ఖర్జూరంతో.. మాస్క్ వేస్తే!
పీచు, పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం ఆరోగ్య సంరక్షణలో సాయపడుతుందని తెలిసిందే. మరి దీనితో వేసే పూత చర్మాన్నీ సంరక్షిస్తుందని తెలుసా?
పీచు, పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం ఆరోగ్య సంరక్షణలో సాయపడుతుందని తెలిసిందే. మరి దీనితో వేసే పూత చర్మాన్నీ సంరక్షిస్తుందని తెలుసా?
మూడు చొప్పున ఎండు ఖర్జూరాలు, బాదం పప్పులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. బాదం పప్పుల తొక్కలు ఒలవాలి. అలాగే ఖర్జూరం లోపలి గింజలను తీసి, గుజ్జు పక్కన పెట్టుకోవాలి. వీటికి రెండు చెంచాల కలబంద గుజ్జు, చెంచా చొప్పున తేనె, పచ్చిపాలు కలిపి మిక్సీలో మెత్తని మిశ్రమంలా చేయాలి. ఇందులో రెండు ఇ విటమిన్ క్యాప్సుల్స్ నూనె వేసి బాగా కలపాలి. శుభ్రం చేసుకున్న ముఖానికి ఈ లేపనాన్ని పట్టించి పావుగంట ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే చాలు. ముఖచర్మం పొడారకుండా మృదువుగా, మారుతుంది. ఈ మిశ్రమాన్ని పొడి గాజుసీసాలో నింపి ఫ్రిజ్లో ఉంచితే నెలరోజుల వరకూ భద్రపరుచుకోవచ్చు. ఈ లేపనం వేసుకున్న ఎనిమిది గంటల వరకు సబ్బు, సున్నిపిండి వంటివి ముఖానికి వినియోగించకుండా ఉంటే మంచిది.
నిమ్మరసంతో..
నాలుగు ఎండు ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టాలి. వాటిల్లోని గింజలను తీసేసి, గుజ్జును పక్కన ఉంచాలి. నానిన ఖర్జూరాకు తగినన్ని పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమానికి చెంచా చొప్పున మీగడ, నిమ్మరసం కలిపి ముఖానికి లేపనంలా రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగితే సరి. ముఖానికి మృదుత్వం, మెరుపు వస్తాయి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే, ముఖచర్మం పొడారే సమస్య దూరమవుతుంది. మొటిమల వల్ల వచ్చే మొండి మచ్చలు కూడా దూరమవుతాయి. సూర్యకిరణాల ప్రభావంతో కందిన చర్మాన్ని ఇది పూర్వపుస్థితికి తీసుకురాగలదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.