Published : 20/07/2022 01:27 IST

మనసు కోసం ఓ రోజు!

పని నుంచి సెలవు తీసుకోవాలంటే మనకు ఆరోగ్యం పాడవ్వాల్సిందే! చిన్నా చితకా అయితే అదీ తీసుకోం. నిద్రలేమి, కాలంతో పరుగులు.. దీనికి తోడు హార్మోన్లలో మార్పులు. వీటన్నింటి ప్రభావం పడేది మానసిక ఆరోగ్యంపైనే! తప్పించుకోవాలంటే మనసు కోసం ఓరోజు కేటాయించమంటున్నారు నిపుణులు.

ని హడావుడిలో చిరాకు పడటం మామూలే. ఇంట్లో పెద్దవాళ్లు, భర్త కోపగించుకుంటే బాధ పడటం, కన్నీరు కార్చేయడం.. చిన్న విషయాలకీ విపరీతమైన కోపం, అరిచేయడం, పిల్లల మీద చేయి చేసుకోవడం.. తర్వాత నెమ్మదిగా అరె ఇంత చిన్నదానికే చేయి చేసుకున్నామా అని బాధపడ్డం. ఇవి చాలా మందికి ఎదురయ్యే అనుభవాలే. చిన్నగా కనిపించేవే కానీ.. తనకు విశ్రాంతి కావాలని మనసు ఇచ్చే సంకేతాలే ఇవి. ఒక్కోసారి మానసికంగా, శారీరకంగానూ అలసిపోయిన భావన. అందుకే వారంలో కొంత సమయం, నెలలో పూర్తిగా ఒకరోజు మీకు కేటాయించుకోవాలి. ఆ సమయంలో..

* మీ సృజనాత్మకతకు పని చెప్పేయండి. మీకంటూ ప్రత్యేకంగా ఏ కళా రాదంటారా? ఏదో ఒకటి కొత్తది ప్రయత్నించేయండి. కొత్త ఉత్సాహం రావడమే కాదు.. ఒత్తిడీ, మానసిక ఆందోళనలు తుర్రుమంటాయి.

* కొంతసేపు వ్యాయామానికి కేటాయించండి. ఇది మనసుపై చూపే ప్రభావమెంతో! డిప్రెషన్‌ లాంటి తీవ్ర సమస్యకీ ఇది మంచి మందంటున్నారు నిపుణులు. కష్టమైనవే చేయాలేమోనని భయపడొద్దు. నిర్ణీత సమయం పెట్టుకొని నడక, పరుగు.. ఇలా తోచింది చేస్తే సరి.

* పెళ్లయ్యాక భర్త, తర్వాత పిల్లలు.. ఎక్కడికి వెళ్లినా వీళ్లు మన పక్కనుండటం మామూలే కదా! ఒకసారి ఒంటరిగా వెళ్లండి. విండో షాపింగ్‌ చేయండి. లేదూ ఏదైనా గుడికి వెళ్లి కూర్చోండి. ఒంటరిగా నచ్చిన సినిమా చూడండి. కొత్త ప్రదేశాన్ని చూసేయండి. కొత్త ఉత్సాహం రావడమే కాదు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

* ధ్యానం, యోగాలనీ ప్రయత్నించండి. ఇంట్లో కాక బయటి ప్రదేశాల్లో చేయండి. మీ మనసుపై ప్రభావం చూపుతున్న అంశాలను పరిశీలించుకొని వీలైతే వాటిని మార్చే ప్రయత్నం చేయండి. పని పెరిగిందా తగ్గించుకోండి.. పిల్లలు అని సరిపుచ్చుకోక వారికీ కొన్ని పనులు కేటాయించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవారు పక్కనే ఉన్నారా? వారికి వీలైనంత దూరంగా ఉండండి. ఏమాత్రం అలసటగా అనిపించినా పనులకు సెలవు పెట్టేయండి. మిమ్మల్ని మీరు రీఛార్జ్‌ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఏం చేసినా... కొనసాగింపు మాత్రం తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని