
అంకురాలకు మంచికాలం
భారత్లో శరవేగంగా విస్తరణ
స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి(డీపీఐఐటీ) ఇటీవల తొలిసారిగా అంకురసంస్థల ఆవిష్కరణ వారోత్సవం నిర్వహించింది. దేశంలో అంకురసంస్థల విస్తృతికి తాము తీసుకొచ్చిన విధానాలే సానుకూల వాతావరణం కల్పించాయని ప్రభుత్వ పెద్దలు ఆ సందర్భంగా ఉద్ఘాటించారు. అందులో వాస్తవం ఉన్నప్పటికీ వాటిని నెలకొల్పాలనుకునే యువతకు నేటికీ సరైన ప్రోత్సాహకాలు అందడం లేదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు వారికి మరింత వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.
అవకాశాలు అందిపుచ్చుకొని...
దేశంలో అంకురసంస్థల రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సరికొత్త దారి చూపడంలో అది కొంతవరకు సఫలీకృతమైంది. మునుపెన్నడూ లేని విధంగా గత రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అంకురసంస్థలు పురుడుపోసుకున్నాయి. వాటిని ఏర్పాటు చేసిన వారిలో 65శాతం 40 ఏళ్లలోపువారే. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.84 లక్షల అంకురసంస్థలు ఉన్నాయి. వాటిలో 61 వేలకుపైగా డీపీఐఐటీ గుర్తింపు పొందాయి. దాదాపు 769 ఇంక్యుబేషన్ కేంద్రాల్లో ఆయా సంస్థలు నడుస్తున్నాయి. అవి దేశవ్యాప్తంగా 633 జిల్లాల పరిధిలో 55 రంగాల్లో విస్తరించాయి. 45శాతం అంకురసంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. 45శాతం సంస్థలను మహిళలే నెలకొల్పారు. కరోనా మహమ్మారి మానవ జీవన స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ఎన్నో అవకాశాలను మోసుకొచ్చింది. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చిన ఎంతోమంది కల్లోల కాలంలోనూ అంకురసంస్థలను ఏర్పాటు చేసి ప్రజల ఆదరణను సంపాదించగలిగారు. అంకుర సంస్థలు విజయవంతం కావాలంటే కనీసం 6-10 సంవత్సరాలు పడుతుంది. కరోనా కారణంగా పలు రంగాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు కొన్ని అంకురసంస్థలకు అనుకూలంగా మారాయి. ఒక నివేదిక ప్రకారం 2020లో మనదేశంలో రూ.85 వేల కోట్ల స్థాయిలో అంకురసంస్థల వ్యాపారం ఉండగా, గతేడాది అది దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. నిరుడు 42 భారత అంకురాలు యూనికార్న్ (రూ.7,500 కోట్ల విలువ కలిగిన సంస్థ) హోదా దక్కించుకున్నాయి. తద్వారా ప్రపంచ యూనికార్న్ కంపెనీల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. దేశీయంగా అటువంటి సంస్థల సంఖ్య ఇప్పుడు 90కు చేరుకుంది. యూనికార్న్ కంపెనీల జాబితాలో అమెరికా(487), చైనా(301) ముందున్నాయి. ఇండియా తరవాతి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్(39) నిలుస్తోంది.
దేశంలో 2013-14 మధ్య కాలంలో దాదాపు నాలుగు వేల పేటెంట్లు జారీ అయ్యాయి. 2020-21లో వాటి సంఖ్య 28వేలకు పెరిగింది. అదే సమయంలో ప్రపంచ ఆవిష్కరణ సూచీలో భారత్ స్థానం 81 నుంచి 46కు మెరుగుపడింది. ఫిన్ట్రాకర్ నివేదిక ప్రకారం గతేడాది రూ.2.8 లక్షల కోట్ల మేర పెట్టుబడులు భారతీయ అంకుర సంస్థల్లోకి వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అవి మూడు రెట్లు అధికం. ఆర్థిక, విద్యా రంగాల్లోని అంకుర సంస్థల్లోకి ఎక్కువగా నిధులు ప్రవహించాయి. 2018-21 మధ్యకాలంలో అంకురసంస్థలవల్ల ఆరు లక్షల ఉద్యోగాలు ఏర్పడ్డాయి. వాటిలో 2021లోనే యువతకు రెండు లక్షల కొలువులు దక్కాయి. అంకురసంస్థల పరంగా అత్యధికంగా నిధులను రాబట్టిన నగరాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఆ జాబితాలో హైదరాబాద్ కంటే దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై ముందు వరసలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 8,757 అంకురసంస్థలు, 68 ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 26 ఇంక్యుబేషన్ కేంద్రాల్లో 3,493 అంకురసంస్థలు నడుస్తున్నాయి. దేశంలో అత్యధికంగా అంకురసంస్థలు మహారాష్ట్రలో నెలకొన్నాయి. అక్కడ ఏకంగా 99 ఇంక్యుబేషన్ కేంద్రాల్లో 32,118 అంకురసంస్థలు ఏర్పాటయ్యాయి. తరవాతి స్థానం కర్ణాటకదే. ఇక్కడ 101 ఇంక్యుబేషన్ కేంద్రాల్లో 18,457 అంకురసంస్థలు కొనసాగుతున్నాయి.
ప్రోత్సాహం అవసరం
కేంద్ర ప్రభుత్వ చొరవతో అంకురాలకు తోడ్పాటు లభిస్తున్నప్పటికీ, ఇంకా బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. కళాశాల స్థాయిలో అంకురసంస్థలను ఏర్పాటు చేసే యువతకు తగిన ప్రోత్సాహం అందించాలి. ఆ మేరకు కళాశాల స్థాయిలో సరైన ఇంక్యుబేషన్ కేంద్రాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. అంకుర సంస్థలను ఏర్పాటు చేసే యువతకు సీడ్, ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్లు కీలకం. అందుకు పరిశ్రమలతో అనుసంధాన కార్యక్రమాలు ఉండాలి. అంకురసంస్థలకు పెట్టుబడి సాయం అందించే పరిశ్రమలకు తగిన రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడమూ తప్పనిసరి. తయారు చేసే ఉత్పత్తులు, అందించే సేవలను ప్రభావవంతంగా మార్కెటింగ్ చేసే నైపుణ్యాలు సాధిస్తే మంచి లాభాలు గడించవచ్చు. ఆ మేరకు యువతకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు పాలకులు చొరవ తీసుకోవాలి. అది ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకూ తోడ్పడుతుంది.
- యార్లగడ్డ అమరేంద్ర
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సంపాదకీయం

క్వాడ్ సంకల్ప దీక్ష
ప్రధాన వ్యాఖ్యానం

చమురు ధరాభారం... ఉపశమనమెంత?
ఉప వ్యాఖ్యానం

అవగాహన లోపం... సమస్య క్లిష్టం!

ఆచూకీ లేని బాల్యం
అంతర్యామి
