మానసిక దృఢత్వానికి మంచి ఆహారం..
భర్త, పిల్లలు తిని, బాక్సులు పట్టుకుని వెళ్లాక మిగిలిందేదో తిని, పనిలో మునిగిపోతుంది మాధవి. తరచూ తనకు కలిగే మానసిక ఒత్తిడికి కారణం తెలియక కంగారు పడుతుంటుంది.
భర్త, పిల్లలు తిని, బాక్సులు పట్టుకుని వెళ్లాక మిగిలిందేదో తిని, పనిలో మునిగిపోతుంది మాధవి. తరచూ తనకు కలిగే మానసిక ఒత్తిడికి కారణం తెలియక కంగారు పడుతుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.
ఆహారం శారీరకారోగ్యాన్నే కాదు, మానసికారోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. పోషక విలువల్లేని ఆహారం మెదడు ఆరోగ్యానికి తోడ్పడదు. పౌష్టికాహారాన్ని తీసుకొన్నప్పుడు శరీరంలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తికి ఇది సాయపడి మెదడు చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా పని చేయడానికి కారణమవుతుంది. చక్కెర, కాఫీ, వేపుళ్లు, జంక్ఫుడ్, శీతలపానీయాలు, చిప్స్ వంటివి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తికి తోడ్పడవు. శక్తి స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి ఆందోళన, ఒత్తిడికి కారణమవుతాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.
పోషక విలువలతో...
రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకొనే అలవాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉడికించిన కూరగాయలు, పొట్టు ఎక్కువ తియ్యని బియ్యం, చిరుధాన్యాలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, ప్రొబయోటిక్స్ ఉండే పెరుగు మీ ఆహారంలో తప్పక ఉండేలా జాగ్రత్త పడాలి. రోజుకి నాలుగైదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, చేప, గుడ్లు, గింజధాన్యాలు తప్పనిసరి. వ్యాయామాలు, యోగా, ధ్యానానికి కచ్చితంగా సమయాన్ని కేటాయించుకోవాలి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేలా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా జాగ్రత్తపడితే చాలు.
మెదడుకు ఆహారం..
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రౌన్రైస్, పిండి పదార్థాలుండే కూరగాయలు, చిలగడ దుంపల్లో పోషక విలువలెక్కువగా ఉండి, తక్షణ శక్తినిస్తాయి. చికెన్, మాంసాహారం, చేప, గుడ్లు, చిక్కుడు, గింజలు, విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలోని ఫాటీయాసిడ్స్ మెదడు, నరాల వ్యవస్థ పనితీరును మెరుగ్గా ఉంచి, ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. టీవీ ముందు కూర్చునో, మొబైల్ చూసుకుంటూనో, మాట్లాడుతూ లేదా హడావుడిగా ఏదో ఒకటిలే అన్నట్టుగా కాకుండా, ప్రశాంతంగా, తృప్తిగా భోజనం చేస్తే, సంపూర్ణారోగ్యాన్ని పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.