విదేశాల నుంచి సులభంగా నగదు బదిలీ
ప్రవాసులు స్వదేశానికి పంపే నగదు విషయంలో ప్రపంచంలోనే భారత్ది అగ్రస్థానం. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కన్నా ప్రవాసులు పంపే నిధులే ఎక్కువ.
ప్రవాసులు స్వదేశానికి పంపే నగదు విషయంలో ప్రపంచంలోనే భారత్ది అగ్రస్థానం. భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కన్నా ప్రవాసులు పంపే నిధులే ఎక్కువ. ఇలా పంపించే మొత్తాల్లో కొంతమేర దళారులకు చెల్లించాల్సి వస్తోంది. ఇకపై విదేశాల్లోని భారతీయులు సైతం యూపీఐ వ్యవస్థ ద్వారా ఇండియాకు డబ్బులు పంపవచ్చు. దీనివల్ల విదేశాల్లోని మన ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. సౌకర్యమూ పెరుగుతుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు 3.2 కోట్ల మంది ఉన్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు. వీరంతా మాతృదేశానికి డబ్బులు పంపుతూనే ఉన్నారు. అందుకే 1995-2022 మధ్య వరసగా 23 ఏళ్లపాటు ప్రవాసుల జమల్లో భారత్ అగ్రస్థానం నిలుపుకొంటూ వస్తోంది. ప్రవాస భారతీయులు 2021లో ఇండియాకు పంపిన నగదు 8,700 కోట్ల డాలర్లని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఆ సంవత్సరం డిసెంబరు 31నాటి మారక విలువ ప్రకారం అది దాదాపు రూ.6,44,000 కోట్లకు సమానం. 2022లో ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) జమలు దాదాపు 9,000 కోట్ల డాలర్లకు చేరతాయని ప్రపంచ బ్యాంకు అంచనా. ఈ మొత్తాలు మరి కొన్నేళ్లలో 10,000 కోట్ల డాలర్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించనున్నాయి. ఇప్పటికే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రవాసుల జమలు మూడు శాతానికి చేరాయి. ఒకప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సభ్య దేశాల నుంచి భారతీయులు పంపే మొత్తాలు అత్యధికంగా ఉండేవి. కొవిడ్ మహమ్మారి వల్ల గల్ఫ్ దేశాల్లో అవకాశాలు తగ్గి- అమెరికా, బ్రిటన్, సింగపుర్లలో భారతీయ నిపుణులకు గిరాకీ పెరిగింది. ఫలితంగా 2020-21లో ప్రవాసుల జమల్లో యూఏఈని అమెరికా మించిపోయింది.
ఇక్కడ చిక్కేమిటంటే, విదేశాల నుంచి మనవాళ్లు పంపే ప్రతి 100 రూపాయలకు 94 రూపాయలు మాత్రమే వారి కుటుంబాలకు జమ అవుతోంది. మిగతాదంతా దళారుల పాలబడుతోంది. గల్ఫ్ దేశాల్లో కూలీలుగా, సాధారణ గుమాస్తాల్లా పనిచేసే పేద భారతీయులకు ఇది తీరని నష్టం. ఇకనుంచి వీరు తేలిగ్గా డబ్బు పంపడానికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్)ని అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది. దీనివల్ల మన కార్మికులు, నిపుణులకు ఎంతో డబ్బు ఆదా కావడమే కాదు, భారతీయ ఆర్థిక ప్రతిభానైపుణ్యం నుంచి ఉత్పన్నమైన యూపీఐకి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యమూ లభిస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపుర్, హాంకాంగ్, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్ వంటి దేశాల్లోని భారత సంతతి ప్రజలు త్వరలోనే యూపీఐని ఉపయోగించి స్వకుటుంబాలకు డబ్బు పంపగలుగుతారు. మున్ముందు ఈ జాబితాలో మరిన్ని దేశాలు చేరవచ్చు. భాగస్వామ్య బ్యాంకులు ఏప్రిల్ 30కల్లా ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) ఆదేశించింది. 2016లో యూపీఐ సౌకర్యం ప్రారంభమైనప్పటి నుంచి 382 బ్యాంకులు అందులో భాగస్వాములయ్యాయి. ఈ బ్యాంకుల్లో నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ) ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరపవచ్చు. యూపీఐలో సభ్యులుగా ఉన్న బ్యాంకుల ద్వారా మాత్రమే వారు చెల్లింపులు జరపాలి.
ప్రస్తుతం భారత్లో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్, పేటీఎం వంటి యూపీఐ యాప్లు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఇండియాలోని వినియోగదారులు తన బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నంబరుతో యూపీఐని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ రోమింగ్ రుసుములు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ప్రవాసులు తమ భారతీయ ఫోన్ నంబరును అట్టిపెట్టుకోవలసి వస్తోంది. ఇకపై వారు భారతీయ నంబరును పక్కనపెట్టి, అంతర్జాతీయ ఫోన్ నంబరుతోనే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలను యూపీఐతో అనుసంధానించవచ్చు. అక్రమ ధన చలామణీ, ఉగ్రవాదులకు నిధుల బదిలీ నిరోధానికి అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఈ ఖాతాల ద్వారా యూపీఐ సేవలను అనుమతిస్తారు. ప్రస్తుతం నగదు బదిలీకి అందుబాటులో ఉన్న నెఫ్ట్, ఐఎంపీఎస్ సేవలకన్నా అత్యంత సులభంగా, వేగంగా యూపీఐ సేవలు పొందవచ్చు.
వరప్రసాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా