూర్తిస్థాయి వినియోగానికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నిధుల దుర్వినియోగమూ యథేచ్ఛగా సాగుతోంది. మహారాష్ట్రలో మహిళల రక్షణ కోసం కొనుగోలు చేసిన వాహనాలను ఏక్నాథ్ శిందే సర్కారు అధికార పక్ష నాయకుల భద్రతకు వినియోగించడంపై నిరుడు గగ్గోలు రేగింది. అంతకు ముందు ఝార్ఖండ్ ప్రభుత్వం రహదారి భద్రత ప్రాజెక్టులకు నిర్భయ నిధులను కేటాయించింది. దేశీయంగా మహిళల భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో సంబంధిత నిధిని పూర్తిస్థాయిలో సమర్థంగా వ్యయం చేయడం తప్పనిసరి.
మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును, కోర్టులో ఛార్జిషీటు దాఖలును అరవై రోజుల్లో పూర్తిచేయాలి. కేసు విచారణను సైతం రెండు నెలల్లో ముగించాలి. ఇది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించవు. కేవలం 32శాతం కేసుల్లోనే దర్యాప్తు 60 రోజుల్లో పూర్తవుతున్నట్లు గతంలో పరిశీలనలు వెల్లడించాయి. మహిళల మీద హింసాత్మక, ఇతర నేరాలపై జిల్లా, దిగువ న్యాయస్థానాల్లో 36 లక్షలు, హైకోర్టుల్లో మూడు లక్షల పైచిలుకు కేసులు పెండింగులో ఉన్నట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు 2016-20 మధ్య కాలంలో భారత్లో లైంగిక నేరాల నుంచి చిన్నపిల్లల పరిరక్షణ చట్టం (పోక్సో) కేసులు 30శాతానికి పైగా ఎగబాకాయి. పోక్సో కేసుల్లో 94శాతానికి పైగా పెండింగులో ఉన్నాయి. కీచక మూకకు సకాలంలో సరైన శిక్షలు కొరవడటం మహిళల భద్రతను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. నిర్భయ నిధులతో దేశవ్యాప్తంగా రూ.767 కోట్లతో వెయ్యికి పైగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చాలా రాష్ట్రాలు ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని పరిశీలనలు చెబుతున్నాయి.
అరకొర సిబ్బంది
స్త్రీలపై దాష్టీకాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో లోపాలు, అభియోగపత్రాల నమోదులో లొసుగుల వల్లా పెద్ద సంఖ్యలో నేరగాళ్లు నిక్షేపంగా బయటపడుతున్నారు. ఫలితంగా మహిళల భద్రత మరింత ప్రమాదంలోకి జారుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఇలా ప్రతి వంద కేసుల్లో తొంభైకి పైగా వీగిపోతున్నట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. దేశీయంగా ప్రతి లక్ష జనాభాకు సగటున 196.23 మంది పోలీసులు అవసరం. ప్రస్తుతం సగటున 152.08 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. కేసుల దర్యాప్తు సమర్థంగా సాగాలంటే అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని నియమించడం తప్పనిసరి. మరోవైపు దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో దాదాపు ఆరు వేల జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమే గతంలో వెల్లడించింది. యుద్ధప్రాతిపదికన వాటిని భర్తీ చేయాలి. చట్టాలను సమర్థంగా అమలు చేసి, నేరస్థులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
ఆగని వేధింపులు
జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం- స్త్రీలపై అకృత్యాలకు సంబంధించి 2021లో దేశవ్యాప్తంగా 4.28 లక్షల కేసులు నమోదయ్యాయి.అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి 15శాతం అధికం. వాటిలో గృహహింసకు సంబంధించివే 1.36 లక్షలు ఉన్నాయి. దేశీయంగా 2001-18 మధ్య కాలంలో అత్యాచార సంబంధిత నేరాలు ఏకంగా డెబ్భై శాతానికి పైగా ఎగబాకాయి. ఇల్లు, పనిచేసే చోటు, అంతర్జాలం... ఇలా అన్నిచోట్లా మహిళలకు వేధింపులు తప్పడంలేదు. ఈ క్రమంలో స్త్రీల భద్రతకు సంబంధించి 2021-22లో చేపట్టిన అంతర్జాతీయ అధ్యయనంలో మొత్తం 177 దేశాల్లో భారత్ 148వ స్థానంలో నిలిచింది.
వేణుబాబు మన్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక