Bhavana Dhruv: ప్రధాని పలకరించారు!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ పలకరించారు.

Updated : 12 May 2021 07:09 IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ పలకరించారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సంభాషణలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రి మహిళా నర్సు భావనాధృవ్‌ తన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు... ఆవిడేం చెప్పారో చూడండి...
తేడాది నుంచి కొవిడ్‌ వార్డులో ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నా. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న బంధువులందరూ చాలా భయపడ్డారు. అలాగే ఈ ఏడాది కూడా కరోనా వార్డులో పనిచేసే అవకాశం దక్కింది. మా పాప ఓరోజు నన్ను ‘అమ్మా...కొవిడ్‌ డ్యూటీకి వెళుతున్నావా’ అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక మౌనం వహించాను. ప్రస్తుతం ‘కొవిడ్‌’ పేరు వింటేనే రోగులు భయాందోళనలకు గురవుతున్నారు. వీరి భయం మా ఇంట్లో వాళ్ల భయంకన్నా ఎక్కువగా ఉంది. వాళ్లకేమైందో వాళ్లకే తెలియడం లేదు. అలాగే మేం ఏం చేస్తున్నామో కూడా అవగాహన ఉండటం లేదు. అందుకే రోగులకు చికిత్సనందించడంతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే పీపీఈ కిట్స్‌ ధరించి రోజంతా పనిచేయడం చాలా కష్టం. అయినా తప్పదు. ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డుల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ నాతోపాటు పనిచేసే వారి గురించి ఏమీ తెలీదు. పని ప్రారంభించిన వెంటనే అందరం ఓ బృందంగా ఏర్పడి విధులు నిర్వహించడమే కాదు, కష్టసుఖాలనూ పంచుకుంటాం. రోగుల భయాలను పోగొట్టడానికీ ప్రయత్నిస్తున్నాం. కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలంటేనే కొందరికి భయం. జ్వరం, దగ్గు వంటివి ఉన్నా, చాలా మంది ఈ భయంతోనే రోగనిర్థరణ పరీక్షలు చేయించుకోవడం లేదు. దీంతో చికిత్స అందించడంలో ఆలస్యమవుతోంది. ఇది వారి ప్రాణానికే ముప్పుగా మారుతోంది. అప్పటికే వారి ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్‌ అవుతున్నాయి. దీంతో వెంటనే ఐసీయూకు తరలించాల్సి వస్తోంది. ఈ వ్యాధిపై అవగాహనలేమి ఎక్కువగా ఉంది. చిన్నారుల నుంచి వృద్ధులవరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొవిడ్‌కు గురవుతున్నారు. అనారోగ్యంగా అనిపించిన వెంటనే ఆసుపత్రికి వ్యాధినిర్థరణ పరీక్షకు ఎందుకు రావడం లేదని అడిగితే వారి సమాధానం.. ‘భయం.’ అటువంటి వారికి కౌన్సిలింగ్‌ కూడా ఇస్తున్నాం. మీకు అండగా ఉంటాం. ప్రాథమిక దశలో దీన్ని గుర్తించి మా వద్దకు వస్తే చాలు అని చెబుతున్నాం. ఈ ఏడాది కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మా ఇంట్లో వాళ్లు కూడా చాలా జాగ్రతలు చెబుతున్నారు. ఇవన్నీ నాలో ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తాయి. అయితే విధుల్లోకి వెళ్లేటప్పుడు వీటన్నింటినీ ఇంట్లోనే వదిలేస్తున్నా. అప్పుడే కదా మేం ధైర్యంగా సేవచేయగలిగేది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్