‘గుల్కంద్’తో ఆ సమస్యలు పరార్!
ఎండాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్యాల్ని ఎదుర్కోవడానికి ముందు నుంచే మన ఆహారపుటలవాట్లలో బోలెడన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాం. శరీరానికి చల్లదనాన్ని అందించే పదార్థాల్ని....
ఎండాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్యాల్ని ఎదుర్కోవడానికి ముందు నుంచే మన ఆహారపుటలవాట్లలో బోలెడన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాం. శరీరానికి చల్లదనాన్ని అందించే పదార్థాల్ని తీసుకుంటుంటాం. అలా మన సమ్మర్ మెనూలో గుల్కంద్ (గులాబీ పూరేకల జామ్)కు ప్రత్యేక స్థానమివ్వమంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ కాలంలో రోజుకో టీస్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలకు సంబంధించిన నెలసరి సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే గుల్కంద్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందామా...
ఎలా తయారుచేసుకోవాలంటే..?
‘ఎండాకాలంలో చాలామందికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు అనుభవమే. దీంతో పాటు చెమట కారణంగా కుదుళ్లలో దురద, చర్మంపై పగుళ్లు.. ఇలా సౌందర్య పరంగానూ ఈ కాలం సవాలే! అయితే వీటన్నింటినీ ఏకకాలంలో ఎదుర్కొనే అద్భుత ఔషధం మన వంటింట్లోనే ఉంది. అదే గుల్కంద్. గులాబీ పూరేకలతో చేసే ఈ జామ్ చూడగానే తినాలన్నంత ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. చక్కటి రుచి, సువాసనను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ వేసవిలో దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వేసవి తాపానికి దూరంగా ఉండచ్చు. పైగా మనం దీన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు కూడా! ఇందుకోసం ఒక గ్లాస్ జార్లో అడుగున కొన్ని గులాబీ పూరేకల్ని ఉంచి.. దానిపై కాస్త చక్కెర పోయాలి.. ఆపై గులాబీ రేకలు-చక్కెర.. ఇలా జార్ మొత్తాన్ని ఈ రెండు పదార్థాలతో లేయర్లుగా నింపాలి. ఇప్పుడు ఈ జార్ మొత్తాన్ని సూర్యరశ్మి తగిలే చోట పది రోజుల పాటు ఉంచితే రుచికరమైన గుల్కంద్ తయారవుతుంది. గుల్కంద్ తయారీలో ఒకవేళ చక్కెర వద్దనుకుంటే - బెల్లం పౌడర్/చెరకుగడ లాంటివి వాడుకోవచ్చు.
రోజుకో టీస్పూన్ చాలు!
⚛ థైరాయిడ్, నెలసరికి ముందు స్పాటింగ్, మలబద్ధకం.. వంటి సమస్యలున్న వారు.. రోజూ టీస్పూన్ గుల్కంద్ని గ్లాసు నీటిలో కలుపుకొని తీసుకోవాలి. తద్వారా చక్కటి ఫలితం ఉంటుంది.
⚛ ఎసిడిటీ వల్ల చాలామందికి రాత్రుళ్లు నిద్ర పట్టదు. అలాంటివారు రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలల్లో టీస్పూన్ గుల్కంద్ కలుపుకొని తీసుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది.
⚛ కొంతమందికి భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తుంటుంది. మరికొంతమంది టీ/కాఫీ వంటివి తాగుతుంటారు. ఇలాంటి వారు గుల్కంద్తో ఈ కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇందుకోసం భోంచేశాక టీస్పూన్ గుల్కంద్ తింటే సరిపోతుంది.
⚛ పరగడుపున, భోజనం తర్వాత టీస్పూన్ గుల్కంద్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
⚛ కొత్తగా తల్లైన వారు, దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్యలున్న వారు, ఐరన్-ఫోలికామ్లం లోపంతో బాధపడుతున్నవారు.. తమలపాకుపై టీస్పూన్ గుల్కంద్ని వేసుకొని పాన్లాగా చుట్టుకోవాలి. దీన్ని రోజూ భోజనం తర్వాత తీసుకుంటే ఐరన్ స్థాయులు పెరుగుతాయి.
ప్రయోజనాలెన్నో!
ఈ గుల్కంద్ వల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటంటే..!
⚛ చాలామంది మహిళలు పీసీఓఎస్తో బాధపడుతుంటారు. వీరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చర్మ ఛాయ క్రమంగా తగ్గడం, చర్మంపై పగుళ్లు, అవాంఛిత రోమాలు, మొటిమలు.. వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు రోజుకో టీస్పూన్ చొప్పున గుల్కంద్ తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
⚛ ఇక థైరాయిడ్తో బాధపడుతోన్న వారికి నెలసరికి ముందు స్పాటింగ్, బ్రౌన్ డిశ్చార్జ్, బ్లాక్ డిశ్చార్జ్.. వంటివి సహజంగా జరుగుతుంటాయి. అలాంటప్పుడు గుల్కంద్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు.
⚛ హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారు గుల్కంద్ని తీసుకోవడం వల్ల రక్తాన్ని పెంచుకోవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడానికీ ఇది తోడ్పడుతుంది.
⚛ మలబద్ధకంతో బాధపడే వారు గుల్కంద్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా సమస్య నుంచి బయటపడచ్చు. అలాగే చాలామంది పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉంటుంది. అలాంటివారికీ దీన్ని అందిస్తే సత్వర పరిష్కారం దొరుకుతుంది.
⚛ అలసట-నీరసాన్ని దూరం చేసుకొని శక్తిని పెంచుకోవడానికి, చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి, అజీర్తిని దూరం చేసుకోవడానికి.. ఇలా అన్ని సమస్యలకు గుల్కంద్ పరిష్కారం చూపుతుంది.
భోజనం తర్వాత (ఒక టీస్పూన్), రాత్రి పడుకునే ముందు (గ్లాసు పాలల్లో టీస్పూన్ కలుపుకొని), వ్యాయామం తర్వాత (గుల్కంద్ మిల్క్షేక్).. ఇలా రోజూ గుల్కంద్ని తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.