Published : 09/03/2023 01:13 IST

అసలే.. పరీక్షల సమయం!

పిల్లలకు పరీక్షలు. చదివినవన్నీ జ్ఞాపకం ఉండాలిలి.. చదవడానికి ఓపిక ఉండాలంటే పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలంటున్నారు నిపుణులు.

పరీక్షలప్పుడు పిల్లల్లో సాధారణంగానే ఆందోళన, ఒత్తిడి మొదలవుతుంది. ఇవి కూడా శరీరంలోని శక్తిని హరిస్తాయి. నిస్సత్తువగా మారుస్తాయి. ఆరోగ్యంతోపాటు జీవక్రియలు సమన్వయం చేయగల శక్తి పిల్లలకు ఉండాలంటే పోషక విలువలున్న బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారానే వీలవుతుంది. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా మంచినీళ్లను తాగించాలి. శారీరకంతోపాటు శ్వాస సంబంధిత వ్యాయామాలను చేయిస్తే తగినంత ఆక్సిజన్‌ అంది, శరీరం శక్తిమంతమవుతుంది.

సమన్వయంగా..

కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లుసహా పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, పండ్లు వంటివి రోజువారీ ఆహారంలో ఉండాలి. కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే నిద్ర వస్తుందని కొందరు భావిస్తారు. కానీ వీటిలో పీచు, చక్కెర స్థాయులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచడమే కాకుండా శరీరాన్ని శక్తిమంతంగా మారుస్తాయి. అన్నం, గోధుమ, బీన్స్‌, అరటిపండ్లు వంటివి జీర్ణమవడానికి కొంత సమయం పడుతుంది. దీంతో కాస్తంత మందంగా అనిపించే అవకాశం మాత్రమే ఉంటుంది. అయితే వీటిని పిల్లలకు అందించడం తప్పనిసరి. అలాగే పండ్లు, పాల ఉత్పత్తుల్లోని కార్బొహైడ్రేట్లు, కాల్షియం వంటివి పిల్లలను ఒత్తిడికి దూరంగా ఉంచుతాయి. పండ్లతో చేసే స్మూతీలు రుచికరంగానూ ఉంటాయి. చదువుపై ఏకాగ్రతను పెంచుతాయి.

అసమానతగా..

మూడుపూట్ల కడుపునిండా తినిపించాలి అనుకోవద్దు. కాస్త వెలితిగానే పెట్టండి. అయితే అన్నిరకాల ప్రయోజనాలూ అందేలా చూడాలి. ఉదయం ఇడ్లీ, దోశ, ఉడికించిన గుడ్లు, పండ్లు, టోస్ట్‌, కూరగాయల ముక్కలు, మొలకలు ఉంచిన శాండ్‌విచ్‌ వంటివి కడుపు నిండేలా ఇవ్వాలి. మధ్యాహ్నభోజనం తేలికగా అరిగేలా ఉండాలి. ఇందులో తక్కువ మోతాదులో గింజధాన్యాలు, విత్తనాలు వంటివి మంచిది. ఇవి విటమిన్‌ ఈ, అసంతృప్త కొవ్వులు, ప్రొటీన్లను పుష్కలంగా శరీరానికి అందిస్తాయి. కార్బొహైడ్రేట్లను సమన్వయం చేస్తాయి. ఈ పోషకాలన్నీ మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. సాయంకాలం స్నాక్స్‌గా చేప లేదా చికెన్‌ను నూనెతోకాకుండా ఎయిర్‌ఫ్రై చేసి ఇస్తే మంచిది. అలాగే డిన్నర్‌ తక్కువగా తేలికగా జీర్ణమయ్యేలా క్రీంలేని వెజిటబుల్‌ లేదా ప్రొటీన్లుండేలా సూప్స్‌ ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని