అప్పట్నుంచి ఆయన నాతో మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నా పెళ్లై సంవత్సరమైంది. మూడు నెలల క్రితం ఒక విషయంలో నేను, నా భర్త బాగా గొడవపడ్డాం. ఆ సమయంలో తనని అనకూడని మాటలు అన్నాను. ఆవేశంలో నాకే తెలియకుండా మాట్లాడాను. అప్పట్నుంచి ఆయన నాతో మాట్లాడడం...

Published : 24 Apr 2023 12:47 IST

నా పెళ్లై సంవత్సరమైంది. మూడు నెలల క్రితం ఒక విషయంలో నేను, నా భర్త బాగా గొడవపడ్డాం. ఆ సమయంలో తనని అనకూడని మాటలు అన్నాను. ఆవేశంలో నాకే తెలియకుండా మాట్లాడాను. అప్పట్నుంచి ఆయన నాతో మాట్లాడడం మానేశారు. నేను సారీ చెప్పి.. ఇంకెప్పుడూ అలా జరగదని చెప్పాను. కానీ, నా భర్తలో ఎలాంటి మార్పు లేదు. ఇంట్లో కావాల్సినవన్నీ తెస్తున్నారు. కానీ, ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఉన్నట్టుగా గుర్తించడం లేదు. దయచేసి నా భర్త కోపం పోయే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయగలరు. - ఓ సోదరి

జ. చాలామంది యువ జంటల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా మీరు అన్న మాటల కంటే మీ ప్రవర్తన అతని మనసుని గాయపరిచి ఉండచ్చు. అందుకే మీతో మాట్లాడకుండా ఉండచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అవతలి వారిలో మార్పు రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు మీరు మళ్లీ గొడవపడకుండా ఓర్పుగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మీరు మారానన్న నమ్మకాన్ని అతనికి కలిగించండి. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వంటకాలను చేయడం, అతని తరఫువారితో ఎక్కువగా మాట్లాడడం, తనకు నచ్చిన పనులు చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే కోపం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంటి వాతావరణం ఆహ్లాద భరితంగా ఉండేలా చూసుకోండి.

ఈ రోజుల్లో చాలామంది ఒక్క సారీ చెప్పగానే తమ మాటల వల్ల ఎదుటివారి మనసుకి అయ్యే గాయం మానిపోతుందని అనుకుంటున్నారు. ‘క్షమించు’ అన్నంత మాత్రాన ఆ గాయం వెంటనే మానిపోదు. అయితే ముందుగా మీ తప్పుని తెలుసుకోవడం మంచి పరిణామం. లేదంటే ఇద్దరూ పంతాలకు పోతే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సాధ్యమైనంత వరకు వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండండి. సానుకూలంగా ఉండడానికి ప్రయత్నించండి. మరోసారి మీ భర్తతో మనసు విప్పి మాట్లాడండి. ‘ఎక్కువ రోజులు ఇలా ఉండడం మంచిది కాదు.. ఇలా మళ్లీ జరగదు’ అన్న విషయాన్ని తెలియజేయండి. సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోండి. దాంతో అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని