గణేశుని కథ... ఓ పాఠం!

పాలవెల్లి కట్టి... పందిరి వేసి... ఉండ్రాళ్లయ్యని ఊరేగించే ఈ పండగలో సరదా అంతా చిన్నారులదే! కేవలం సరదాలకే ఈ పండగని పరిమితం చేయొద్దు... పార్వతీ తనయునిలోని ప్రత్యేక గుణగణాల గురించి మీ చిన్నారికీ చెప్పి వాళ్లని చక్కని పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించండి.. 

Published : 10 Sep 2021 01:46 IST

పాలవెల్లి కట్టి... పందిరి వేసి... ఉండ్రాళ్లయ్యని ఊరేగించే ఈ పండగలో సరదా అంతా చిన్నారులదే! కేవలం సరదాలకే ఈ పండగని పరిమితం చేయొద్దు... పార్వతీ తనయునిలోని ప్రత్యేక గుణగణాల గురించి మీ చిన్నారికీ చెప్పి వాళ్లని చక్కని పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించండి..  గణేశునిలోని ఆ ప్రత్యేకమైన గుణాలేంటో ముందుగా మీరూ చదివేయండి....

కుతూహలం ఉండాల్సిందే: ఏ విద్యార్థైనా సరే కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. కుతూహలాన్ని ప్రదర్శించాలి. లేకపోతే... వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండదు కదా! అదే నిరూపిస్తుంది గణేశుని జీవితంలోని ఈ ఘటన. వర్షాల్లేక విపరీతమైన కరవుకాటకాలతో తల్లడిల్లుతున్న నేలని తడపడానికని అగస్త్య మహాముని శివుని దగ్గరున్న గంగాజలాన్ని తీసుకుని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడు. విశ్రాంతి తీసుకుందామని ఓ చోట నడుంవాల్చాడు. ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామనుకున్న గణేశుడు కుతూహలం కొద్దీ కాకి రూపంలోకి మారి దానిపై వాలాడు. ఆ బరువుకి కమండలంలోని నీళ్లు ఒలికి... కావేరీ నదిగా మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. గణేశునిలోని ఆసక్తీ, కుతూహలమే కదా ఇందుకు కారణం.

అనుకున్నది అయ్యేవరకూ: వేగంగా రాయడం వినాయకుని ప్రత్యేకత. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే... ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసునికి మాటిచ్చాడు లంబోదరుడు. కానీ మధ్యలో అతని కలం మొరాయించింది. ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తిచేశాడు. చేపట్టిన పనిని పూర్తిచేయడానికి త్యాగం, సాహసం అవసరమని ఈ కథ చెబుతోంది.

నిండుకుండ నిబ్బరంగా: మహా ధనవంతుడైన కుబేరుడు శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని, సంపదలని చూపించి మురిసిపోవాలని అనుకున్నాడు. అందుకు తన ఇంటికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలుపడదని, కొడుకు గణేశుణ్ని పంపాడు. గణేశుడికి కుబేరుడి అంతరంగం అర్థమైంది. అయినా వినయంగానే ఉన్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే... పెట్టినవి పెట్టినట్టు తినేశాడు లంబోదరుడు. కుబేరుని దగ్గర ఇక ఏమీ మిగల్లేదట. అప్పుడతనికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకూడనేది ఇక్కడ గణపయ్య నేర్పే పాఠం.

స్మార్ట్‌గా సాధించుకోవాలి: గణేశునికీ, సోదరుడు కుమారస్వామికీ ఒక పోటీ పెట్టారు తల్లిదండ్రులు. భూమండలాన్ని మూడుసార్లు వేగంగా చుట్టి వచ్చిన వారికి మహిమాన్విత ఫలం బహుమతి. కార్తికేయునితో పోలిస్తే గణేశుడి వనరులు అంతంత మాత్రమే. పైగా భారీకాయం. అప్పుడు నిరాశపడకుండా తెలివిగా ఆలోచించాడు. అమ్మానాన్నల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి, ‘మీరే నా ప్రపంచం.. ఇక నా ప్రపంచ ప్రదక్షిణ పూర్తయినట్టేగా’ అన్నాడు తెలివిగా. ప్రతికూల పరిస్థితుల్లో కంగారు పడిపోకుండా...వాటిని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చెప్పే కథ ఇది. ఇవన్నీ పిల్లలకు నేర్పండి. వాళ్లని విజయులుగా నిలపండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్