పగడపు దిబ్బలకు విపత్తులతో ముప్పు
కోరల్ రీఫ్స్గా పిలిచే పగడపు దిబ్బలు సముద్రాంతర ఆవరణ వ్యవస్థలు. నీరు వెచ్చగా, తేటగా ఉండి... లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి. మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు, కచ్, మన్నార్ సింధు శాఖలు, పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి.
కోరల్ రీఫ్స్గా పిలిచే పగడపు దిబ్బలు సముద్రాంతర ఆవరణ వ్యవస్థలు. నీరు వెచ్చగా, తేటగా ఉండి... లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి. మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు, కచ్, మన్నార్ సింధు శాఖలు, పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. పగడపు దిబ్బల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. నేడు ప్రపంచ పగడపు దిబ్బల అవగాహన దినోత్సవం సందర్భంగా...
పగడపు దిబ్బలు జెల్లీఫిష్, రొయ్యలు, నత్తలు, ఆల్చిప్పలు, నక్షత్ర చేపలు, సముద్ర తాబేళ్లు, సముద్ర పాములు వంటి ఎన్నో జీవులకు నెలవులు. ఎనిమిది వేల రకాల మత్స్య జాతులు వీటి వద్ద మనుగడ సాగిస్తాయని అంచనా. పగడపు దిబ్బలను ‘సముద్రపు వర్షాధార అడవులు’గా వ్యవహరిస్తారు. తక్కువ ప్రాంతంలోనే ఇవి అంతులేని జంతు, వృక్ష వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ దిబ్బలు పర్యాటక, సాంస్కృతిక విలువలతో పాటు, ఆర్థిక, సామాజిక, ఔషధ, పర్యావరణ సంబంధమైన ఎన్నో ఆవరణ వ్యవస్థలకు సేవలు అందిస్తాయి. ఇవి ఆర్థికంగా విలువైన మత్స్య జాతులకు నిలయాలు. తుపానులు వంటి ప్రకృతి విపత్తుల నుంచి సముద్ర తీరవాసులకు రక్షణ కల్పిస్తాయి. తీరాన్ని సముద్ర అలల తాకిడి నుంచి కాపాడతాయి. అలల శక్తిని 97 శాతం దాకా క్షీణింపజేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారిస్తాయి. ఆస్ట్రేలియా తీరంలో 2,600 కిలోమీటర్ల మేర వ్యాపించిన గ్రేట్ బారియర్ రీఫ్ అతిపెద్ద పగడపు దిబ్బగా పేరొందింది.
ద్వీపాలు, అఖాతాల్లోకి వెళ్ళడానికి జరిపే కాలువల తవ్వకాలు... సముద్రపు అడుగుభాగాన వలలు, పేలుడు పదార్థాలతో చేపలు పట్టడం వీటికి ప్రతికూలంగా మారుతున్నాయి. సముద్ర కాలుష్యం, గ్రీన్హౌస్ వాయువులు, సముద్రంలోకి అతిగా చేరే అవక్షేపాలు, లవణీయతలో మార్పులు, కీటకనాశక రసాయన అవశేషాలు పగడపు దిబ్బలకు ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయులు పెరిగిన ఫలితంగా చోటుచేసుకునే సముద్ర ఆమ్లీకరణం, చమురు తెట్టులతో పాటు మానవ చర్యల వల్ల వీటికి తీరని హాని కలుగుతోంది. సముద్రపు నాచు అతివృద్ధి, విపత్తులు, వ్యాధులు, చేపల మేత వంటి వాటివల్ల కలిగే దుష్ప్రభావాలూ నష్టం కలిగిస్తున్నాయి. భూతాపం కారణంగా సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతోంది. దాంతో అవి వ్యాధుల బారిన పడుతున్నాయి. సాగర జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సంభవించినప్పుడు పగడపు దిబ్బలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. పర్యవసానంగా అవి రంగు కోల్పోయి ఇతరత్రా సమస్యలతో దెబ్బతింటాయి. సముద్రపు ఆటుపోట్లవల్లా హాని కలుగుతుంది. పలు రకాల కారణాలతో క్షీణించే పగడపు దిబ్బలు అరుదుగా మాత్రమే తిరిగి జీవం పోసుకుంటాయి.
వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ తాజా నివేదిక ప్రకారం కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగినా 2050 నాటికి పగడపు దిబ్బల్లో 90శాతం నశిస్తాయని వెల్లడైంది. భారత్కు సంబంధించి 1998 నుంచి ఇప్పటిదాకా 60-85 శాతందాకా దెబ్బతిన్నాయి. వాటిలో కొన్ని తిరిగి కోలుకున్నాయి. 2004లో సంభవించిన సునామీ అండమాన్, నికోబార్ దీవుల్లో చాలామేర పగడపు దిబ్బలను దెబ్బతీసింది. చాలా దేశాలు వీటిని రక్షించేందుకు పర్యావరణ చట్టాలను రూపొందించాయి. భారత్ వీటిని వన్యప్రాణి సంరక్షణ చట్టంలో చేర్చి అత్యధిక స్థాయి రక్షణ కల్పించింది. కోరల్ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర ప్రక్రియల ద్వారా పగడపు దిబ్బల పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనదేశంలో మన్నార్ సింధుశాఖలో కోరల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చేపట్టారు. మానవప్రేరిత ఒత్తిడులు, భూమి, సముద్ర కాలుష్యం, అవక్షేపాలను తగ్గించడం, అతిగా చేపలు పట్టడాన్ని నిలువరించడం, చేపల వేటలో హానికర విధానాలను పరిహరించడం, శీతోష్ణస్థితి మార్పులను నిరోధించడం వంటి చర్యలు పగడపు దిబ్బలను పరిరక్షిస్తూ, పునరుద్ధరణకు తోడ్పడతాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు, తీరప్రాంత సమాజాల సంక్షేమానికి పగడపు దిబ్బలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎం.రామ్మోహన్
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM