బడుగు రైతులకు దక్కని భరోసా

నానాటికీ పెరుగుతున్న సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తులు, చీడ పీడలు భారత్‌లో రైతులను కుంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగులో అన్నదాతలకు ఆదరువుగా నిలిచేందుకు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తెచ్చింది.

Published : 29 May 2023 00:35 IST

నానాటికీ పెరుగుతున్న సాగు ఖర్చులు, ప్రకృతి విపత్తులు, చీడ పీడలు భారత్‌లో రైతులను కుంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగులో అన్నదాతలకు ఆదరువుగా నిలిచేందుకు కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని తెచ్చింది. అందులో పలు లోపాలు నెలకొన్నాయి.

భారత్‌లో 90శాతానికి పైగా సన్న, చిన్నకారు రైతులే. పర్యావరణ మార్పుల కారణంగా వ్యవసాయం ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. రైతుల బతుకులు అధ్వానంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతల జీవితాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతూ ఉన్నాయి. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా దేశవ్యాప్తంగా రెండు హెక్టార్లకు మించకుండా వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రూ.6,000 ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుంది. ఈ పథకం మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది.

డిజిటలీకరణలో వెనకంజ

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం వల్ల రైతుల చేతికి అదనంగా నగదు రావడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరిగినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు అందించే ఆర్థిక సాయాన్నీ కలిపితే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. దానివల్ల గ్రామీణ పేదరికం తగ్గుతుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కౌలు రైతులను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు కౌలు రైతులే. దేశీయంగా ఒక్కో ప్రాంతంలో భూమి ఉత్పాదకత ఒక్కో విధంగా ఉంటుంది. వాతావరణం, వసతులు, నేల స్వభావం తదితరాలపై పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద సాగు భూమి పరిమితులను నిర్ణయించాలని నిపుణులు కోరుతున్నారు. దేశీయంగా భూ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలీకరణ చేసినప్పుడే ఈ పథకం విజయవంతం అవుతుంది. కొన్నిరాష్ట్రాల్లో భూముల డిజిటలీకరణ ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు.

సమధిక నిధులు అవసరం

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి గత కేంద్ర బడ్జెట్లో రూ.68 వేల కోట్లు కేటాయించారు. రూ.60వేల కోట్లే ఖర్చుచేశారు. ఈసారి బడ్జెట్లోనూ అంతే మొత్తం ప్రత్యేకించారు. గత బడ్జెట్లో లబ్ధిదారుల సంఖ్యను 10.41 కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి వారి సంఖ్య 8.42 కోట్లకు తగ్గింది. కౌలు రైతులకూ ఈ పథకం చేరువయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. భూ రికార్డుల డిజిటలీకరణ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో ఊపందుకోవాలి. అవసరాన్ని బట్టి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సమధిక నిధులను కేంద్రం కేటాయించాలి.

 ఆచార్య బి.ఆర్‌.కె.రావు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి