బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఈ పొరపాట్లు వద్దు!

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఆవశ్యకమనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఏ ఆహారాన్నీ తీసుకోం. దీనివల్ల శరీరం శక్తిని కోల్పోతుంది.

Published : 06 Oct 2021 19:37 IST

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఆవశ్యకమనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఏ ఆహారాన్నీ తీసుకోం. దీనివల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. దీన్ని తిరిగి తెచ్చుకోవడానికి అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ సమయంలో మనం తీసుకొనే ఆహారంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా బరువు పెరుగుతామని చెబుతున్నారు నిపుణులు. మరి అల్పాహారం తీసుకొనే సమయంలో మనం చేస్తున్న ఆ పొరపాట్లేమిటో.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకుందామా..

ఎక్కువ చక్కెర వద్దు..!

ఉదయాన్నే అల్పాహారంలో చాలామంది పాలతో పాటుగా, ఓట్స్‌ను కలిపి తీసుకొంటారు. ఇది తినేటప్పుడు రుచిగా అనిపించడం కోసం కాస్త ఎక్కువగానే పంచదార వేసుకొంటూ ఉంటారు. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే పంచదార ఎంత ఎక్కువగా తింటే మనం తీసుకొన్న ఆహారం అంత త్వరగా జీర్ణమైపోతుంది. దీనివల్ల తక్కువ సమయంలోనే తిరిగి ఆకలి వేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా మళ్లీ ఏమైనా తినాలనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో అధికమొత్తంలో కొవ్వు పేరుకొనే అవకాశం ఉంటుంది.

తగినంత పీచు పదార్థం..!

అల్పాహారంలో పీచు పదార్థం తగినంత తీసుకోకపోవడం వల్ల కూడా మనం బరువు పెరగడానికి అవకాశాలున్నాయి. ఇది సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల తరచూ ఆకలి వేస్తున్న భావన కలుగుతుంది. పీచు పదార్థం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా మనం తీసుకొనే ఆహారం మోతాదు తగ్గుతుంది. అందుకే అల్పాహారంలో నానబెట్టిన సబ్జా గింజలు, అవిసె గింజలను భాగం చేసుకోవాలి.

కొవ్వు పదార్థాలు మితంగా..!

చాలామంది శరీరంలో కొవ్వు పెరుగుతుందనే ఉద్దేశంతో నూనెలు, బటర్ వంటి వాటికి దూరంగా ఉంటారు. అలాగే ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో వెన్న తొలగించిన పెరుగు, పాలను తీసుకొంటూ ఉంటారు. అయితే కొవ్వు పదార్థాలను ఆహారంగా తీసుకోవడం పూర్తిగా మానేస్తే తరచూ ఆకలి వేస్తున్న భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా కొవ్వులకు దూరంగా ఉండటం కాకుండా.. కొంత మొత్తంలోనైనా తీసుకోవడం మంచిది. దీనికోసం వెన్న తొలగించిన పెరుగుకి బదులుగా తక్కువ శాతం కొవ్వులున్న పెరుగును తీసుకోవాలి. లేదా కొన్ని డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా తక్కువ మొత్తంలో కొవ్వు శరీరానికి అందుతుంది.

పండుతో సరిపెట్టొద్దు..!

కొంతమంది ఉదయాన్నే అల్పాహారంగా ఓ యాపిలో.. అరటిపండో తినేసి వూరుకొంటారు. పైగా ఒక్క పండుతో సరిపెట్టుకొన్నాం కాబట్టి శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గిపోతాయని భావిస్తుంటారు. కానీ ఉదయం సరిపడినంత ఆహారం తీసుకోలేదు కాబట్టి మధ్యాహ్నం వేళలో అవసరమైన దానికంటే ఎక్కువగానే ఆహారం భుజిస్తారు. ఇలా చేయడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం మన పొట్టలో చేరుతుంది. ఫలితంగా కొవ్వు పెరిగిపోతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని ఒక్క పండుతో సరిపెట్టేయకుండా అవసరమైనంత మేరకు పోషకాలు అందేలా తీసుకోవడం మంచిది.

వేళ మించకుండా..!

కొంతమందికి బారెడు పొద్దెక్కితేనే గానీ తినే అలవాటు ఉండదు. పైగా దాన్ని ఓ గొప్ప విషయంగా భావిస్తుంటారు. మనం ఎంత ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని భావిస్తే ఆకలి అంత ఎక్కువగా వేస్తుంది. దీంతో మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఆహారమే తినేస్తాం. ఇది కూడా మనం బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే రోజూ నిద్ర లేవగానే కాసేపు వాకింగ్ చేయాలి. నడక పూర్తవగానే తినడం కాకుండా.. కాసేపు ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది.

 

ఈ అలవాట్లు మార్చుకోండి..!

* కొందరికి నిద్రలేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇలా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఏమీ తినకుండా కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.

* అల్పాహారం సమయంలో ఆరెంజ్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే అది ఎంతవరకు తాజాగా ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలామంది ప్యాకేజ్డ్ ఆరెంజ్ జ్యూస్‌ని తాగుతూ ఉంటారు. కానీ దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరగకపోగా చేటు జరిగే అవకాశాలున్నాయి. పైగా వీటిలో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాల్సిందే. తాజా కమలాఫలాలను రోజూ జ్యూస్‌లా తయారుచేసుకొని తాగాలి. లేదంటే.. పండునే తినడం మంచిది. దీనివల్ల వాటిలో ఉన్న పోషకాలతో పాటు పీచు పదార్థం సైతం లభిస్తుంది.

* ఇటీవలి కాలంలో అల్పాహారంలో స్మూతీస్‌ను తీసుకొనేవారి సంఖ్య పెరుగుతోంది. పండ్లరసంతో తయారయ్యే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయనే భావనే దీనికి కారణం. అయితే ఇవి మరింత రుచిగా రావాలనే ఉద్దేశంతో ఉపయోగించే స్వీట్‌నర్స్ కారణంగా కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వీటివల్ల శరీరంలో అధిక క్యాలరీలు వచ్చి చేరతాయి. అందుకే పండ్లను జ్యూస్‌లు, స్మూతీల మాదిరిగా తయారుచేసుకొని తీసుకోవడం కంటే.. నేరుగా తినడమే మంచిది.

* కొన్ని సందర్భాల్లో ఆఫీసుకి లేటవుతుందనో లేదా మరో చోటకు అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురైతేనో కొంతమంది బేకరీ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. డోనట్స్, కర్రీ పఫ్, ఎగ్ పఫ్ వంటివి తింటూ ఉంటారు. వీటిలో అధిక మొత్తంలో కొవ్వులు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో కొవ్వులతో పాటు అధిక క్యాలరీలు వచ్చి చేరతాయి. ఫలితంగా మనం వద్దన్నా బరువు పెరిగిపోతాం.

* కొందరు అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని ఏమీ తీసుకోరు. అయినా వారి బరువులో ఏ మాత్రం తగ్గుదల కనిపించదు. దీనికి కారణం తీసుకునే ఆహారాన్ని సరైన భాగాలుగా విభజించుకోకపోవడమే. ఇలాంటి వారు పోషకాహార నిపుణులను సంప్రదించి డైట్‌చార్ట్ ఫాలో అవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్