షుగర్‌ 200 ఉంది..

బరువు ఎక్కువగా ఉన్నారు. తగ్గాలి. శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామాలు, వాకింగ్‌, జాగింగ్‌ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఏ సమయానికి ఎంత పరిమాణంలో తింటున్నారు అన్నది గమనించాలి. ఎందుకంటే డయాబెటిస్‌కి మందులు వాడుతుంటే వాటి పనితీరు..

Updated : 31 Aug 2023 12:37 IST

మావారికి మధుమేహం వచ్చింది. ఫాస్టింగ్‌ షుగర్‌ 200 ఉంది. ఎత్తు 5.10, బరువు 100 కేజీలు. తనకి ఏయే సమయాల్లో ఎలాంటి ఆహారం ఇవ్వాలి?

-అను, హైదరాబాద్‌

రువు ఎక్కువగా ఉన్నారు. తగ్గాలి. శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామాలు, వాకింగ్‌, జాగింగ్‌ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఏ సమయానికి ఎంత పరిమాణంలో తింటున్నారు అన్నది గమనించాలి. ఎందుకంటే డయాబెటిస్‌కి మందులు వాడుతుంటే వాటి పనితీరు.. తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. సమయానికి తినకపోయినా, తగిన మోతాదు కాకపోయినా రక్తంలో చక్కెరశాతంలో హెచ్చుతగ్గులు, తలనొప్పి రావడం, శరీరం బలహీన పడటం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకూ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండే వాటిని తినకూడదు. ఉదయం టిఫిన్‌లో పెసరట్టు, గోధుమరవ్వ ఉప్మా లాంటివి పెట్టొచ్చు. సన్నబియ్యం, ఎక్కువ సేపు నానబెట్టి, రుబ్బి చేసే దోసె, ఇడ్లీకి దూరంగా ఉండాలి. వాటికి బదులుగా జొన్నలు, అరికెలు, మినుములు, కొర్రలతో చేసిన దోసెలు, ఇడ్లీలు తినొచ్చు. మధ్యాహ్నం దంపుడు బియ్యం తింటే మంచిది. సన్నబియ్యం తినాలనుకున్నా అన్నం తక్కువగా, కూరలు ఎక్కువగా తినాలి. ఉదాహరణకు 80 గ్రా. రైస్‌, 100 నుంచి 150 గ్రా. కూర, 50 గ్రా. పెరుగు లేదా 20 నుంచి 30 గ్రా. పప్పు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక పండ్ల విషయానికొస్తే పుచ్చ, జామ, చెర్రీస్‌, దానిమ్మ, బత్తాయి ఇవ్వొచ్చు. వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే కూరలకు దూరంగా ఉండాలి. స్వీట్లు, బిస్కెట్లు, ప్రోసెస్‌ చేసిన పండ్లరసాలు, శీతలపానీయాలు తాగకూడదు. సాయంత్రం 50గ్రా పండ్లను చిరుతిళ్లుగా ఇవ్వండి. రాత్రి భోజనంలో పుల్కా, చపాతీ, కిచిడీ పెట్టొచ్చు. మధ్య మధ్యలో నట్స్‌, వాల్‌నట్స్‌, గ్రీన్‌టీ.. పాలు తాగే అలవాటు ఉంటే పంచదార లేకుండా తాగొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని