Updated : 27/02/2023 21:23 IST

సహజంగానే.. అపురూప సౌందర్యం!

చర్మ సౌందర్యాన్ని, కేశ సంపదను కాపాడుకోవడానికి మార్కెట్లో దొరికే పలు రకాల ఉత్పత్తులను వాడటానికే నేటి యువత అధిక ప్రాధాన్యమిస్తోంది. కానీ వీటివల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఇలా కాకుండా మన పూర్వీకులు ఉపయోగించిన కొన్ని సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే అపురూప సౌందర్య రాశిగా మెరిసిపోవచ్చు. అలాంటి కొన్ని పదార్థాలు, అవి కలిగించే ప్రయోజనాలు.. మొదలైన అంశాల గురించి తెలుసుకుందామా మరి..

పసుపు..

పసుపు మేనిఛాయను పెంచడంతో పాటు అవాంఛిత రోమాలను సైతం తగ్గిస్తుంది. ఇది చర్మంపై ముడతలను నివారిస్తుంది. దీనికోసం కొద్దిగా బియ్యప్పిండిలో పచ్చిపాలు, టొమాటో రసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పసుపుని కూడా జత చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

తులసి..

అటు ఆధ్యాత్మిక పరంగా.. ఇటు ఆరోగ్యపరంగా భారతీయులు తులసికిచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇది అందం విషయంలోనూ ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు మొటిమలను నివారించి చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మారేలా చేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమలను నివారించి చర్మసంరక్షణకు తోడ్పడుతుంది.

ఉసిరి..

విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే ఉసిరి చర్మంపై చేరిన బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. ప్రత్యేకించి కేశసంరక్షణ విషయంలో దాని ప్రాధాన్యం ఎనలేనిది. ఇది కుదుళ్లను దృఢంగా చేసి పొడవుగా అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. రెండు చెంచాల ఉసిరి రసాన్ని తీసుకొని అంతే మోతాదులో నిమ్మరసానికి జతచేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత వేడినీళ్లతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

వేప..

ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య సంరక్షణలోనూ వేప ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. చర్మంపై బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు.. వంటివి ప్రభావం చూపించకుండా కాపాడుతుంది. ఈ ఫలితాన్ని పొందడానికి కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనిలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

పొడిచర్మంతో బాధపడే వారు వేప పొడిలో కొన్ని చుక్కల ఆయిల్‌ కలిపి దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం తేమను సంతరించుకుంటుంది.

చర్మ సౌందర్యం విషయంలోనే కాకుండా కురుల సంరక్షణలోనూ వేప మేలు చేస్తుంది.

వేపనూనెను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

కుంకుమ పువ్వు..

ప్రాచీన కాలం నుంచి భారతీయులు పాటించే సౌందర్య చిట్కాల్లో కుంకుమ పువ్వుకి విశిష్టమైన స్థానం ఉంది.

రాత్రిపూట పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టి మరుసటి రోజు మెత్తగా చేసి ట్యాన్‌ ఉన్నచోట రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ముప్పై నిమిషాల పాటు నాననిచ్చి దానిలో రెండు చెంచాల గంధం పొడిని కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది.

అయితే ఇవన్నీ సహజసిద్ధమైన పదార్ధాలే అయినప్పటికీ ఒక్కోసారి కొంతమందికి పడకపోవచ్చు. ఈ క్రమంలో- వీటిని ఉపయోగించే ముందు చర్మతత్వాన్ని బట్టి అవసరమైతే వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని