ఈ పండ్లతో ఉత్సాహంగా.. ఆరోగ్యంగా..!

సాధారణంగా వానాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎప్పుడో ఒకసారి అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో- వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ఎంత ముఖ్యమో....

Published : 24 Jul 2023 13:25 IST

సాధారణంగా వానాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఎప్పుడో ఒకసారి అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో- వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ఎంత ముఖ్యమో, రోగనిరోధక శక్తిని పెంచుకోవడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రకృతి మనకు ఈ కాలంలో రోగ నిరోధకశక్తిని పెంచి, వివిధ రకాల వ్యాధులను తగ్గించే పండ్లను అందుబాటులో ఉంచింది. ఈ కాలంలో లభించే తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండచ్చు. మరి అలాంటి కొన్ని పండ్లతో పాటు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం రండి..

దానిమ్మ

ఈ కాలంలో విరివిగా లభించే పండు దానిమ్మ. సీజన్ వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ఔషధ గుణాలు అంటువ్యాధులను తట్టుకునేలా శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. మెదడుకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో పాటు అతిసారం, గుండెజబ్బులు, రక్తహీనత, రక్తపోటు వంటి వ్యాధులను అరికడతాయి. గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే ఒక రోజుకు సరిపడా ఫోలిక్ ఆమ్లంలో 40 శాతం పొందినట్లే. ఇందులోని విటమిన్ ఎ, సి, ఇ వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా తయారవుతాయి. అయితే దానిమ్మ రసంలో చక్కెర వేయకుండా తాగితేనే అందులోని ఈ లాభాలన్నీ సంపూర్ణంగా పొందచ్చు.

పియర్

యాపిల్‌ని పోలి ఉండే పియర్ పండ్లు ఈమధ్య అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇవి వానాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను అధికమొత్తంలో అందజేస్తాయి. పెద్దపేగు క్యాన్సర్‌ను అరికట్టడంతో పాటు కీళ్లనొప్పులను తగ్గించడంలో ఈ పండు కీలకపాత్ర పోషిస్తుంది.

చెర్రీ

ఎర్రగా, ఎంతో అందంగా ఉండే చెర్రీ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, పొట్ట భాగంలోని కొవ్వు నుంచి విముక్తి పొందవచ్చు. నిద్రలేమితో బాధపడేవారు చెర్రీ పండ్లరసాన్ని తరచుగా తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో చెర్రీకి మించింది లేదు. ఇవి కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయంటున్నారు నిపుణులు.

యాపిల్

యాపిల్ పండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. యాపిల్ పండును నమలడం వల్ల నోట్లో విడుదలయ్యే లాలాజలం నోరు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు పేగుల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి, వూబకాయం సమస్యకు చెక్ పెడుతుంది. ఫలితంగా గుండెజబ్బులు కూడా దరిచేరవు. యాపిల్‌లోని పీచుపదార్థం కారణంగా మల, మూత్ర విసర్జనలో ఎదురయ్యే సమస్యలు కూడా త్వరగా నయమవుతాయి. ఓ అధ్యయనం ప్రకారం కాలేయం, క్లోమం, పేగు, రొమ్ము క్యాన్సర్లను కొంతవరకు నివారించే గుణం యాపిల్‌లో ఉందట. మలబద్ధకం, అతిసారం సమస్యతో ఇబ్బందిపడేవారు యాపిల్‌ను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందచ్చు. మొత్తానికి రోగనిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధులతో పోరాడే శక్తినిస్తుందీ అద్భుతమైన పండు. కేవలం వర్షాకాలంలోనే కాక అన్ని సీజన్లలోనూ యాపిల్ అందుబాటులో ఉంటోంది కాబట్టి సీజన్‌తో సంబంధం లేకుండా రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.

నేరేడు

ఏడాదిలో కనీసం ఒక్క నేరేడు పండైనా తినాలనేవారు మన పూర్వీకులు. ఎందుకంటే దీనివల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులోని విటమిన్ 'సి' చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎంతో సహకరిస్తుంది. అజీర్తి, అతిసారం సమస్యల నుంచి గట్టెక్కించే పండు నేరేడు. దీని రసం తాగడం వల్ల అల్సర్ దరిచేరదు. ఇది గర్భాశయ సమస్యలను తగ్గించడంలోనూ బాగా ఉపకరిస్తుంది. అయితే ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. దీనికి నేరేడు కూడా మినహాయింపు కాదు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే దగ్గు, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి. నేరేడును పరగడుపున తినడం మంచిది కాదు. అలాగే వీటిని తిన్న వెంటనే పాలు తాగకూడదని నిపుణుల సలహా. గర్భిణులు, బాలింతలు నేరేడుకు దూరంగా ఉండడం మంచిది.

అల్బకర..

వర్షాకాలంలో ఎక్కువగా లభించే అల్‌బకర పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈకాలంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే జలుబు సమస్యను తగ్గించి, రోగనిరోధకశక్తి మెరుగుపడేలా చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ 3 లేదా 4 అల్‌బకర పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. గుండెపోటు, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గించడంతో పాటు ఆస్తమా, జ్ఞాపకశక్తి తగ్గడం, అధిక బరువు వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే అల్‌బకరను మరీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

ఇవే కాదు.. జామ, సపోట, అరటి, బత్తాయి.. ఇలా అన్నీ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందజేసేవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని