Lady Dhoni: ఈ లేడీ ధోనీ.. రచయిత కూడా!

రెండు పడవలపై ప్రయాణం సాధ్యమేనా? అనుకునే వారు ఈ అమ్మాయిల గురించి తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు. ఆటల్లో రాణిస్తూనే దూరవిద్యలోనో, మరో రకంగానో చదువుతూ ఉంటారు కొందరు. అయితే అటు చదువు, ఇటూ ఆట రెండింటి పట్లా ప్రాణం పెట్టే వారు అరుదు...

Updated : 23 May 2021 08:16 IST

రెండు పడవలపై ప్రయాణం సాధ్యమేనా? అనుకునే వారు ఈ అమ్మాయిల గురించి తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు. ఆటల్లో రాణిస్తూనే దూరవిద్యలోనో, మరో రకంగానో చదువుతూ ఉంటారు కొందరు. అయితే అటు చదువు, ఇటూ ఆట రెండింటి పట్లా ప్రాణం పెట్టే వారు అరుదు...

ఒత్తిడిలో ప్రశాంత చిత్తం.. ఎలాంటి బౌలింగ్‌లో అయినా భారీ షాట్లు... ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా.. మెరుపు వికెట్‌ కీపింగ్‌..! ధోనీ లక్షణాలన్నీ ఏకరువు పెట్టినట్టుంది కదా! కానీ ఇవి మాత్రం లేడీ ధోనీ గురించి. ఆమే.. ఇంద్రాణి రాయ్‌. తాజాగా ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లే జట్టులోకి ఎంపికైన ఈ అమ్మాయి బహుముఖ ప్రజ్ఞాశాలి!

ఇంద్రాణిది పశ్చిమ్‌ బగా. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌విమన్‌. ఇంగ్లాండ్‌ టూర్‌కు మొదటిసారిగా భారత జట్టుకు ఎంపికై దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలన్న కలను నిజం చేసుకుంది. ఇంద్రాణి దేశం తరఫున ఏదో ఒక ఆటని ఆడాలనుకునేది. ఓరోజు క్రికెట్‌ సాధనకు వెళుతున్న ఒక అమ్మాయిని చూసి ఆసక్తి కలిగింది. దగ్గర్లోని క్రికెట్‌ అకాడమీలో చేరింది. ఇంద్రాణిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉన్నా తల్లి సంపాదనపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఆమె చిన్న ప్రభుత్వోద్యోగి. సాధన కారణంగా చదువుపై దృష్టిపెట్టలేకపోయింది. దాంతో తండ్రి ఆటకు అడ్డు చెప్పారు. పేరుకు ఆపేసినా.. అమ్మాయిల క్రికెట్‌ కోచింగ్‌ గురించి ఆరా తీస్తూనే ఉండేది. కోచ్‌ గోపాల్‌ మంజీ గురించి తెలుసుకుంది. తన ఆసక్తిని గమనించి ఆయనే తన తండ్రిని ఒప్పించారు. తల్లీ ప్రోత్సహించడంతో పదో తరగతిలో మళ్లీ సాధన ప్రారంభించింది. కొద్ది కాలంలోనే బంగాల్‌ తరఫున అండర్‌-19 జట్టుకు ఎంపికైంది.
బంగాల్‌ టూ ఝార్ఖండ్‌
ఆ రాష్ట్రం తరఫున అండర్‌-19లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన జట్టులో ఇంద్రాణి ఒకరు. ఇదే జట్టులో అండర్‌-23లోనూ ఆడింది. అక్కడ తన కీపింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించే వెసులుబాటు చిక్కలేదు. 2018లో ఝార్ఖండ్‌ జట్టుకు మారాక తనకు గుర్తింపూ మొదలైంది. ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సిరీసుల్లో రాణించింది. తన ఆటతీరుతో ఝార్ఖండ్‌ సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకుంది. జాతీయ సీనియర్‌ వన్డేలో అదరగొట్టి భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అన్నట్టూ.. ఆటలో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఐఐటీ బాంబేలో పీహెచ్‌డీ చేస్తోంది. కవితలు, ర్యాప్స్‌ రాస్తుంది. ఐదేళ్లుగా క్రికెట్‌ రైటర్‌గానూ పని చేస్తోంది.
అలా ఈ పేరొచ్చింది
ఇంద్రాణి ధోనీకి వీరాభిమాని. ఆయన వీడియోలను చూసి, టెక్నిక్‌లను సాధన చేసేది. ఒక సారి అతన్ని కలిసింది. తన నుంచి మెలకువలను తెలుసుకుంది. అన్నింటా మహీలాగే ఉండటం ఆమెకు ‘లేడీ ధోనీ’ పేరు తెచ్చాయి. మగవాళ్ల ప్రమాణాలను అందుకోవాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా అబ్బాయిల టీమ్‌తో సాధన చేసేది. ఈ కష్టపడేతత్వం అమ్మ నుంచే వచ్చిందని చెబుతుంది. పనిపట్ల నిబద్ధత ఆమెను చూసే నేర్చుకున్నానంటోంది. ఇప్పుడు జట్టుతో పాటు క్వారంటైన్‌లోకి వెళ్లనుంది. అది ముగిశాక ఇంగ్లాండ్‌ ప్రయాణం. ఇంత త్వరగా అంతర్జాతీయ స్థాయికి వెళ్తానని ఊహించలేదేమో ఇంద్రాణి పాస్‌పోర్టు కూడా తీసుకోలేదు. ఇప్పుడు సిద్ధం చేసుకుంటోంది. దేశం తరఫున 10-15 సంవత్సరాలు ఆడాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం.

రెండింటిపైనా అదే గురి!

టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికైన 19 ఏళ్ల మనుబాకర్‌పై క్రీడాప్రేమికులకి చాలా అంచనాలున్నాయి. అవును... ఒకేసారి షూటింగ్‌లో మూడు విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన ఏకైక క్రీడాకారిణి తను. అయినా నా గురి చదువుపైన కూడా అంటోంది మను..

‘చదువు... ఆటలు నాకు రెండూ రెండు కళ్లు’ అని మనుబాకర్‌ చెప్పడానికి కారణం వాళ్ల అమ్మ సుమేదానే. హరియాణాలోని గోరియా గ్రామం మను స్వస్థలం. లింగవివక్ష అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఆడపిల్లలని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని చెబుతూ యూనివర్సల్‌ స్కూల్‌ పేరుతో బడిని నడిపే వారు సుమేధ. ఇక్కడ ఐదో తరగతి దాటిన పిల్లలకు షూటింగ్‌లో శిక్షణ కూడా ఇచ్చేవారు. అయితే ఖరీదైన ఆటోమేటిక్‌ మెషిన్‌గన్‌కి బదులు తక్కువ ఖరీదులో దొరికే మాన్యువల్‌ గన్‌పైనే పిల్లలంతా సాధన చేసేవారు. అలాగని ఈ స్కూల్‌ తక్కువేమీ కాదు. 2013 తర్వాత నుంచి ఈ స్కూల్‌ నుంచి ఎంతో మంది పిల్లలు షూటింగ్‌లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మెడల్స్‌ అందుకున్నారు. ఇక్కడే శిక్షణ తీసుకున్న మను తిరువనంతపురం జాతీయ పోటీల్లో ఒకేసారి 15 పతకాలు గెల్చుకుంది. తల్లి ఆధ్వర్యంలో యోగా నేర్చుకుంది. జూడో, బాక్సింగ్‌, రేసింగ్‌, రాఫ్టింగుల్లోనూ రాటు తేలినా ఇష్టమైన షూటింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంది. ప్రస్తుతం దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో బీఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుతోంది. ‘చదువు, ఆటలు రెండూ ఇష్టమే తనకి’ అని నవ్వుతారు తండ్రి రామ్‌కిషన్‌. మర్చంట్‌నేవీలో చీఫ్‌ ఇంజినీర్‌ ఆయన. కామన్‌ వెల్త్‌, యూత్‌ ఒలింపిక్స్‌, వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన మను... జులైలో జరిగే ఒలింపిక్స్‌కి సిద్ధమవుతోంది. రెండు నెలల శిక్షణ కోసం క్రొయేషియా వెళ్లింది. క్రీడాకారులంతా మాస్క్‌లు, ఆక్సీమీటర్లు, పచ్చళ్లు, వంటకాలు పట్టుకెళ్తుంటే తను మాత్రం పుస్తకాలు మోసుకెళ్లింది. శిక్షణ తీసుకుంటూనే ఫోర్త్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాస్తోంది. అక్కడ తన హోటల్‌ నుంచే పరీక్ష పత్రాలని స్కాన్‌ చేసి కాలేజీకి పంపిస్తోంది. ‘నాకిది కొత్తేం కాదు. గతంలోనూ ఇలానే చేశాను. ఇంకా నయం పరీక్షల సమయంలో పోటీలు లేవు. అంతవరకూ సంతోషం. గతంలో అలాంటి పరిస్థితుల్నీ మేనేజ్‌ చేశా’ అంటోంది మను. తనపై ఉన్న బాధ్యత చిన్నదేం కాదు. ఒలింపిక్స్‌లో తొలిసారిగా ఒకే క్రీడ నుంచి మూడు విభాగాల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా ఎంపికవ్వడం చాలా అరుదు. ‘నాకు సోషల్‌ మీడియా, ఇతరత్రా కాలక్షేపాలు తక్కువ. నాలుగన్నరకి లేచి గంట యోగా చేస్తాను. ఆ తర్వాత సాధన.. మిగిలిన సమయం చదువుపైనే’ అంటోంది మను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్