హడలెత్తిస్తున్న రేబిస్‌

చిన్నారులు, పెద్దలపై వీధి శునకాల దాడులు ఇటీవల అధికమయ్యాయి. బాధితుల్లో పలువురు బాలలు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర విషాదకరం. కుక్కకాటు వల్ల రేబిస్‌ వ్యాధికి గురై మన దేశంలో ఏటా వేల మంది మృత్యువాత పడుతున్నారు. 

Published : 21 Mar 2023 02:58 IST

చిన్నారులు, పెద్దలపై వీధి శునకాల దాడులు ఇటీవల అధికమయ్యాయి. బాధితుల్లో పలువురు బాలలు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర విషాదకరం. కుక్కకాటు వల్ల రేబిస్‌ వ్యాధికి గురై మన దేశంలో ఏటా వేల మంది మృత్యువాత పడుతున్నారు. 

రేబిస్‌ అనేది ఒక జూనోటిక్‌ (జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే) వ్యాధి. ఇది రేబిస్‌ అనే వైరస్‌ వల్ల వస్తుంది. రేబిస్‌ వ్యాధి సోకిన జంతువు మరొక జంతువు లేదా మనుషులను కరచినప్పుడు లాలాజలం ద్వారా శరీరంలోకి వ్యాధి క్రిములు ప్రవేశిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఏటా యాభై అయిదు వేల మందికి పైగా రేబిస్‌ వల్ల మృత్యువాత పడుతున్నారు. 95శాతం మరణాలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే నమోదవుతున్నాయి. మొత్తం రేబిస్‌ మరణాల్లో భారత్‌ వాటా 36శాతం. ఇండియాలో ప్రతి సంవత్సరం సుమారు ఇరవై వేల మందిని రేబిస్‌ పొట్టన పెట్టుకుంటోంది. పైగా భారత్‌లో 30-60శాతం రేబిస్‌ మరణాలు 15 ఏళ్లలోపు పిల్లల్లోనే నమోదవుతుండటం తీవ్ర విషాదకరం. చిన్నారుల్లో కుక్కకాట్లను సరిగ్గా గుర్తించకపోవడం వల్ల వారి మరణాలు అధికంగా ఉంటున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, నార్వే వంటి దేశాలు చాలా ఏళ్ల క్రితమే రేబిస్‌ను నిర్మూలించాయి.

నీళ్లంటే భయం

పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల్లోనే రేబిస్‌ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున్న రేబిస్‌ వ్యాధి కేసుల్లో 99శాతం కుక్క కాటువల్లనే సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ఏటా 860 కోట్ల డాలర్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రేబిస్‌ సోకిన కుక్క కరిస్తే మనిషిలో ఆ లక్షణాలు 3-6 వారాలమధ్య కనిపిస్తాయి. ఒక్కోసారి మూడు నెలలూ పట్టవచ్చు. లక్షణాలు కనిపించిన తరవాత ఎలాంటి మందులు వాడినా ఫలితం ఉండదు. అందుకే, కుక్క కరిస్తే వెంటనే వైద్యం చేయించుకోవడం తప్పనిసరి. రేబిస్‌ వ్యాధి సోకిన కుక్క ప్రవర్తనను బట్టి చాలావరకు ఆ వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు. అసాధారణంగా ప్రవర్తించడం, తననుతానే కరచుకోవడం, చెక్కలు, రాళ్లు వంటి వాటిని కొరకడం, అడ్డువచ్చిన వారిని కరవడం, నోటివెంట నురగతో కూడిన చొంగ కారడం, పిచ్చి చూపులు చూస్తూ పెద్దగా మొరగడం వంటి లక్షణాలు రేబిస్‌ సోకిన జంతువులో కనిపిస్తాయి. ఆ తరవాత నెమ్మదిగా వ్యాధి తీవ్రమై పక్షవాతం బారిన పడి శారీరకంగా కృశించి ఆ కుక్క మరణిస్తుంది. రేబిస్‌ బారిన పడిన మనిషిలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. పైగా ముఖం, మెడ వంటి భాగాల్లో కుక్క కరిస్తే క్రిములు వేగంగా మెదడుకు చేరతాయి. రేబిస్‌ వ్యాధి ప్రారంభంలో ఆకలి మందగించడం, తలనొప్పి, వికారం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్తిగా శరీరంలో వ్యాధి వ్యాపిస్తే రేబిస్‌ క్రిములు మనిషి లాలాజలం, చర్మం, మూత్రపిండాలు, గుండె, కంటిరెటీనా వంటి అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. రేబిస్‌ సోకిన మనిషి (కుక్క సైతం) నీటిని చూస్తే విపరీతంగా భయపడతాడు. నీళ్లు తాగాలంటే గొంతు పట్టేసి తీవ్రమైన నొప్పికి గురి కావడమే దీనికి కారణం. అందుకే రేబిస్‌ వ్యాధిని హైడ్రోఫోబియా అనీ పిలుస్తారు. రేబిస్‌ కేవలం కుక్కల ద్వారానే కాకుండా పిల్లులు, గబ్బిలాలు వంటివాటినుంచీ సంక్రమించే అవకాశం ఉంది.

సత్వర చికిత్సతో రక్షణ...

మనిషిని కుక్క కరిస్తే తక్షణమే గాయాన్ని సబ్బునీటితో కడిగి వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందే సరైన చికిత్స తీసుకుంటే నూరు శాతం రేబిస్‌ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రేబిస్‌ వ్యాధి సోకిన కుక్క మనుషుల్ని కరిస్తే వెంటనే యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ముఖ్యంగా, రేబిస్‌ సోకిన కుక్క మనిషి ముఖంపై కరిస్తే తక్షణమే వైద్యం చేయించుకోవాలి. డాక్టర్‌ సూచించిన మేరకు ఇంజక్షన్లను పూర్తి కోర్సు వాడాలి. రేబిస్‌ వ్యాధికి హోమియోలోనూ మంచి మందులున్నాయి. ఏ మందును అయినా అనుభవజ్ఞులైన వైద్యుల సూచనల మేరకు వినియోగించాలి. రేబిస్‌ వ్యాధిని నియంత్రించాలంటే పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. వీలునుబట్టి వీధి కుక్కలకూ వ్యాక్సిన్‌ అందించాలి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కుక్కల సంతతిని నివారించడంపై స్థానిక ప్రభుత్వాలు దృష్టి సారించాలి. పుర, నగరపాలక సంస్థల్లో పెంపుడు జంతువులకు లైసెన్సింగ్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్స్‌ లేకుండా కుక్కలను పెంచేవారు, పెంపుడు జంతువులను ఇష్టారీతిగా వీధుల్లో వదిలేసే వారికి భారీగా జరిమానాలు విధించాలి. రేబిస్‌ వ్యాధి గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే 2030 నాటికి దాన్ని ప్రపంచం నుంచి తరిమివేయాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరడానికి అవకాశం లభిస్తుంది.

 డాక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌, (విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.