ఓ చిన్న ఆలోచన.. 400 కోట్ల వ్యాపారం!

ఎంబీఏ తర్వాత కార్పొరేట్‌ ఉద్యోగం ఆమె ఆశయం. అనుకోని సంఘటనతో ఆ కలకు దూరమైంది. ఓ ఆలోచనను స్నేహితుడితో పంచుకోగా వ్యాపారమైంది. ముందుకు సాగే కొద్దీ ఇంకొన్ని ఆలోచనలు బిజినెస్‌ రూపం దాల్చాయి. పరిధి పెరిగే కొద్దీ కొత్త ప్రదేశంలోకి సంస్థ మారేది. ఓసారి దీన్నే వ్యాపారంగా ఎంచుకుంటే? అన్న ఆలోచనొచ్చింది. ఆచరణలో పెడితే.. వందల కోట్ల ఆదాయానిచ్చే సంస్థ అయ్యింది. ఆమే మేఘనా అగర్వాల్‌. ఈ యాదృచ్ఛిక వ్యాపారవేత్త ప్రయాణమిది!

Published : 19 Sep 2021 18:19 IST

ఎంబీఏ తర్వాత కార్పొరేట్‌ ఉద్యోగం ఆమె ఆశయం. అనుకోని సంఘటనతో ఆ కలకు దూరమైంది. ఓ ఆలోచనను స్నేహితుడితో పంచుకోగా వ్యాపారమైంది. ముందుకు సాగే కొద్దీ ఇంకొన్ని ఆలోచనలు బిజినెస్‌ రూపం దాల్చాయి. పరిధి పెరిగే కొద్దీ కొత్త ప్రదేశంలోకి సంస్థ మారేది. ఓసారి దీన్నే వ్యాపారంగా ఎంచుకుంటే? అన్న ఆలోచనొచ్చింది. ఆచరణలో పెడితే.. వందల కోట్ల ఆదాయానిచ్చే సంస్థ అయ్యింది. ఆమే మేఘనా అగర్వాల్‌. ఈ యాదృచ్ఛిక వ్యాపారవేత్త ప్రయాణమిది!

మేఘన ఎంఐటీ ఘజియాబాద్‌ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. ఈమెది రాజస్థాన్‌లోని చిన్న పల్లెటూరు. మల్టీనేషనల్‌ ఫైనాన్స్‌ సంస్థలో ట్రేడర్‌ కావాలన్నది ఆమె కల. సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఉద్యోగమూ చేసింది. యూఎస్‌ 9/11 ఉగ్రదాడి ప్రభావం ఈమె ఉద్యోగంపైనా పడింది. ఉద్యోగ వేటలో ఉండగా రిషి దాస్‌ పరిచయమయ్యాడు. ఉద్యోగాలను కల్పించే సంస్థ ఉంటే బాగుంటుందన్న ఆలోచనను పంచుకుంది. తనకీ అది నచ్చి ‘హైర్‌ప్రో’ పేరిట సంస్థను 2003లో బెంగళూరులో ప్రారంభించారు. 25 ఏళ్ల వయసులో మేఘన దీనికి కోఫౌండర్‌, సీఓఓ. నాలుగేళ్లలోనే టీఐ, గోల్డ్‌మాన్‌ శాక్స్‌, సిట్రిక్స్‌, జునిపర్‌ మొదలైన ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేశారు. తన ఆలోచనలు, అభిరుచులు కలిసిన రిషినే పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా కొంత విరామం తీసుకుంది.

ఈసారి మునుపటికి భిన్నంగా అల్ట్రా మినరల్స్‌ పేరిట మాన్యుఫాక్చరింగ్‌ సంస్థను 2009లో ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా దీని ప్లాంట్‌లను విస్తరించింది. వ్యాపారం పెరిగే  కొద్దీ ఆఫీసుకు ఎక్కువ స్థలం అవసరమైంది. ఏటా మారడమూ ఇబ్బందయ్యేది. ఒక్కసారే 50,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. కానీ అంతా అవసరంలేదు. అందుకే స్టార్టప్‌లకు కొంత సబ్‌ లీజ్‌కి ఇచ్చింది. సొంత వ్యాపారాల పరిధి పెరిగే కొద్దీ వేరే సంస్థలను ఖాళీ చేయించేది. ఇలా మేఘనకు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌పై అవగాహన ఏర్పడింది. దాన్నే వ్యాపారంగా మలచాలనుకుంది. ఫలితమే ‘ఇండీక్యూబ్‌’. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టార్టప్‌ల నుంచి పరిశ్రమల వరకు వర్క్‌ స్పేస్‌తోపాటు మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఫుడ్‌ సహా ఇతర సేవలనూ అందిస్తుంది. మొదట తమ సేవింగ్స్‌తోనే సంస్థను ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత ఈ వ్యాపారం నచ్చిన ఆశిష్‌ గుప్తా అనే వ్యక్తి రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఆరేళ్లలో బెంగళూరు, హైదరాబాద్‌ సహా ఆరు నగరాలకు సేవలను విస్తరించారు. 30,50,000 చదరపు అడుగుల స్థలంతో 50కి పైగా ప్రాపర్టీలు సొంతం చేసుకోగలిగారు. ప్రస్తుతం ఈ సంస్థ వార్షికాదాయం రూ.400 కోట్లకు పైమాటే. ఎకనామిక్స్‌ టైమ్స్‌ విడుదల చేసిన ‘త్వరగా ఎదుగుతున్న సంస్థ’ల జాబితాలో ఇండీక్యూబ్‌ది 20వ స్థానం. ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో 500 ‘హైగ్రోత్‌’ సంస్థల జాబితాలో 112వ ర్యాంకు. మింత్రా, ఫిలిప్స్‌, ఎలీ లిలీ, బైజూస్‌, వాల్‌మార్ట్‌, రెడ్‌బస్‌ వంటి ఎన్నో సంస్థలు ఈమె వినియోగదారులే.

‘ముగ్గురు అమ్మాయిలున్న ఇంట్లో నేనే పెద్ద. లింగభేదం మా ఇంట్లో ఉండేది కాదు. నాన్న వెన్నుతట్టి ప్రోత్సహించే వారు. అందుకే చేయలేనేమోనన్న సందేహం ఎరుగను నేను. సమయం మించితే ఏంచేసినా తిరిగి రాదన్నదాన్ని బాగా నమ్ముతా. కార్పొరేట్‌ సంస్థలో పని వాతావరణం ఎలా ఉండాలని ఆశించానో దాన్నే మా సంస్థల్లోనూ ఆచరిస్తా. ఇక్కడ బాస్‌, ఉద్యోగి భేదాలుండవు. ఆలోచనలు ఎవరైనా పంచుకోవచ్చు. కలిసి నేర్చుకోవడం, పని చేయడమే. లాక్‌డౌన్‌ ప్రభావం చూపిన రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఒకటి. ఎన్నో సంస్థలు ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఆఫీసులు ఖాళీ చేశాయి. అయితే మేమేమీ నిరుత్సాహపడలేదు. వేగంగా స్పందించి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసేవాళ్లకు స్మార్ట్‌ మీటింగ్‌ రూమ్స్‌, రిమోట్‌ వర్కింగ్‌ సొల్యూషన్స్‌ వంటి సదుపాయాలు కల్పించాం. దాంతో ఆ ప్రభావం మాపై పెద్దగా పడలేదు. సమయానికి అనుకూలంగా స్పందించడమే కదా వ్యాపారమంటే! నేను నేర్చుకున్న వాటిల్లో ఇది ప్రధాన పాఠ’ మంటోంది మేఘన.

విమెన్‌ ఆంత్రప్రెన్యూర్లకు ప్రాధాన్యమిస్తుందీమె. నిలదొక్కుకునేంత వరకూ వాళ్ల స్టార్టప్‌లకు డిస్కౌంట్లు, ఇతరత్రా సాయమందిస్తుంది. కొంచెం ప్రోత్సాహమిస్తే మహిళలూ అద్భుతాలు సృష్టిస్తారనేది ఆమె నమ్మకం. వ్యాపారానికే కాదు.. కుటుంబానికీ సమాన ప్రాధాన్యమిస్తుంది. పనివేళల తర్వాత పూర్తి సమయం పిల్లలకే కేటాయిస్తుంది. ఇప్పుడు వర్క్‌ స్పేస్‌లోకి బిగ్‌డేటా, ఐఓటీ వంటి అధునాతన  సాంకేతికతను ప్రవేశపెట్టడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ విస్తరణలో భాగంగా రూ.300 కోట్ల పెట్టుబడుల సాధన  తన లక్ష్యమని చెబుతోంది మేఘన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్