అందుకే దీనిని తీసుకోవాలట..!

ఉల్లిలాగే.. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం దాకా.. వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 19 Aug 2023 12:10 IST

ఉల్లిలాగే.. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం దాకా.. వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు అంటున్నారు నిపుణులు.

మెరుగయ్యే రక్తప్రసరణ..

వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది శరీరం లోపల రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు. కానీ వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోబోయే వారు మాత్రం వెల్లుల్లి వినియోగం విషయంలో ఓసారి వైద్యుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

కొవ్వును కరిగిస్తుంది!

బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయి. కారణం వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే పదార్థమే. అందుకే శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి సాటి లేదు. ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వీటికీ మంచి మందే..!

వెల్లుల్లి తీసుకోని వారితో పోల్చితే.. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట! వీటితో పాటు వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

రక్తహీనతను దూరం చేస్తూ..

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది జంక్‌ఫుడ్స్‌కి అలవాటుపడి పోయారు. దీంతో తగినన్ని పోషకాలు అందవు. ఫలితంగా రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లి. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారు రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని