12 ఏళ్లకే ‘టోఫెల్’ కొట్టేసింది!

‘టోఫెల్ (TOEFL)...టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌’...ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించే ఈ అంతర్జాతీయ పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే అంత సులభమేమీ కాదు. అలాంటిది 12 ఏళ్ల వయసులోనే ఈ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది కశ్మీర్‌ లోయకు చెందిన జైనాబ్‌ మసూమా మీర్జా. యూనివర్సిటీ స్థాయి పరీక్షలో 120 పాయింట్లకు ఏకంగా 115 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Updated : 29 Jun 2021 20:39 IST

‘టోఫెల్ (TOEFL)...టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌’...ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించే ఈ అంతర్జాతీయ పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే అంత సులభమేమీ కాదు. అలాంటిది 12 ఏళ్ల వయసులోనే ఈ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది కశ్మీర్‌ లోయకు చెందిన జైనాబ్‌ మసూమా మీర్జా. యూనివర్సిటీ స్థాయి పరీక్షలో 120 పాయింట్లకు ఏకంగా 115 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కఠినమైన పరీక్షలో!

ఇంగ్లిష్ సామర్థ్యానికి పదును పెట్టే ఈ టోఫెల్‌ స్కోరును ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని సుమారు 11 వేల యూనివర్సిటీలు ప్రామాణికంగా తీసుకుంటాయి. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, జాన్‌ హాప్కిన్స్, ఎం.ఐ.టి., ప్రిన్స్ టన్.. తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు కూడా ఈ స్కోరునే ఆధారంగా చేసుకుని డిగ్రీ, పీజీ ప్రవేశాలు కల్పిస్తాయి. మొత్తం 120 పాయింట్లకు నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 100 పాయింట్లు సాధించాలి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సీటు కావాలంటే మాత్రం 110 పాయింట్లు తెచ్చుకోవాల్సిందే. కానీ ఎంతో కఠినమైన ప్రశ్నలతో కూడి ఉండే ఈ పరీక్షలో అర్హత స్కోరు సాధించాలంటే అంత సులభమైన విషయం కాదు.

సాధారణంగా టోఫెల్‌ పరీక్షను నాలుగు స్థాయుల్లో నిర్వహిస్తారు.

ప్రాథమిక స్థాయి: 8 ఏళ్ల వయసు.. అంతకంటే పైబడిన వారికి.

టోఫెల్‌ జూనియర్: 11 ఏళ్లు పైబడిన వారి కోసం.

టోఫెల్‌ ఐటీపీ: 16 ఏళ్లు పైబడిన వారికి.

టోఫెల్‌ ఐబీటీ: డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష

120 పాయింట్లకు 115!

ఈ క్రమంలో టోఫెల్‌ యూనివర్సిటీ స్థాయి పరీక్షలో ఎంతో అలవోకగా ఉత్తీర్ణత సాధించింది శ్రీనగర్‌లోని షాలిమార్‌కు చెందిన 12 ఏళ్ల జైనాబ్‌. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ బాలిక 120 పాయింట్లకు గాను 115 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రోజుకు 12 గంటలు బుక్స్‌ ముందే!

అర్హత పాయింట్లకు మించి టోఫెల్‌ స్కోరు సాధించింది జైనాబ్‌. దీంతో ఆమె తల్లిదండ్రులు తెగ సంబరపడిపోతున్నారు. ‘కొవిడ్‌ కారణంగా స్కూళ్లన్నీ మూతపడడంతో ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది జైనాబ్‌. ఈ సమయంలోనే టోఫెల్‌ పరీక్షకు కూడా సన్నద్ధం కావాలని మేం తనను కోరాం. పరీక్షకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను తన ముందు ఉంచాం. అదేవిధంగా పరీక్షకు సంబంధించి సలహాలు, సూచనలతో పాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాం. ఈ క్రమంలో ఆన్‌లైన్ క్లాసులతో పాటు టోఫెల్‌ పరీక్షల కోసం రోజులో మొత్తం 12 గంటల పాటు పుస్తకాల ముందే గడిపింది జైనాబ్‌. ప్రిపరేషన్‌లో భాగంగా మొత్తం 200 ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాసి ఎప్పటికప్పుడు తన నైపుణ్యాన్ని పరీక్షించుకుంది. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. యూనివర్సిటీ లెవెల్‌ పరీక్షలో ఉత్తీర్ణత కావడంతో మాకెంతో సంతోషంగా ఉంది. జైనాబ్‌ లాంటి ప్రతిభావంతులైన పిల్లలు కశ్మీర్‌ లోయలో చాలామందే ఉన్నారు. వారికి సరైన శిక్షణతో పాటు మార్గదర్శకత్వం అందిస్తే వారెన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అందుకు నా కూతురే నిదర్శనం. ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరముంది’ అని చెబుతున్నారు జైనాబ్‌ పేరెంట్స్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్