నిమ్మలాంటి నిగనిగలాడే అందం.. ఇలా సొంతం!

నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేసుకోవడానికి వేసుకునే ఫేషియల్స్‌ దగ్గర్నుంచి మడమల....

Published : 02 May 2023 21:02 IST

నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేసుకోవడానికి వేసుకునే ఫేషియల్స్‌ దగ్గర్నుంచి మడమల పగుళ్లను నివారించడం వరకు.. ఇలా ప్రతి పనిలోనూ మనం నిమ్మరసాన్ని ఉపయోగిస్తుంటాం.

చుండ్రు సమస్యకు చెక్..

వాతావరణంలో క్రమంగా పెరుగుతున్న కాలుష్యం, ఇతరత్రా.. కారణాల వల్ల చుండ్రు సమస్య రోజురోజుకీ రెట్టింపవుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వివిధ రకాల హెయిర్‌ప్యాక్స్‌ కూడా పెట్టుకుంటూ ఉంటాం. కానీ నిమ్మకాయతో దీన్నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. నీరు, అల్లం రసం, నిమ్మరసం, ఆలివ్‌ నూనె కొద్దికొద్దిగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరే వరకు ఉంచాలి. బాగా ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరి.

సహజసిద్ధమైన క్లెన్సింగ్‌లా..

నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా నిమ్మకాయని రెండు ముక్కలుగా చేసి ఒక దాంతో ముఖం, మెడ మీద 5 నిమిషాల పాటు బాగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోలోతున ఉన్న మురికి కూడా తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ముఖం మీద వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చల సమస్యకు కూడా నిమ్మరసం చక్కని పరిష్కారం చూపుతుంది.

జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది..

ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్లకు మిగతా వారి కంటే చర్మ సంబంధిత సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే జిడ్డుదనం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకు నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుంది. చర్మంలో సహజంగా ఉత్పత్తయ్యే నూనె స్థాయులను క్రమబద్ధీకరించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో ముఖానికి రాసుకోవాలి.

ఇవి కూడా...

కొందరికి గోళ్లు పొడవుగా, అందంగా పెరుగుతాయి. మరికొందరికి కొంచెం పొడవు పెరిగిన వెంటనే విరిగిపోతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసం తీసుకుని దానిలో తగినన్ని నీళ్లు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాసేపు గోళ్లను ముంచి ఉంచడం వల్ల అవి దృఢంగా అవడమే కాకుండా తెల్లగా, ప్రకాశవంతంగా మెరుస్తాయి.

కొందరికి పళ్లు పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అవి తెల్లగా మారి ప్రకాశవంతంగా కనిపించాలంటే చిటికెడు ఉప్పు, బేకింగ్‌ సోడాలో నిమ్మచెక్కను ముంచి దాంతో పళ్ల మీద రుద్దాలి. ఇలా చేయడం వల్ల పళ్లు ముత్యాల్లా తెల్లగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అలాగే ఈ చిట్కా పాటించడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

నిమ్మచెక్కను తీసుకుని ట్యాన్‌ ఉన్న చోట రోజూ 5 నిమిషాల పాటు బాగా రుద్దండి. కొద్ది రోజుల్లో ట్యాన్‌ సులభంగా మాయమైపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్