వాహన విపణిలో భారత్ జోరు
మోటారు వాహనాల ఉత్పత్తిలో భారత్ వడివడిగా అగ్రశ్రేణికి చేరుకొంటోంది. దేశంలో కర్మాగారాలను నెలకొల్పిన ఆటొమొబైల్ సంస్థలు తమ కార్యకలాపాలను ముమ్మరంగా విస్తరిస్తున్నాయి. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలోనే నంబర్-1 వాహన ఉత్పత్తిదారుగా ఎదిగే సత్తాను ఇండియా సంతరించుకొంటోంది.
మోటారు వాహనాల ఉత్పత్తిలో భారత్ వడివడిగా అగ్రశ్రేణికి చేరుకొంటోంది. దేశంలో కర్మాగారాలను నెలకొల్పిన ఆటొమొబైల్ సంస్థలు తమ కార్యకలాపాలను ముమ్మరంగా విస్తరిస్తున్నాయి. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలోనే నంబర్-1 వాహన ఉత్పత్తిదారుగా ఎదిగే సత్తాను ఇండియా సంతరించుకొంటోంది.
భారత్లోని మోటారు వాహన ఉత్పత్తి రంగం ఆశాజనకంగా దూసుకువెళుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2022-23లో ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 15శాతం వృద్ధి కనిపించింది. 2021-22లో 5,77,875 కార్లు, బస్సులు వంటి ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2022-23లో వాటి సంఖ్య 6,62,891కి పెరిగింది. ఇక ప్రయాణికుల కార్ల ఎగుమతి 10శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లకు చేరింది. యుటిలిటీ వాహనాల ఎగుమతి నిరుడు 23శాతం పెరిగి 2,47,493 యూనిట్లకు ఎగబాకిందని భారత ఆటొమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం(ఎస్ఐఏఎం) వెల్లడించింది. 2021-22లో 1,853 యూనిట్లుగా ఉన్న వ్యాన్ల ఎగుమతి మాత్రం 2022-23లో 1,611 యూనిట్లకు తగ్గింది.
మూడేళ్ల పాటు విక్రయాలు తగ్గినా...
భారత్లో వరసగా మూడేళ్లపాటు అమ్మకాలు తగ్గిన ద్విచక్ర వాహన పరిశ్రమ 2022-23లో 17శాతం వృద్ధి నమోదు చేసింది. 2021-22లో సుమారు 1.36 కోట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2022-23లో 1.59 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. ఆటొమొబైల్ సంస్థలు భారత్లో కొత్తగా పెట్టుబడులు పెట్టబోతున్నందువల్ల ఇక్కడి నుంచి ఎగుమతులు మరింత పెరగనున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణ నిమిత్తం రానున్న 5-7 సంవత్సరాల్లో హ్యుండయ్ మోటార్ ఇండియా సుమారు 20వేల కోట్ల డాలర్లు, ఎంజీ ఇండియా అయిదు వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. హరియాణాలో నిర్మిస్తున్న సరికొత్త కర్మాగారంలో ఉత్పత్తి విస్తరణకు రాగల ఏడేళ్లలో రూ.18,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు మారుతి-సుజుకి నిరుడు వెల్లడించింది. జైభారత్ మారుతి సంస్థ విడిభాగాల తయారీకి రూ.350 కోట్ల వరకు మదుపు చేయనుంది.
కార్ల తయారీదారులు క్రమంగా సంప్రదాయ మోటారు వాహనాల నుంచి ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి మళ్ళుతున్నారు. వచ్చే అయిదేళ్లలో ఎలెక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ ఇంధన వాహనాల తయారీలో అగ్రశ్రేణి మార్కెట్గా నిలిచే సామర్థ్యం భారత్కు ఉందంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విశ్లేషించారు. 2022-2030 మధ్య భారత్లో ఎలెక్ట్రిక్ వాహన మార్కెట్ 49శాతం చక్రీయ వార్షిక వృద్ధిరేటు సాధించగలదని అంచనా. 2030 నాటికి దేశంలో కోటి ఎలెక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోవచ్చు. అప్పటికి ఈ తరహా వాహనాల మార్కెట్ పరిమాణం అయిదు వేల కోట్ల డాలర్లకు చేరుతుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు అయిదు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే అయిదేళ్లలో ఇండియాలో ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి 4,200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని జపాన్ తలపెట్టింది. టాటా గ్రూపు 1,900 కోట్ల డాలర్లు, ఎంజీ మోటార్స్ 2,600-3,800 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టదలచాయి.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మోటారు వాహనాలను ఉత్పత్తిచేసే దేశంగా 2009లో చైనా అవతరించింది. అది మొదలు ఈ రంగంలో డ్రాగన్ హవా కొనసాగుతూనే ఉంది. 2022లో చైనా, అమెరికాల తరవాత జపాన్ను పక్కకు నెట్టి భారత్ మూడో అతిపెద్ద వాహన విపణిగా నిలిచింది. మోటారు వాహనాలకు అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనాను అధిగమించడం భారత్కు అంత సులువేమీ కాదు. నిరుడు చైనాలో సుమారుగా 2.69కోట్ల మోటారు వాహనాలను విక్రయించారు. అదే సమయంలో ఇండియాలో 2.07కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల అక్కడ మరిన్ని వాహనాలను అమ్ముకునే అవకాశం డ్రాగన్ దేశానికి లభిస్తోంది. నియో, ఎక్స్ పెంగ్, లీ ఆటో వంటి చైనా ఎలెక్ట్రిక్ వాహన సంస్థలు టెస్లాకు, ఐరోపా వాహన కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. తైవాన్ సంక్షోభానికి తోడు వాణిజ్యం విషయంలో పాశ్చాత్య దేశాలకు చైనాకు మధ్య అంతరం పెరుగుతోంది. ఈ కారణంగా మున్ముందు ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలో చైనా వాహనాలకు ప్రవేశం కష్టతరం కావచ్చు. అందుకే- అంతర్జాతీయ ఆటొమొబైల్ సంస్థలు భారత్ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా సద్వినియోగం చేసుకోవాలి.
భవిష్యత్తు ఆశావహం
భారత ప్రభుత్వం పటిష్ఠ విధానాలను చేపట్టడం, ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తికి బలమైన పునాదులు ఉండటం, ఎగుమతికి అవకాశాలు లభిస్తుండటంవల్ల ఆటొమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. కొవిడ్ సమయంలో మందగించినా ప్రస్తుతం అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ల లభ్యత పెరగడం మోటారు వాహనాల ఉత్పత్తికి ఊతమిస్తోంది. అధునాతన సాంకేతికతలను సకాలంలో అందిపుచ్చుకోవడం ఆటొమొబైల్ పరిశ్రమ వికాసానికి మరో బలమైన కారణం. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు భారత మోటారు వాహనాల ఎగుమతికి ఆటంకంగా పరిణమించవచ్చు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదలవల్ల వాహన విడిభాగాల దిగుమతి మరింత ఖరీదు అవుతుంది. ఫలితంగా భారత్లో మోటారు వాహన ఉత్పత్తి వ్యయం పెరిగి, ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను పెంచి అధునాతన సాంకేతికతల సాయంతో మరింత ఉత్పాదకతను సాధిస్తే- అంతర్జాతీయ విపణిలో మన వాహనాలు గట్టి పోటీ ఇవ్వగలుగుతాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రాయితీలు, నిధులను అందించడంతో పాటు మోటారు వాహనాల రంగంలో వాటికి భాగస్వామ్యం కల్పించాలి. విశ్వవిద్యాలయాలు ఈ పరిశ్రమకు ప్రతిభావంతులను అందించాలి. తద్వారా భారత్ మోటారు వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనాను అధిగమించగలుగుతుంది.
పొరుగు దేశాలకూ...
గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతిలో మారుతి-సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. హ్యుండయ్, కియా సంస్థలు వరసగా ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. మారుతి-సుజుకి 2021-22లో 2,55,439 ప్రయాణికుల వాహనాలను ఎగుమతి చేసింది. అది 2020-21 నాటి ఎగుమతులకన్నా ఎనిమిది శాతం అధికం. మారుతి-సుజుకి లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమాసియాలతోపాటు పొరుగు దేశాలకూ మోటారు వాహనాలను ఎగుమతి చేస్తోంది. 2021-22లో 1,29,260 వాహనాలను ఎగుమతి చేసిన హ్యుండయ్ 2022-23లో 18శాతం అధికంగా 1,53,019 వాహనాలను విదేశాలకు పంపింది. ఇదే కాలంలో కియా ఇండియా ఎగుమతులు 50,864 యూనిట్ల నుంచి 85,756 యూనిట్లకు పెరిగాయి. 2022-23లో నిస్సాన్ 60,637 వాహనాలను, రెనో 34,956, ఫోక్స్ వ్యాగన్ ఇండియా 27,137, హోండా 22,710 వాహనాలను, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 వాహనాలను ఎగుమతి చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్