కట్టుతప్పిన యాంటీబయాటిక్స్‌ వాడకం

వాతావరణ పరిస్థితులు, పెరిగిన చలి కారణంగా ప్రస్తుతం జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఒళ్లు, గొంతునొప్పి వంటివీ వేధిస్తున్నాయి. వీటినుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్‌ వాడకం అధికమైంది. దీనివల్ల నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 04 Feb 2023 00:23 IST

వాతావరణ పరిస్థితులు, పెరిగిన చలి కారణంగా ప్రస్తుతం జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఒళ్లు, గొంతునొప్పి వంటివీ వేధిస్తున్నాయి. వీటినుంచి బయటపడేందుకు యాంటీబయాటిక్స్‌ వాడకం అధికమైంది. దీనివల్ల నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల జలుబు, జ్వరంవంటి వాటి బారిన పడుతున్న వారు దాదాపు అన్ని ఇళ్లలో ఉంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటివి రాగానే నేరుగా మందుల దుకాణానికి వెళ్ళి యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. ఇలా ఇష్టారాజ్యంగా వాడితే యాంటీబయాటిక్స్‌ అసలు పనిచేయడమే మానేస్తాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకు సమర్థ చికిత్స అందించడానికి కనుగొన్న దివ్య ఔషధాలే యాంటీబయాటిక్స్‌. కొన్నిరకాల వ్యాధుల వల్ల వచ్చే తీవ్రమైన దుష్ఫలితాలను తగ్గించడంలో ఇవి సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం కొన్ని రకాల బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ పనిచేయడం లేదు. దీన్నే వైద్య పరిభాషలో యాంటీబయాటిక్‌ నిరోధకత అంటున్నారు.

యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటమే దీనికి ప్రధాన కారణం.అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల  వాటికి లొంగని బ్యాక్టీరియా ఇంకా వృద్ధిచెందుతోంది. ఆ నిరోధక లక్షణాలు ఇతర సూక్ష్మజీవులకూ అందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్‌ వాడుతున్న ప్రజల్లో మూడోవంతుకు అవి అవసరం లేదన్నది అమెరికా వ్యాధి నియంత్రణ, నిరోధక కేంద్రం మాట. బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను మాత్రమే యాంటీబయాటిక్స్‌ తగ్గిస్తాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్లకు అవి పనికిరావు. జలుబు, ఫ్లూ వంటి వాటికి అసలు యాంటీబయాటిక్స్‌ అవసరం లేదన్నది వైద్య నిపుణుల మాట.  వైరల్‌ ఇన్ఫెక్షన్లకూ వాటిని వాడటం వల్ల అవి తగ్గకపోగా, ఇతర దుష్ప్రభావాలు సైతం తలెత్తే ప్రమాదముంది. భారత్‌లో అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌ల కారణంగా జలుబు, దగ్గు ఎక్కువగానే వస్తుంటాయి. చాలామంది నేరుగా మందుల దుకాణానికి వెళ్ళి, తమకు తెలిసిన యాంటీబయాటిక్స్‌ తీసుకుంటున్నారు. ఈ రుగ్మతలకు పెద్దగా మందులు వాడకపోయినా ఒకటి లేదా రెండు వారాల్లో అందరూ కోలుకొంటారు. అంతకుమించి జ్వరం కొనసాగినా, మరీ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా అప్పుడు మాత్రమే, అదీ వైద్యులు చెప్పినట్లుగా ఔషధాలు వాడాలి.

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చాలామంది టెలీమెడిసిన్‌పై ఆధారపడ్డారు. పరిచయమున్న వైద్యులు ఫోన్‌, వీడియోకాల్స్‌ ద్వారా పరిస్థితి తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు సూచించారు. ఈ క్రమంలో అప్పట్లో చాలామంది పెద్దమొత్తంలో యాంటీబయాటిక్స్‌ తెచ్చుకొని ఇళ్లలో దాచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాస్త గొంతునొప్పి రాగానే వాటిని వాడుతున్నారు. సాధారణంగా ఏ మందునైనా వాడటానికి మోతాదు ఉంటుంది. వ్యాధి లక్షణాలను బట్టి అయిదు లేదా ఏడెనిమిది రోజులు మందులు వాడాలని వైద్యులు సూచిస్తారు. చాలామంది కాస్త లక్షణాలు తగ్గగానే యాంటీబయాటిక్స్‌ వాడకం ఆపేస్తున్నారు. దానివల్ల లోపల నిద్రాణంగా ఉండే బ్యాక్టీరియా మరింత బలం పుంజుకొంటుంది. ఆ వ్యక్తి వాడిన యాంటీబయాటిక్స్‌కు అది నిరోధకతను పొందుతుంది.

ఇండియాలో రోగులకు యాంటీబయాటిక్స్‌ను సూచించడంలో కాస్త సంయమనంతో వ్యవహరించాలని వైద్యులకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచించింది. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన న్యుమోనియాకు అయిదు రోజులు, ఆస్పత్రిలో వచ్చే న్యుమోనియాకైతే ఎనిమిది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌ వాడాలని ఇటీవల తెలిపింది. కేవలం జ్వరం, తెల్లరక్తకణాల సంఖ్య, కల్చర్‌, రేడియాలజీ పరీక్షల ఆధారంగానే కాకుండా క్లినికల్‌ డయాగ్నసిస్‌ ఆధారంగా మందులు సూచించాలని తన మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్‌ వివరించింది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో ఉన్న యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడితేనే భవిష్యత్తు తరాలకు మందుల కొరత లేకుండా చూసుకోగలం. లేనిపక్షంలో భవిష్యత్తులో వచ్చే బ్యాక్టీరియల్‌ వ్యాధులు ఏ మందులకూ లొంగకుండా మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది.

పి.కామేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.