50 ఏళ్ల యూనివర్సిటీకి తొలి మహిళా వీసీ!

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీ.  50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీకి పలువురు ఉపకులపతులుగా వ్యవహరించారు. కానీ, వీరిలో ఒక్క మహిళ కూడా లేదు. తాజాగా దానిని చెరిపివేస్తూ తెలుగు నేపథ్యం కలిగిన శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ (59)

Updated : 07 Feb 2022 20:25 IST

(Photo: JNU Website)

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీ. 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీకి పలువురు ఉపకులపతులుగా వ్యవహరించారు. కానీ, వీరిలో ఒక్క మహిళ కూడా లేదు. తాజాగా దానిని చెరిపివేస్తూ తెలుగు నేపథ్యం కలిగిన శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ (59) ఈ యూనివర్సిటీకి మొదటి మహిళా ఉపకులపతిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం...

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఉపకులపతిగా ఉన్న జగదీశ్‌ కుమార్ ఇటీవలే యూజీసీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దాంతో కేంద్ర విద్యాశాఖ శాంతిశ్రీని ఈ పదవికి నామినేట్‌ చేసింది. యూనివర్సిటీ విజిటర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దానికి ఆమోద ముద్ర వేశారు. తద్వారా యూనివర్సిటీ మొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ఎంపికయ్యారు. ఆమె ఈ పదవిలో ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

‘సరస్వతీ’ కుటుంబం..!

శాంతిశ్రీ జులై 15, 1962లో రష్యాలో జన్మించారు. ఆమె తండ్రి డా|| ధూళిపూడి ఆంజనేయులు జర్నలిస్ట్‌గా, రచయితగా సేవలందించడమే కాకుండా సివిల్ సర్వెంట్‌గా రిటైర్‌ అయ్యారు. ఆమె తల్లి ఆదిలక్ష్మి తెలుగు, తమిళ ప్రొఫెసర్‌గా సేవలందించారు. పలు దేశాల్లో డిగ్రీలు సంపాదించిన శాంతిశ్రీ బహుభాషా కోవిదురాలు. ఆమెకు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుంది. అంతేకాకుండా కన్నడం, మలయాళం, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు.

చదువుల రాణి..

* శాంతిశ్రీ 1983లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి బి.ఏ. (చరిత్ర, సోషల్‌ సైకాలజీ) విభాగంలో తొలి డిగ్రీ సంపాదించారు. 1985లో అదే కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ఎం.ఏ. పూర్తి చేశారు.

* ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉపకులపతిగా ఎంపికైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఆమె పూర్వ విద్యార్థి. 1990లో శాంతిశ్రీ ఆ యూనివర్సిటీలో ఎంఫిల్‌తో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ క్రమంలో ‘నెహ్రూ సమయంలో భారతదేశంలోని పార్లమెంట్, విదేశాంగ విధానం’పై థీసిస్ రాశారు.

* 1996లో స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీ నుంచి శాంతి, సంఘర్షణలో పోస్ట్ డాక్టొరల్ డిప్లొమా, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా విభాగంలో డిప్లొమా చేశారు.

టీచింగ్‌లో...

శాంతిశ్రీ టీచింగ్‌ కెరీర్‌ 1988లో గోవా యూనివర్సిటీ నుంచి మొదలైంది. ఆ తర్వాత 1992లో పుణే యూనివర్సిటీకి వచ్చారు. మీడియా పరిశోధన, రాజకీయాలు, కమ్యూనికేషన్ మొదలైన అంశాలను బోధించారు. యూనివర్సిటీల్లోని వివిధ పాలన విభాగాలను కూడా నిర్వహించారు. వీటితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌లో సభ్యురాలిగా, పలు కేంద్రీయ యూనివర్సిటీలకు విజిటర్స్ నామినీగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం సావిత్రిభాయ్‌ ఫూలే పుణె యూనివర్సిటీకి ఉపకులపతిగా వ్యవహరిస్తున్న ఆమె.. పీహెచ్‌డీ విద్యార్థులకు అంతర్జాతీయ వ్యవహారాలు, విదేశీ విధానం, ప్రపంచ రాజకీయాలు, గ్లోబలైజేషన్‌, మానవ హక్కులు, ఎకనమిక్స్‌ వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఈ క్రమంలో 29 మంది పీహెచ్‌డీలకు ఆమె మార్గనిర్దేశం చేశారు. దాదాపు 33 సంవత్సరాల పాటు టీచింగ్‌లో ఉన్న శాంతిశ్రీ భారత్‌తో పాటు శ్రీలంక, సింగపూర్‌లలో కూడా తన సేవలందించారు. అలాగే ఆమె రాసిన మూడు పుస్తకాలతో పాటు 170కి పైగా రాసిన పరిశోధనా పత్రాలు పలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ఆమె బంగారు పతకాలతో పాటు పలు అవార్డులు, ఘనతలను సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్