పెళ్లి వేళ మరింత అందంగా..!

సాధారణంగా ఇతరుల పెళ్లిళ్లకు హాజరయ్యే క్రమంలో అందరికంటే అందంగా మెరిసిపోవాలని కోరుకునే మనం.. మన పెళ్లిలో మరింత ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా రడీ అవ్వాలనుకుంటాం.

Updated : 02 Sep 2023 20:48 IST

సాధారణంగా ఇతరుల పెళ్లిళ్లకు హాజరయ్యే క్రమంలో అందరికంటే అందంగా మెరిసిపోవాలని కోరుకునే మనం.. మన పెళ్లిలో మరింత ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా రడీ అవ్వాలనుకుంటాం. అయితే ముఖంపై ఉండే మొటిమలు, ఇతర సమస్యలు ఆ ఆశను ఆవిరి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

నారింజ తొక్కలతో..

నారింజ తొక్కలో రెటినాల్, విటమిన్ ‘సి’ ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు మేనిఛాయను సైతం పెంచుతాయి. దీనికోసం నారింజ తొక్కలను బరకగా తురుముకొని.. దీంతో ముఖాన్ని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోయి.. ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

నారింజ తొక్కలను తీసుకొని వాటిని రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. దీనిలో కొంత భాగాన్ని తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్‌స్పూన్ల నీటిలో పల్చటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయడం ద్వారా ముఖం అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

బంగాళాదుంపతో..

బంగాళాదుంపల్లో సహజ బ్లీచ్ లక్షణాలుంటాయి. ఇవి ముఖంపై ఉన్న నల్ల మచ్చలను చర్మం రంగులో కలిపేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి బంగాళాదుంపను శుభ్రంగా కడిగి పొట్టు తీసి దాన్ని తురుముకోవాలి. ఆ తర్వాత దీనిపై కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారంలో మూడు రోజులు పాటిస్తే.. ముఖంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

పెరుగుతో..

ముఖంపై ఏర్పడిన హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను పెరుగుతో పోగొట్టుకోవచ్చు. పెరుగుని సమస్య ఉన్న చోట రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.

పెరుగుతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు. దీనికోసం టేబుల్‌స్పూన్ పెరుగు, రెండు టేబుల్‌స్పూన్ల ఓట్స్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అలాగే రోజ్‌వాటర్, తేనె, పెరుగు కలిపి మిశ్రమంగా చేసుకొని దాన్ని కూడా ఫేస్‌ప్యాక్‌ లాగా ఉపయోగించుకోవచ్చు.

మజ్జిగతో సైతం ముఖంపై ఏర్పడిన మచ్చలను దూరం చేసుకోవచ్చు. గిన్నెలో నాలుగు చెంచాల మజ్జిగ వేయాలి. దానికి రెండు చెంచాల టొమాటో రసం కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దాన్ని పూర్తిగా ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేయడం ద్వారా మచ్చలను తగ్గించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని