పాడి పరిశ్రమకు ప్రోత్సాహమే దాణా
నేడు ప్రపంచ పాల దినోత్సవం. పాలు సంపూర్ణ పోషకాహారం. ప్రపంచ పాల ఉత్పత్తిలో 24శాతం వాటాతో భారతదేశం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. పాడిరంగంలో అధునాతన పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంచి ప్రపంచ మార్కెట్లో మూడోవంతు వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
నేడు ప్రపంచ పాల దినోత్సవం. పాలు సంపూర్ణ పోషకాహారం. ప్రపంచ పాల ఉత్పత్తిలో 24శాతం వాటాతో భారతదేశం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. పాడిరంగంలో అధునాతన పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంచి ప్రపంచ మార్కెట్లో మూడోవంతు వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఏడాదికి సుమారు 22.1 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. 2033-34 నాటికి 33 కోట్ల టన్నులకు పెంచాలనే లక్ష్యంతో ‘శ్వేతవిప్లవం 2.0’కి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశీయంగా పెరుగుతున్న పాల ధరలు, ఉత్పత్తి పెరుగుదల రేటులో తగ్గుదల, గడ్డి కొరత, కల్తీ, తగ్గిపోతున్న పాడిరైతుల సంఖ్య వంటివి ఈ రంగానికి సవాలుగా మారాయి. ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తిలో పోటీ దేశాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంది.
దెబ్బతింటున్న నాణ్యత
కొవిడ్ మహమ్మారి సమయంలో పాల వినియోగం తగ్గి సేకరణ ధరలు పతనమయ్యాయి. పాడి పశువులను పోషించలేక రైతులు వాటి సంఖ్యను తగ్గించుకున్నారు. పాల దిగుబడి పడిపోయింది. కొవిడ్ తదనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాలు, పాల పదార్థాల వినియోగం పెరుగుతున్న స్థాయిలో లభ్యత లేకపోవడంతో సేకరణ ధరలు పెరిగాయి. డెయిరీలు పాల విక్రయ ధరను పెంచాయి. దేశంలో వేగవంతమైన ఆర్థికవృద్ధి కారణంగా పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఉప ఉత్పత్తులైన పెరుగు, ఐస్క్రీమ్, నెయ్యి, వెన్న, పన్నీరు, మిల్క్షేక్, బాదంపాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు ఉపఉత్పత్తుల వినియోగంపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఇప్పటికీ 38శాతం పాలు మాత్రమే సంఘటిత రంగం ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి. సంఘటిత రంగంలో పాల సేకరణ శాతం పెరిగితే కల్తీలకు అడ్డుకట్ట పడుతుంది. డెయిరీలు పాలను సేకరించిన తరవాత శుద్ధి చేసి వినియోగదారులకు విక్రయించే ముందు అన్ని పరీక్షలు పూర్తిచేసి పంపుతారు. అయితే, కొంతమంది వ్యాపారులు రైతుల నుంచి పాలు సేకరించి నాణ్యతా పరీక్షలు లేకుండానే నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. సేకరణ నుంచి విక్రయం వరకు పలు దశల్లో పాల నాణ్యత దెబ్బతింటోంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చేపట్టిన పరీక్షల్లో నాలుగు శాతం పాలు కల్తీబారిన పడుతున్నట్లు గుర్తించారు. పాలలో కల్తీని అరికట్టేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్), జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) సహాయంతో దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల నాణ్యత, భద్రత కోసం ఏకీకృత వ్యవస్థను అమలులోకి తెచ్చింది. పాల నాణ్యతలో ఏకరూపతను సాధించడమే దీని ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంచార బృందాలతో పాల తనిఖీ చేపడుతోంది.
పాడి పరిశ్రమ పురోగతి కోసం ప్రస్తుతమున్న పశువుల జన్యు సామర్థ్యాన్ని మెరుగు పరచాలి. మేత లభ్యతను, మెరుగైన పశువైద్య సేవలను విస్తృతం చేయాలి. నాణ్యమైన వ్యాధిరహిత వీర్య ఉత్పత్తి, సమర్థమైన కృత్రిమ గర్భధారణ సేవలు కీలకం. పోషకాలు కలిగిన దాణా అందుబాటు పెరగాలి. పాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం కొంతమేరకు సంతృప్తినిస్తున్నా, పాడిరైతులకు ప్రోత్సాహం కల్పించడం తక్షణావసరం. దళారుల జోక్యం పెరగడంతో చాలాసార్లు రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఉప ఉత్పత్తుల తయారీతో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తుండగా, రైతులకు అంతంత మాత్రమే మిగులుతోంది.
ఎగుమతుల్లో వెనకంజ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువుల కొనుగోలు, రాయితీపై దాణా, రుణ పథకాల అమలు ద్వారా రైతులను ప్రోత్సహించాలి. పశుసంవర్ధక శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, సామాజిక కార్పొరేషన్లు, నాబార్డు తదితర సంస్థలు రాయితీలు ఇచ్చి అండగా నిలవాలి. పాల దిగుబడి పెంచడం, అధిక పోషకాలు కలిగిన దాణాను రూపొందించే దిశగా పరిశోధనలు పెరగాలి. మార్కెట్లో కల్తీ లేని నాణ్యమైన దాణా లభ్యతను పెంచాలి. విదేశాల్లో పాడి రైతుల అధిక దిగుబడుల కారణంగా సేకరణ, రవాణా సులభమై నిర్వహణ ఖర్చు తగ్గుతోంది. పాల నాణ్యత కూడా మెరుగ్గా ఉంటోంది. విదేశాల్లోని ప్లాంట్ల నిర్వాహకులకు ఖర్చులు తక్కువగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో వారికి సరైన పోటీ ఇవ్వలేకపోతున్నాం. ఈ కారణంగా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నా ఎగుమతుల్లో వెనకంజ వేయాల్సి వస్తోంది. పాడి రైతులను మార్కెట్కు అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. రైతులకు కచ్చితమైన ధర దక్కాలి. పశువైద్య విద్య, శిక్షణ నెట్వర్క్ను విస్తరించాలి. తద్వారా ఈ రంగానికి శిక్షణ పొందిన మానవ వనరుల లభ్యత పెరుగుతుంది.
పెనికలపాటి రమేష్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు