అవకాశాల పెన్నిధి... డెయిరీ రంగం!
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ పాల లోటుతో ఇబ్బందులు పడింది. అనంతరం శ్వేతవిప్లవంతో స్వయంసమృద్ధి సాధ్యమైంది. ఇంతటి వృద్ధికి కారణమైన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి (నవంబరు 26)ని ‘జాతీయ పాల దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ పాల లోటుతో ఇబ్బందులు పడింది. అనంతరం శ్వేతవిప్లవంతో స్వయంసమృద్ధి సాధ్యమైంది. ఇంతటి వృద్ధికి కారణమైన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి (నవంబరు 26)ని ‘జాతీయ పాల దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. పాలు, పాల ఉత్పత్తుల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే దీని ప్రధానోద్దేశం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో 23శాతం వాటాతో భారత్ అగ్ర స్థానంలో నిలుస్తోంది. అమెరికా, చైనా, పాకిస్థాన్, బ్రెజిల్లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా పాల ఉత్పత్తిలో ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలదే సింహభాగం వాటా. దేశంలో పాల ఉత్పత్తి గత మూడు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. అధికమవుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా రానున్న పాతికేళ్లలో పాల డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ ఆహార శుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (అపెడా) గణాంకాల ప్రకారం 2021-22లో భారత్ నుంచి రూ.2,928 కోట్ల విలువైన పాల ఉత్పత్తులు బంగ్లాదేశ్, యూఏఈ, బహ్రెయిన్, మలేసియా, సౌదీఅరేబియా, ఖతర్లకు ఎగుమతయ్యాయి.
ఉపాధికి సోపానాలు
ఆరోగ్యకర జీవనంలో భాగంగా ప్రజలు పాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఆహార శుద్ధి రంగంలో పాల ఉత్పత్తులకు గిరాకీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డెయిరీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి దేశీయ కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు ముందుకు వస్తున్నాయి. పాలను ఉప ఉత్పత్తులుగా మారిస్తే వాటి నిల్వకాలం పెరుగుతుంది. తద్వారా వృథా, నష్టాల శాతం తగ్గుముఖం పడతాయి. పాల నుంచి విభిన్న రకాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ చేపట్టడం వల్ల డెయిరీ రంగం వృద్ధి దిశగా అడుగులు పడనున్నాయి. దీనివల్ల బహుముఖ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రజలకు పౌష్టికాహార లభ్యత, యువతకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయి. పాల ఉత్పత్తి, సేకరణ, రవాణా, ఉప ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. డెయిరీ రంగంలో అంకుర సంస్థల ప్రవేశం పెరిగింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పాలతో విభిన్నమైన, ఆకర్షణీయమైన పదార్థాలను అవి అందుబాటులోకి తెస్తున్నాయి. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఇది ఉభయతారకంగా మారుతోంది.
దేశంలో పశుపోషణ, మార్కెటింగ్ చాలా వరకు అసంఘటిత రంగంలో కొనసాగుతున్నాయి. అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మనం చాలా వెనకబడ్డాం. సంప్రదాయ విధానాలతో వృథా ఎక్కువగా జరుగుతోంది. కల్తీ సమస్య ఇబ్బందికరంగా మారింది. పశువుల పెంపకం, పాల దిగుబడి, అమ్మకాలు తదితర అంశాలను సంఘటిత రంగంలోకి తీసుకువస్తే పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుంది. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు పాల సేకరణ, రవాణా, నిల్వ, విభిన్న ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి అంశాల్లో నవకల్పనలు తోడవుతాయి. పశువుల్లోలంపీ చర్మ వ్యాధి వ్యాపిస్తున్న కారణంగా రాజస్థాన్లో పాల సేకరణ తగ్గడం కలవరపాటుకు గురిచేసింది. ఈ సమస్య ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు అత్యంత అవసరం.
మెరుగైన దిగుబడి
పాడి పశువుల్లో సగటు ఉత్పాదకతను మెరుగుపరచడం ప్రధాన సవాళ్లలో ఒకటి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో పశువుల సగటు వార్షిక పాల దిగుబడి చాలా తక్కువగా ఉంటోంది. ఈ సమస్యను అధిగమించడానికి వివిధ జాతుల జన్యు సామర్థ్యాన్ని పెంపొందించి మేలుజాతి పశువుల అభివృద్ధికి సరికొత్త పద్ధతుల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలైన పశువుల సంఖ్యను పెంచి మెరుగైన పాల దిగుబడి సాధించాల్సి ఉంది. దేశీయ జాతులను సంరక్షించుకుంటూనే పాల ఉత్పత్తిని పెంచే దిశగా పరిశోధనలు వేగవంతంగా సాగాలి. సురక్షితమైన వాతావరణంలో పాలసేకరణ, పాశ్చరైజేషన్, రవాణా జరగాల్సిన అవసరాన్ని నిపుణులు పదేపదే ప్రస్తావిస్తున్నా- అవరోధాలు తొలగిపోలేదు. మార్కెట్లో పాల అమ్మకం, సేకరణ ధరకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇది పాడి రైతులు, వినియోగదారులు... ఇరు వర్గాలకూ శరాఘాతంలా మారింది. సహకార సంఘాల ఏర్పాటు, మార్కెట్లో పాల నాణ్యత, శీతల రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా పాడి రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. డెయిరీ ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడం సహకార డెయిరీలకు కొంత ప్రతికూలంగా మారింది. ఉప ఉత్పత్తులు, డెయిరీ యంత్రాలపై జీఎస్టీ తగ్గించాలన్న విన్నపాలు వస్తున్నాయి. ప్యాకింగ్ సామగ్రి ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారమవుతున్నాయి. డెయిరీలకు మరింత ప్రోత్సాహం, పన్నుల్లో వెసులుబాటు, ఇంధన రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది.
పెనికలపాటి రమేష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’