సేవకు సై అంటున్న బైకర్‌ భామలు!

ఆ పదిమందినీ బైక్‌ రైడింగ్‌ కలిపింది. అదొక్కటేనా అనుకున్నారు... అమర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు ‘షీ ఫర్‌ సొసైటీ’గా ఏర్పడ్డారు. వీరి స్ఫూర్తి వందల మందిని ప్రేరేపించింది... ఇప్పుడా సొసైటీ వేలాది సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. దానికితోడు మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది.

Published : 11 Jun 2021 01:43 IST

ఆ పదిమందినీ బైక్‌ రైడింగ్‌ కలిపింది. అదొక్కటేనా అనుకున్నారు... అమర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు ‘షీ ఫర్‌ సొసైటీ’గా ఏర్పడ్డారు. వీరి స్ఫూర్తి వందల మందిని ప్రేరేపించింది... ఇప్పుడా సొసైటీ వేలాది సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. దానికితోడు మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది. ఈ బైకర్లంతా తాజాగా కొవిడ్‌ రోగుల సాంత్వన కలిగించే కార్యక్రమాలకు నడుం బిగించారు. ఆ వివరాలే ఇవి...

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ ఆస్పత్రుల్లో పడకలే కాదు అంబులెన్స్‌లు కూడా దొరకని స్థితి. ‘‘ఇంటి నుంచి ఆస్పత్రికి, చనిపోయిన వారిని శ్మశానాలకు చేరవేసేందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనించి ‘షీ ఫర్‌ సొసైటీ’ తరఫున తక్షణం పది అంబులెన్స్‌లను సిద్ధం చేశాం. ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న ఈ అంబులెన్స్‌లను సదా సిద్ధంగా ఉంచుతూ రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం’’ అని వసుంధరకు వివరించారు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు హర్షిణీ వెంకటేశ్‌. ఈ సేవలన్నీ ఉచితమే. మే 1న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1500మందికి పైగా రోగులను ఆస్పత్రులకు తరలించారు. ఈ సంస్థకు చెందిన పది మంది సభ్యులు వాట్సప్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అంబులెన్స్‌ సేవలను పర్యవేక్షిస్తుంటారు. ఒకప్పుడు బెంగళూరుకే పరిమితమైన వీరి సేవలు క్రమంగా మరో ఐదు జిల్లాలకూ విస్తరించాయి. ‘షీ ఫర్‌ సొసైటీ’ సాయం అర్థించినవారి దగ్గరకు నిమిషాల్లోనే ఈ అత్యవసర సర్వీసులు బయలుదేరతాయి. ప్రస్తుతం అంబులెన్స్‌లతోపాటు అత్యవసర సేవలకు వినియోగించే క్యాబ్‌లకు ఉన్న డ్రైవర్‌ల కొరతను తీరుస్తున్నారు. అలానే హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారు, బయటకు వెళ్లలేని వృద్ధులు దివ్యాంగులు, గర్భిణులు వారి చిరునామా, ఔషధాల చీటీ వాట్సాప్‌ చేస్తే చాలు ఈ బృంద సభ్యులు వాటిని ఇంటికి చేరుస్తారు. మందుల ఖర్చు మాత్రం తీసుకుంటారు. బెంగళూరు నగరంలో 34 మురికివాడలున్నాయి. వాటిలో జీవనోపాధి కోల్పోయిన వారిని ఈ సంస్థ ఆదుకుంటోంది. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించడం, లేదా దాతలే అవసరార్థులకు ఆహార పదార్థాలు అందించేలా చూస్తారు ఈ సభ్యులు. లాక్‌డౌన్‌ ఉన్న ఏప్రిల్‌, మే నెలల్లో 350 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఉపాధి కోల్పోయిన వలసకార్మికుల్లో కొందరిని గుర్తించి పనులు చూపించారు.

మూడో దశపై దృష్టి
కరోనా మూడో దశ పై నిపుణులు కొన్నాళ్ల నుంచి హెచ్చరిస్తున్నారు. ఆ దశలో పిల్లలే ఎక్కువగా కరోనా బారినపడతారన్న అంచనాల నేపథ్యంలో ఈ సంస్థ తన సేవలను ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఈ సభ్యులు ఉన్న అయిదు జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాలున్న వారిని గుర్తించి, వారి తల్లిదండ్రులతో భేటీ అవుతారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ చిన్నారుల పోషణను స్థానికంగా ఓ దాతకు అప్పగిస్తారు. వీరికి ఆరు నెలల పాటు అవసరమైన పోషకాహారాన్ని ఇంటికి పంపించి అది సద్వినియోగం అయ్యేలా చూస్తారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో రక్తహీనతతో బాధపడే పిల్లలు, తల్లులు ఎక్కువగా ఉండటంతో అటువంటి వారికి అక్కడి సంస్థల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నారు.

సేవలు విస్తరిస్తాం...
బెంగళూరుతో పాటు సైనికులు ఎక్కువగా ఉండే మాండ్య, కొడగు, కోలార వంటి జిల్లాల్లో వందల వీరజవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. వారి కుటుంబాల్లో ఎవరికైనా కరోనా సోకితే సంస్థ సభ్యులు దగ్గరుండి చికిత్సలు చేయిస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు బైకులపై ఎన్నో రాష్ట్రాల్లో పర్యటించాం. అత్యంత శీతల, ఉష్ణోగ్రతలున్న ప్రాంతాలనూ చుట్టేశాం. మహిళల సామర్థ్యాల్ని చాటడం, వారి సేవా గుణాన్ని ప్రపంచానికి తెలపడం, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నాం. వాటితో పాటు కరోనా నుంచి కొందరినైనా రక్షించగలిగితే మా సేవలకు సార్థకత ఉంటుందని భావించాం. కరోనా తగ్గినా మా కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఈ దిశగా ఇటీవలే బెంగళూరు నగర పాలికెతో ఒప్పందం చేసుకున్నాం. మేం చేస్తున్న ఈ పనివల్ల ఎందరో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు. అదే మాకు ఆనందం. ఈ సంస్థ హెల్ప్‌లైన్లు 9972159315, 9663565321.

కె.ముకుంద, బెంగళూరు

జీవితంలో సంతోషాలే కాదు, దుఃఖాలూ ఉంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ ఆశావహంగా ముందుకెళ్లాలి.
- కరీనా కపూర్‌, బాలీవుడ్‌ నటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్