Published : 02/02/2023 19:47 IST

Weight Loss: బరువు తగ్గాలంటే ఇవి కలిపి తినకూడదు!

ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. పలు ఆరోగ్య సమస్యలతో పాటు కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే చాలామంది ఈ సమస్యను దూరం చేసుకోవడానికి జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంటూ పలు రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వాటిని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరగటంతో పాటు, ఇతరత్రా వివిధ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఏయే పదార్థాలు కలిపి తీసుకోకూడదో తెలుసుకుందామా...

అన్నం+బంగాళాదుంపలు...

బంగాళాదుంపల్లో స్టార్చ్‌ అధికంగా ఉంటుంది. వీటిని అన్నంతో కలిపి తీసుకున్నప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ రెండిటినీ కలిపి తీసుకోకుండా ఉండాలంటున్నారు. అయితే వీటిని విడివిడిగా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రం ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని చెబుతున్నారు.

పాలు+అరటిపండ్లు..

పాలు, అరటిపండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటి ధర కూడా అందుబాటులో ఉంటుంది. అందుకే చాలామంది తమ రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటుంటారు. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు. పాలు, అరటిపండ్లను కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

ఓట్స్‌+డ్రై ఫ్రూట్స్..

బరువు తగ్గాలనుకునేవారిలో చాలామంది ఓట్స్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. ఇందులో చక్కెర స్థాయులు తక్కువగా ఉండడమే అందుకు కారణం. అయితే కొంతమంది ప్రొటీన్స్‌ కోసం ఓట్స్‌కు డ్రైఫ్రూట్స్‌ కలిపి తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడం అటుంచితే, బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండడం మేలంటున్నారు.

స్నాక్స్‌+డ్రింక్స్...

సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్‌ తిని టీ లేదా కాఫీ తాగాలనుకునేవారు చాలామంది ఉంటారు. టీ, కాఫీలు అలవాటు లేని వారిలో కొంతమంది కార్బొనేటెడ్ డ్రింక్స్‌ని తాగుతుంటారు. అయితే ఈ కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల అధిక బరువు సమస్య మాత్రమే కాకుండా ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని