11 ఏళ్లుగా నిత్యాన్నదానం

పండగ కాదు.. పెళ్లికాదు.. కానీ రోజూ ఆ ఇంట్లో 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే... అన్నార్తుల కడుపు నిండాల్సిందే! పదకొండేళ్లుగా ఈ నిత్యాన్నదానాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు కోనేరు

Published : 24 Jun 2021 01:27 IST

పండగ కాదు.. పెళ్లికాదు.. కానీ రోజూ ఆ ఇంట్లో 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే... అన్నార్తుల కడుపు నిండాల్సిందే! పదకొండేళ్లుగా ఈ నిత్యాన్నదానాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు కోనేరు రమాదేవి...

కొవిడ్‌ కారణంగా అనేకమంది ఉపాధిలేక పస్తులున్నారు. వీరిందరికీ మేమున్నాం అని భరోసా ఇచ్చి వారి ఆకలిబాధను తీర్చారు రమాదేవి. ఈ యజ్ఞం నిన్నా మొన్నటిది కాదు. పదకొండేళ్ల క్రితం పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన సతీమణి రమాదేవి దీన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఇంట్లో ఉదయం ఆరు గంటలకే పొయ్యి వెలుగుతుంది. పాతికమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి వంట-వార్పులో దిగుతారు. కూరగాయలు తరుగుతూ, బియ్యం పొయ్యిమీద కెక్కిస్తూ, తాలింపులు వేస్తూ సందడిగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం. వీటన్నింటిని రమాదేవి పర్యవేక్షిస్తారు. అన్నం, పప్పులు, ఊరగాయ, కూరలను ప్యాక్‌ చేసి విస్తర్లు సైతం అందజేస్తున్నారు. ఈ క్రతువులో ఆమెతోపాటు ఆమె తోటికోడళ్లు కోనేరు ఉషాకిరణ్‌, విజయశ్రీ, రుక్మిణిదేవితో పాటు కుమార్తె ప్రతిమ రోజూ పాల్గొంటారు. ‘1981లో మా వివాహమైంది. ఎమ్మెల్యేగా ఆయన ఇంటి వద్ద ఉండడం తక్కువ. తక్కిన కుటుంబ సభ్యులంతా ఈ పనిలో నిమగ్నమవుతాం. మా ఫోన్‌ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాం. వాటికి రోజూ వందలమంది భోజనం కావాలని సంప్రదిస్తారు. స్వచ్ఛంద కార్యకర్తలు 20 మంది భోజనపు సంచులను తీసుకెళ్లి పంచి వస్తున్నారు. ప్రస్తుతం ఆరొందలమందికి భోజనాన్ని అందిస్తున్నాం.

నిత్యం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఉదయం 75 కిలోల బియ్యం, సాయంత్రం 75 కిలోలు మొత్తం 1.50 క్వింటాళ్లు, క్వింటా కూరగాయలను వండుతున్నాం. ఇందుకు కొందరు దాతలు సహకరిస్తున్నారు. కర్మ కార్యక్రమాలకు భోజనాలు కావాలని కూడా కొందరు పేదలు సంప్రదిస్తూంటారు. ఇప్పటి వరకు 50 పైనే కార్యక్రమాలకు ఇలా భోజనం అందించాం. ఎంత మంది ఉన్నా ముందుగా ఫోన్‌ చేసి చెప్తే చాలు భోజనం వారి ఇళ్ల వద్దకే చేరుస్తున్నాం. ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా ఉండాలనే సంకల్పంతో 40 ఆక్సిజన్‌ సిలెండర్లు తెప్పించి నిరంతరం అందుబాటులో ఉంచాం. అధికారం ఉన్నా, లేకున్నా, ఆపద సమయంలో వారికి కడుపునిండా భోజనం పెట్టడం, వైద్యపరంగా అండగా ఉండటంతో వారి కళ్లలో కనిపించే ఆనందం ముందు ఏదీ ఎక్కువ కాదు. కష్టాలు తీరి, కడుపు నిండిన పేదల ముఖాల్లో సంతోషాన్ని చూస్తే కలిగే తృప్తే వేరు’ అని వివరించారు రమాదేవి.

- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్