సహ చట్ట స్ఫూర్తిపై దాడి

పాలనలో పారదర్శకతకు పట్టం కట్టడంలో సమాచార హక్కు (సహ) చట్టం కీలకంగా నిలుస్తుంది.

Published : 05 Dec 2022 01:29 IST

పాలనలో పారదర్శకతకు పట్టం కట్టడంలో సమాచార హక్కు (సహ) చట్టం కీలకంగా నిలుస్తుంది. దాన్ని నీరుగార్చే ఎత్తుగడలు ప్రస్తుతం ముసురుకుంటున్నాయి. సమాచార పరిరక్షణ (డేటా ప్రొటెక్షన్‌) బిల్లులో సూచించిన ఒక సవరణ సహ చట్ట స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచ దేశాల సమాచార హక్కు చట్టాల్లో ఉత్తమమైన వాటిలో మనదీ ఒకటిగా గుర్తింపు పొందింది. దేశానికి నిజమైన పాలకులు, హక్కుదారులు ప్రజలేనని, ప్రభుత్వానికి సంబంధించిన యావత్‌ సమాచారం వారికి తెలియాలన్న స్ఫూర్తి సహ చట్టానికి ఆయువుపట్టు. ఈ చట్టాన్ని క్రమంగా నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరిస్తున్నాయి. నూతన డేటా ప్రొటెక్షన్‌ బిల్లులో సూచించిన సవరణ- సమాచారం అందించడానికి నిరాకరించేందుకు ఆయుధంగా మారేముప్పు పొంచి ఉంది.

నిబంధనలకు తిలోదకాలు

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చర్యలు వంటి సమస్త సమాచారాన్ని పౌరులు తెలుసుకునేందుకు సహ చట్టం అవకాశమిచ్చింది. అదే సమయంలో దేశ రక్షణ, నిఘా వంటి సున్నితమైన పది అంశాలకు సంబంధించిన సమాచారం అందించడాన్ని చట్టంలోని సెక్షన్‌ 8(1) మినహాయించింది. పాలనలో పారదర్శకతను కాంక్షించే సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాల్లోని లొసుగులను వెలుగులోకి తెచ్చేందుకు సహ చట్టాన్ని విస్తృతంగా వినియోగించుకొన్నారు. అది పాలకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో ఏడాది తిరక్కుండానే మరిన్ని అంశాల్లో సమాచారం నిరాకరించేలా చట్ట సవరణ చేయాలని నాటి పాలకులు తలపోశారు. అందుకోసం 2006లో ప్రతిపాదన సైతం తెచ్చారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరిన్ని మినహాయింపుల జోలికి వెళ్ళకుండానే సమాచార కమిషన్ల హోదా, గడువు నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సునిశిత సమీక్షల తరవాతే ఏయే అంశాలను మినహాయించాలి, ఎలాంటి వివరాలను పౌరులకు నిరాకరించాలన్నది సహచట్టం నిర్ధారించింది. అయితే, ఇప్పటికే అధికారులు రకరకాల కారణాలు చూపుతూ ప్రజలకు సమాచారం అందించడాన్ని నిరాకరిస్తున్నారు. ఒకవేళ మినహాయింపులను విస్తరిస్తే సహ చట్టం మరింతగా నీరుగారిపోయే ప్రమాదం ఉంది. చాలామంది అధికారులు సహ చట్టం నిబంధనలు సరిగ్గా పాటించడంలేదు. పైస్థాయి అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం అర్జీదారులను నిరాశలో నింపుతోంది.

సహచట్టంలోని మినహాయింపుల కింద సమాచారాన్ని నిరాకరించేందుకు అధికారులు ఎక్కువగా సెక్షన్‌ 8(1)(జె)నే కారణంగా చూపుతున్నారు. దరఖాస్తుల్లో 35శాతం ఈ సెక్షన్‌ కారణంగానే తిరస్కరణకు గురవుతున్నాయి. ప్రజలు కోరిన సమాచారం ప్రజావ్యవహారం లేదా ప్రజా ప్రయోజనంతో ముడివడినది కానప్పుడు; వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేది అయినప్పుడు దాన్ని నిరాకరించవచ్చని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. అయితే, సంబంధిత వివరాలను బహిర్గతం చేస్తే ప్రజా ప్రయోజనాలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ప్రజా సమాచార అధికారులు లేదా అప్పిలేట్‌ అథారిటీ భావిస్తే, అప్పుడు ఆ సమాచారాన్ని దరఖాస్తుదారుకు వాళ్లు అందించవచ్చు. మరోవైపు, సమాచారం అందించే విషయంలో చట్టంలో మరో ప్రధాన నిర్దేశమూ ఉంది. పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభలు అడిగితే నిరాకరించలేని సమాచారాన్ని, పౌరుల విషయంలోనూ కాదనకూడదని అది విస్పష్టంగా చెప్పింది. సెక్షన్‌ 8(1)(జె)ను కారణంగా చూపి దరఖాస్తులను తోసిపుచ్చుతున్న అధికారులు, వాటిలో అడిగిన సమాచారాన్ని చట్టసభలకూ అందించకుండా ఉంటారా? చట్టసభల సభ్యులకు అందించే సమాచారాన్ని... ఆర్టీఐ శాసనం ప్రకారం సామాన్యులకు ఎందుకు ఇవ్వరు? సెక్షన్‌ 8(1)(జె)ను ప్రయోగించే ప్రతిసారీ ఈ విషయంలో వారు స్పష్టత ఇవ్వాలి. సహ చట్టంలో ఎన్ని పకడ్బందీ నిబంధనలున్నా- వ్యక్తిగత వివరాలు అన్న సాకుతో చాలా అర్జీలను తిరగ్గొడుతున్నారు. ఇది అవినీతి అధికారులకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు రక్షణ కవచంలా మారింది.

అడ్డుకోవాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్‌ బిల్లులోని సెక్షన్‌ 30(2) ద్వారా ఆర్టీఐ చట్టానికి సవరణను ప్రతిపాదించింది. వ్యక్తిగత సమాచారానికి గంపగుత్తగా మినహాయింపు వర్తిస్తుందనే విధంగా సెక్షన్‌ 8(1)(జె)ను పూర్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే- సమాచార హక్కు చట్టం స్ఫూర్తి, ప్రజాప్రయోజనాలు దెబ్బతింటాయి. విశాల సమాజ హితం ఇమిడి ఉన్నప్పటికీ వ్యక్తులకు సంబంధించిన ఏ సమాచారమూ ఇకపై బయటకురాదు.  ఈ సవరణ కనుక ఆమోదం పొందితే సమాచార హక్కు దరఖాస్తులను అధికారులు చాలా తేలిగ్గా తోసిపుచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సవరణను పౌరులు అడ్డుకోవాలి. అప్పుడే సహ చట్టం నిర్వీర్యం కాకుండా కాచుకోవడం సాధ్యమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.