చిన్నచేపల గొప్పతనం చెప్పి.. ప్రపంచ అవార్డు గెల్చుకుంది

భారత సంతతికి చెందిన డాక్టర్‌ శకుంతల హార్క్‌ సింగ్‌ తిల్‌స్తాద్‌ను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ ఫుడ్‌ అవార్డు’ వరించింది. నోబెల్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ అని పిలిచే ఈ పురస్కారంతోపాటు కోటీ 85 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్నారీమె.

Updated : 04 Jul 2021 04:44 IST

భారత సంతతికి చెందిన డాక్టర్‌ శకుంతల హార్క్‌ సింగ్‌ తిల్‌స్తాద్‌ను ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ ఫుడ్‌ అవార్డు’ వరించింది. నోబెల్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ అని పిలిచే ఈ పురస్కారంతోపాటు కోటీ 85 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్నారీమె. ఈవిడ విశిష్టతలు ఏంటో చూడండి...

డెన్మార్క్‌కు చెందిన డాక్టర్‌ శకుంతల పుట్టింది ట్రినిడాడ్‌లో. భారతీయులైన ఈమె పూర్వీకులు కొన్నేళ్ల క్రితం అక్కడ స్థిర పడ్డారు. వాళ్లు వ్యవసాయ కూలీలుగా మన దేశం నుంచి అక్కడకు వెళ్లారు. ఆవిడ టొబాగో దీవిలో చదువుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించారు. జల వ్యవసాయ పద్ధతులను రూపొందించి పేద జాలర్లకు ఉపాధిని అందించారు. ఈమె పరిశోధనలు ఆసియా, ఆఫ్రికాకు చెందిన చాలా మంది పేదలకు జీవనోపాధి, మంచి ఆరోగ్యం అందేలా సాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈమె మలేషియాలోని సీజీఐఏఆర్‌ పరిశోధనా కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. 71 ఏళ్ల డాక్టర్‌ శకుంతల ఈ అవార్డు అందుకున్న తొలి భారత సంతతి మహిళ.

గర్వపడుతున్నా... ‘నోబెల్‌ గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌ అయిదు దశాబ్దాల క్రితం స్థాపించిన ‘ది వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ సంస్థ నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం  గర్వంగా ఉంది. నా పరిశోధనలన్నీ మహిళలు, చిన్నారులకు సంబంధించిన పోషకాహారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఉండేవి. మొట్టమొదట నా అధ్యయనమంతా పోషకాహార లోపం ఉన్న చిన్నారులపైనే. వీరికి తరచూ వచ్చే అతిసార వ్యాధిపై పనిచేసే ఓ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాలు చేసేదాన్ని. ఆ సమయంలో అక్కడ పునరావాస కేంద్రంలో ఉండే చిన్నారుల కోసం కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశా. అందులో పండించే కూరగాయలతోనే ఆ పిల్లలకు ఆహారాన్ని అందించే వాళ్లం. ఆ కేంద్రంలో ఏటా అయిదు నుంచి ఆరు వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో చేరే వారు. మేం పౌష్టికాహారం అందించడం మొదలుపెట్టిన తర్వాత ఆ సంఖ్య తగ్గింది. ఆ తర్వాత చేపలపై పరిశోధనలు చేశా. చెరువుల్లో ఉండే చేపలను కుండల్లో ఉంచి పరిశోధన చేసేదాన్ని. అలాగే పొలాల మధ్య ఉండే చెరువుల్లోనూ వాటిని వేసేదాన్ని. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది. చేపలు ఆరోగ్యంగా ఉండటమే కాదు, వాటి సంఖ్య రెట్టింపు అవడం గుర్తించా. వ్యవసాయం, జలచరాల పెంపకం కలిపి జల వ్యవసాయం చేస్తే చాలామందికి ఉపాధిని, ఆదాయాన్ని పెంచవచ్చనే ఆలోచన వచ్చింది. ఇండియా, బంగ్లాదేశ్‌, కంబోడియా, నేపాల్‌, బర్మా, జాంబియా, మలావి వంటి దేశాల్లో అతి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఆహారంలో తీసుకునేది ఈ చిన్న చేపలనే అని తెలుసుకున్నా. నా పరిశోధనను ఈ దిశగా మళ్లించా. దీంతో వ్యవసాయంలో భాగంగా వరి, బంగాళాదుంపలు, కూరగాయలు, పండ్లు వంటి పంటల పక్కన చెరువుల్లో ఈ చేపల పెంపకం చేపడితే అటు ఆదాయంతోపాటు ఆరోగ్యమూ పెంపొందించు కోవచ్చనే అంశాన్ని నిరూపించా’ అని వివరించారు శకుంతల.

అమెరికా ప్రభుత్వ ప్రశంసలు

‘డాక్టర్‌ శకుంతల పరిశోధనలు లక్షల కుటుంబాలకు మెరుగైన ఆదాయాన్ని అందించాయి. ఎందరో జీవితాల దిశను మార్చిన ఆమెకు ధన్యవాదాలు’ అంటూ అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్