అడవి తల్లి ఆప్తబంధువులు
తల్లులను కోల్పోయిన గున్న ఏనుగుల సంరక్షణ నేపథ్యంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ రూపొందింది. ఇటీవల అది ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఆ గున్న ఏనుగుల సంరక్షణ వెనక తెలుగు మూలాలు కలిగిన కాట్టునాయక వ్యక్తి కృషి ఉంది.
తల్లులను కోల్పోయిన గున్న ఏనుగుల సంరక్షణ నేపథ్యంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ రూపొందింది. ఇటీవల అది ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఆ గున్న ఏనుగుల సంరక్షణ వెనక తెలుగు మూలాలు కలిగిన కాట్టునాయక వ్యక్తి కృషి ఉంది.
అనాథలుగా మారిన రఘు, అమ్ము అనే రెండు గున్న ఏనుగులను తమిళనాట నీలగిరి కొండల్లో బొమ్మన్, బెల్లీ అనే ఇద్దరు చేరదీస్తారు. వాటిని కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడతారు. చివరకు బొమ్మన్, బెల్లీల మనసులు కలిసి వివాహం చేసుకుంటారు. ఏనుగుల వల్ల ఇద్దరి మధ్య అనురాగం చిగురించి ఏడడుగుల దాకా నడిపిస్తుంది. ఈ నిజజీవిత కథతో రూపొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ ఇటీవల ఆస్కార్ పురస్కారం సాధించింది. 2017-22 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టారు. దీన్ని గునీత్ మోంగా నిర్మించారు. కార్తికి గొంజాల్వెస్ దర్శకత్వం వహించారు. ఇందులో గున్న ఏనుగులను సంరక్షించే బొమ్మన్- తెలుగు మూలాలు కలిగిన కాట్టునాయక వర్గానికి చెందినవారు.
ఎన్నో తెలుగు పదాలు
తుంగభద్ర నదీతీరంలో బళ్ళారి, కంపిలి, ఆనెగొంది తదితర ప్రాంతాల నుంచి తెలుగు మూలాలు కలిగిన చాలామంది వివిధ కారణాల వల్ల గతంలో దక్షిణాదిన కావేరీ ప్రాంతానికి వలసవెళ్ళారు. అనంతర కాలంలో దక్షిణాపథమంతా విస్తరించారు. వీరిలో కొందరు అరణ్యాల్లో ఆవాసాలు ఏర్పరచుకొన్నారు. వీరిని కాట్టునాయకర్లు అంటారు. కాడు అంటే అడవి. మరికొందరు గోవులను మేపుతూ భుజంపై కంబలి ధరించేవారు. వీరికి కంబల నాయకర్లు అనే పేరు వచ్చింది. మరికొందరు సంస్థానాలనూ పాలించారు. వీరిని రాజకంబల నాయకర్లు అంటారు. వీరిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ముఖ్యుడు. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన కట్టబొమ్మన్ (తెలుగులో కట్టబ్రహ్మన) తూత్తుకుడి జిల్లాలోని పాంచాలన్కురిచ్చి సంస్థానాన్ని పాలించారు. బ్రిటిష్వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన ఆయన, శిస్తు ఎందుకు కట్టాలని తిరుగుబాటు చేశారు. కోవిల్పట్టి సమీపంలోని కయత్తార్ గ్రామంలో బ్రిటిష్ వారు ఆయనను ఉరితీశారు. కట్టబొమ్మన తెలుగు వ్యక్తేనని ప్రఖ్యాత చరిత్రకారుడు శివజ్ఞాన గ్రామణి స్పష్టంగా వెల్లడించారు. కాట్టునాయకర్లు ఇప్పటికీ తమ ఇంట్లో తెలుగు భాష మాట్లాడతారు. మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం ప్రాచీన చరిత్ర విభాగానికి చెందిన డాక్టర్ పి.గణేశన్ తన పరిశోధన పత్రంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. మదురై జిల్లాలోని కాట్టునాయకర్లు ఇంట్లో, బంధుమిత్రులతో తెలుగే మాట్లాడతారని అదే విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కె.ఉమారాజ్, రేఖ సైతం గతంలో తెలియజెప్పారు. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కాట్టునాయకర్లు తమిళం వినియోగిస్తారు. వారి తెలుగు, తమిళాలను ఉమారాజ్, రేఖ తులనాత్మకంగా అధ్యయనం చేశారు. అబ్బ, అవ్వ, అక్క, బాతు, పాంబు (పాము), వంక (వాగు), కుటి చెయ్ (కుడి చెయ్యి), కుటి కాల్ (కుడి కాలు), పేకులు (పేగులు), తగ్గు (దగ్గు) వంటి తెలుగు పదాలు కాట్టునాయకర్ల వాడుకలో నిలిచి ఉన్నట్లు వారు తమ పరిశోధనలో వెల్లడించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన జానపద గీతాలను ఇప్పటికీ కాట్టునాయకర్లు పాడుకుంటారు. వాటిలో కొన్ని తెలుగు పదాలు వినిపిస్తాయి. ఉదాహరణకు... ‘ఏళా ఏళా ఏళో ఏళ ఏళో హైలెస్సా/ ఈడ్చి సెప్పండా! హైలెస్సా/ బిడ్డలు సెప్పండా! హైలెస్సా/ తల్లులు సెప్పండా! హైలెస్సా/ సిన్నపిల్లలు సెప్పండా! హైలెస్సా’ వంటి పాటల్లో చాలా తెలుగు పదాలు వినిపిస్తాయి. అడవుల్లో క్రూరమృగాల నుంచి రక్షించుకొనేందుకు కాట్టునాయకులు ప్రత్యేక వాయిద్యాలు తయారు చేసుకున్నారు. నేటికీ వాటిని ఉపయోగిస్తున్నారు. అడవుల్లో జీవించిన కాట్టునాయకర్లకు వన్యప్రాణుల గురించి బాగా తెలుసు. అందుకే పలువురు ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యారు. వీరిలో పురుషులకు పేరు చివరన బొమ్ము, బొమ్మన్ అని, మహిళలకు బొమ్మాయి అని ఉంటుంది.
పలు జీవనాధారాలు
ఒకప్పుడు లోతట్టు అడవుల్లో నివసించిన కాట్టునాయకర్ల ప్రధాన వృత్తి వేట. అడవిలో లభించే తేనె, పండ్లు, సుగంధ ద్రవ్యాలను తమకు అవసరమైనంత మేర సేకరించి చిన్న గుడిసెలు వేసుకొని జీవనం సాగించేవారు. తమిళనాడులో యాభై వేల మందికి పైగా కాట్టునాయకర్లు ఉన్నట్లు అంచనా. వారు ప్రధానంగా నీలగిరి, కడలూరు, కన్యాకుమారి, నాగపట్నం, కంచి, ధర్మపురి, సేలం తదితర జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నారు. ప్రస్తుతం వేట నిషిద్ధం కావడంతో కాట్టునాయకర్లు కూలి పనులు చేసుకుంటూ, ఆటోలు నడుపుతూ, చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ, అటవీశాఖలో జంతు సంరక్షకులుగా జీవనం సాగిస్తున్నారు. మనిషికి, వన్యప్రాణులకు మధ్యగల అనుబంధాన్ని ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ కళ్లకు కట్టింది. దాని ద్వారా తెలుగు మూలాలు కలిగిన కాట్టునాయకర్ల గురించి ప్రపంచానికి తెలిసింది.
డాక్టర్ సగిలి సుధారాణి,
(తెలుగు భాషా పరిశోధకులు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్